పనికిమాలిన అమెరికా: ఒబామా నిస్పృహ
posted on Jun 14, 2014 @ 11:23AM
భద్రత విషయంలో అమెరికా అంత పనికిమాలిన, దరిద్రపు దేశం మరొకటి లేదని సాక్షాత్తూ ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. అమెరికాలో ఒకరి మీద ఒకరు కాల్పులు జరుపుకోవడం మామూలైపోయింది. పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకూ తమ దగ్గర వున్న తుపాకీని ఎప్పుడు ఉపయోగించాలా అని తహతహలాడిపోతూ వుంటారు. వీలు దొరికితే ఏ కారణం లేకుండానే కనిపించినవారిని కనిపించినట్టు పిట్టల్లా కాల్చేస్తూ వుంటారు. ఈ దారుణాలు ఎక్కువగా అమెరికా స్కూళ్ళలో జరుగుతూ వుంటాయి. ఇలాంటి సంఘటనల మీద అమెరికా అధ్యక్షుడు ఒబామా తీవ్రంగా స్పందించారు. పాఠశాలల్లో వరుసపెట్టి కాల్పులు సంఘటనలు జరుగుతుండటంతో వాటికి ఇంతవరకు అడ్డుకట్ట వేయలేనందుకు అమెరికా సిగ్గుపడాలని ఒబామా అన్నారు. 18 నెలల వ్యవధిలో ఏకంగా 74 కాల్పుల సంఘటనలు అమెరికాలో జరిగాయి. లేటెస్ట్.గా ఓరెగాన్ హైస్కూల్లో 14 ఏళ్ల అబ్బాయిని ఒకడు కాల్చి చంపాడు. ఈ సంఘటన ఒబామా మనసును కలచివేయడంతో ఆయన చాలా నిస్పృహతో మాట్లాడారు. అమెరికాలో తప్ప ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి సంఘటనలు జరగడం లేదని, తరచుగా జరుగుతున్న ఇలాంటి సంఘటనలు అమెరికా పరువుని ప్రపంచవ్యాప్తంగా తీస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారానికోసారి ఇలా కాల్పులు జరుగుతున్న అభివృద్ధి చెందిన దేశం ఏదీ ఈ భూప్రపంచం మీద లేదని, అమెరికాలోనే ఇలా జరుగుతోందని అన్నారు. 2012 డిసెంబర్లో జరిగిన హత్యాకాండ తర్వాత ఇప్పటివరకు 74 సంఘటనలు జరిగాయి. అమెరికాలో విచ్చలవిడిగా ఉన్న గన్ కల్చర్ మీద ఇప్పటికే చాలాసార్లు చర్చలు జరిగినా, దాన్ని మాత్రం ఇంతవరకు అరికట్టలేకపోయారు. చివరకు చిన్నపిల్లల చేతుల్లో కూడా తుపాకులు ఉండటం, వాళ్లు వాటిని ఇష్టారాజ్యంగా ఉపయోగించడం లాంటివి కనిపించాయి.