చిట్ఫండ్ ఛీట్.. ఒడిషా సీఐడీ అదుపులో వైసీపీ నేత
posted on Sep 7, 2021 @ 3:23PM
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయనే ఆరోపణలు వస్తున్నాయి. అధికార వైసీపీ నేతలు అడ్డగోలు దందాలకు తెర తీశారని..ఇసుక, మైనింగ్, లిక్కర్ సహా దేన్ని వదిలిపెట్టకుండా దోచుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. జగనన్న అండ చూసుకొని కొందరు వైసీపీ నేతలు అక్రమార్జనకు తెరతీశారని విమర్శలు వస్తున్నాయి. ఇదేమిటని ప్రశ్నించిన వారిపై రివర్స్ లో కేసులు బనాయించి జైలుకు పంపుతున్న వైనం చర్చనీయాంశమైంది.
అధికార పార్టీ నేతలు కావడంతో చాలా వరకు వాళ్ల బయటికి రావడం లేదని అంటున్నారు. కొందరు బాధితులు ఫిర్యాదు చేసిన అధికార పార్టీ నేతలు కావడంతో కేసులు నమోదు కావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు నేతల అక్రమాలపై సంబంధించి కోర్టు ఆదేశాలతో విచారణలు కూడా జరుగుతున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్నారు కాబట్టి వైసీపీ నేతలు ఇక్కడ దర్జాగా తమ పని కానిచ్చేస్తున్నారు. కాని పక్క రాష్ట్రంలో అలా కుదరదుగా. ఇప్పుడు అదే జరిగింది. వైసీపీ నేత ఒకరిని ఒడిషా పోలీసులు అదుపులోనికి తీసుకోవడం కలకలం రేపింది.
విశాఖకు చెందిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే, ఏపీ ఎడ్యుకేషన్, వెల్ఫేర్ డెవల్పమెంట్ కార్పొరేషన్ చైర్మన్ మళ్ల విజయ ప్రసాద్ ను చిట్ఫండ్ కేసులో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఒడిశా సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ‘వెల్ఫేర్’ సంస్థ పేరుతో విజయ ప్రసాద్ రియల్ ఎస్టేట్, చిట్ఫండ్ వ్యాపారం చేస్తున్నారు. ఏపీ, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో బ్రాంచీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే ఒడిశాలోనూ చిట్ఫండ్ వ్యాపారం చేసిన విజయ ప్రసాద్…డిపాజిట్దారులకు సక్రమంగా చెల్లింపులు జరపలేదన్న ఆరోపణలున్నాయి. ఈ ప్రకారం విజయప్రసాద్ పై పలువురు ఖాతాదారులు గతంలో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే విజయ ప్రసాద్ పై ఒడిశా సీఐడీ పోలీసులు రెండేళ్ల కిందట కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆ కేసు విచారణలో భాగంగా విశాఖ వచ్చిన సీఐడీ పోలీసులు విజయ్ప్రసాద్ను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక ఉన్నతాధికారుల అనుమతితో ఆయన నివాసంలోనే సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ ఫిర్యాదులపై విచారణ చేసేందకు విజయ ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక పోలీసులకు సీఐడీ పోలీసులు సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీ నేతలను ఒడిషా పోలీసులు అదుపులోనికి తీసుకోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది.