కేటీఆర్ పేరుతో భూ కబ్జా! సిరిసిల్ల జిల్లాలో కలకలం..
posted on Jun 15, 2021 @ 12:12PM
తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో భారీగా భూ ఆక్రమణలు జరుగుతున్నాయనే ఫిర్యాదులు వస్తుండగా.. తాజాగా కేటీఆర్ పేరుతోనే భూదందాకు పాల్పడిన ఘటన వెలుగు చూసింది. సిరిసిల్ల జిల్లా మున్సిపల్ విలీన గ్రామం రగుడులో మంత్రి కేటీఆర్ అనుచరుడినంటూ ఓ వ్యక్తి భూకబ్జా చేశారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుకున్నాయి.
రగుడుకు చెందిన బూర ఎల్లయ్యది నిరుపేద కుటుంబం. తనకున్న కాస్త భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే, ఎల్లయ్యకు 1178,1179,1179/31,1179/7, 1179/31/1,1180/8 గల సర్వే నెంబరులలో 59 గుంటల భూమి ఉంది. గత కొన్నేళ్లుగా రైతుబంధు, క్రాప్లోన్ తీసుకుంటూ తనకున్న భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రగుడు నుంచి వెంకటాపూర్ వరకు రెండో బైపాస్ రోడ్డు నిర్మాణం ప్రభుత్వం చేపట్టడంతో బైపాస్ రోడ్డు వెంబడి భూములకు మంచి గిరాకీ ఏర్పడింది. దాంతో రగుడు గ్రామానికి వెళ్ళే దారిలో ఎల్లయ్య భూమి ఉండటంతో ఆ భూమిపై అక్రమార్కుల కన్ను పడింది.
ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్ పేరు చెబుతూ... స్థానిక టీఆర్ఎస్ నేత ఒకరు తన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎల్లయ్య దంపతులు ఆరోపిస్తున్నారు. భూమి హక్కు దారులకు ప్రభుత్వం మంజూరు చేసిన పట్టా పాసు పుస్తకంతో పాటు రైతుబంధు వస్తున్నప్పటికీ.. ఆ భూమిలో వ్యవసాయం చేసుకునేందుకు సదరు టీఆర్ఎస్ నేత గత కొద్ది నెలలుగా అడ్డు పడుతున్నాడని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో భూమిని దున్నేందుకు భూ యజమాని వెళ్లగానే అక్కడికి వచ్చిన టీఆర్ఎస్ నేతలు అధికార బలంతో అడ్డుకుంటున్నారని వృద్ధ దంపతులు కన్నీరుమున్నీయ్యారు. కేటీఆర్ పేరిట జరుగుతున్న భూదందాను మీడియా ద్వారా మంత్రికి వివరిస్తూ తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
తమ భూమిని కబ్జా చేయాలని చూడటంతో ఏం చేయాలో తెలియని వృద్ధ దంపతులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆయా సర్వేనెంబర్లో ఉన్న భూమి బుర్ర ఎల్లయ్య చెందినదేనని తాను ఆ భూమిలో వ్యవసాయం చేసుకోవచ్చని కోర్టు తీర్పునిచ్చింది. దాంతో అక్రమార్కులు ఎల్లయ్యకు సంబంధించిన భూమిలో సాగు చేయకుండా వ్యవసాయ యంత్రాల యాజమానులకు ఫోన్ చేసి బెదిరిస్తూ వ్యవసాయం చేయకుండా అడ్డుకుంటున్నాడు. దీంతో ఏం చేయాలో తెలియని దీనస్థితిలో వారు మీడియా ముందుకు వచ్చారు. తాను మంత్రి కేటీఆర్ అనుచరుడని.. కోర్టు, పోలీస్ స్టేషన్ల చుట్టూ మీరు ఎంత తిరిగినా ఏమీ చేయలేరని, అవసరమైతే మిమ్మల్ని చంపి అయినా మీ భూమిని లాక్కుంటనని అంటున్నాడని ఆ వృద్ధ దంపతులు మీడియా ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని వృద్ధ దంపతులు వేడుకుంటున్నారు.