మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసు.. వైసీపీ నేతలకు బిగిసిన ఉచ్చు!
posted on Aug 4, 2024 9:10AM
అన్నమయ్య జిల్లా, మదనపల్లె ఫైళ్ల దగ్ధం ఘటనకు సంబంధించి వైసీపీ నేతలకు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. వీరంతా వైసీపీ నేతలే కావడం గమనార్హం.
మదలపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధం వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని తొలి నుంచీ ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు కావడంతో ఆ ఆరోపణలలో బలం ఉందని తేలిపోయింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా, మునిసిపల్ వైస్ ఛైర్మన్ జింకా వెంకటాచలపతి, పెద్దిరెడ్డి ప్రధాన అనుచరులు మాధవరెడ్డి, రామకృష్ణారెడ్డిలపై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. . కేసు వివరాలను మదనపల్లె ఏడీజే కోర్టులో సమర్పించారు.
మొత్తం8 కేసులు నమోదు చేసినట్లు గతంలో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ప్రకటించిన సంగతిత తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ నాలుగురిపై ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. నిందితుల ఇళ్లల్లో పోలీసులు సోదాలు నిర్వహించగా వారి దగ్గర భూముల పత్రాలు లభించాయి. మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా ఇంటి నుంచి 8 ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో కోటి రూపాయల పైబడి భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన దస్తావేజులు ఉన్నట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. వెంకటాచలపతి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న 10 దస్త్రాల్లో మదనపల్లె తహసీల్దార్ కార్యాలయంలో ఉండాల్సిన ప్రొసీడింగ్స్ కు సంబంధించిన ఫైళ్ల జిరాక్స్ లు లభ్యమయ్యాయి. మాధవరెడ్డి నివాసంలో 59, రామకృష్ణారెడ్డి నివాసం నుంచి 124 ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలన్నీ ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన పోలీసులు నాన్బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. నిందితులపై ఫోర్జరీ, ప్రభుత్వ రికార్డుల ట్యాంపరింగ్, దొంగతనం, చోరీ సొత్తు కలిగి ఉండటంతో పాటు సాక్ష్యాలు మాయం చేయడం, నిందితులకు సహకరించడం వంటి ఆరోపణలపై ఆయా సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
ఇలా ఉండగా నాన్ బెయిలబుల్ కేసులు నమోదైన వైసీపీ నేతలు యాంటిసిపేటరీ బెయిలు కోసం కర్నూలు కోర్టును ఆశ్రయించారు. తమపై నమోదు చేసిన కేసుల వివరాలను తెలపాలని, అలాగే తమపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ వీరు కర్నూలు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఇలా ఉండగా ఈ వైసీపీ నేతల నివాసాలలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫైళ్లే సబ్ కలెక్టరేట్ కార్యాలయం దగ్ధం కేసులో కీలకమని పోలీసులు చెబుతున్నారు.