తిండి లేదు.. తాగడానికి మురికినీళ్లే దిక్కు! వరద బాధితులను వదిలేసిన జగన్ సర్కార్
posted on Nov 21, 2021 @ 11:20AM
కుండపోత వర్షాలు, వరదలతో అల్లాడిపోయిన రాయలసీమలో దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత మూడు రోజులతో పోలిస్తే వర్షాలు తగ్గినా... వరద ముంపు మాత్రం ఇంకా పోలేదు. కడప, చిత్తూరుతో పాటు నెల్లూరు జిల్లాల్లో దుర్భత పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడి వరద బాధిత ప్రాంతాల్లోని పరిస్థితి చూస్తే గుండె చెరువైపోతుంది. వరద బారిన పడిన ప్రజలు కట్టుబట్టలతో మిగిలిపోయారు. చివరికి గూడు కూడా మిగలని కుటుంబాలు ఎన్నో. అక్కడ కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తి స్థాయిలో మెరుగుపడక .. పూర్తి సమాచారం బయటకు రావడం లేదు.
వరద బాధితులు ఆకలితో అలమటిస్తున్నారు. మంచి నీరు దొరక్క మురికినీళ్లతోనే కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంత దుర్భరమైన పరిస్థితి ఉంటే హుటహుటిన స్పందించాల్సిన అధికార యంత్రాంగం జాడ లేకుండా పోయింది. జరిగేదేదో జరుగుతుందన్నట్లుగా అధికారులు చూస్తూ ఉండిపోతున్నారు. వరద పరిస్థితిపై మూడు రోజుల ముందుగానే అంచనాలు ఉన్నాప్పటికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. విరుచుకుపడిన తర్వాత కూడా అదే పరిస్థితి. అంతా అయిపోయిన తర్వాత కూడా అదే. అధికారుల నిర్లక్ష్యంతో పోయిన ప్రాణాలు పోగా .. ఎలాగోలా ప్రాణాలు కాపాడుకున్న వారికి ఆకలిదప్పులు తీర్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది.
వరద ప్రాంతాల్లో స్వచ్చంద సంస్థలు చేస్తున్న అరకొర సాయమే ఎక్కువగా ఉంది. ప్రభుత్వం వైపు నుంచి పునరావాస శిబిరాలే అతి తక్కువగా ఉంటే.. అందులోకి తరలించుకు వచ్చిన వారు ఇంకా తక్కువ. వచ్చిన వాళ్లకు కూడా సరిగ్గా ఆహారం అందించడం లేదు. కనీసం మంచి నీళ్లు కూడా అందుబాటులో లేవంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు. తమ ఆస్తులు పొగొట్టుకున్న రోడ్డున పడ్డ బాధితులు.. ఏం చేయోలో తెలియక కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తమకు న్యాయం చేయాలంటూ అనేక చోట్ల ప్రజలు ఆందోళనలకు దిగుతున్నారు. ఇంత దారుణంగా పరిస్థితి ఉంటే ప్రభుత్వం నిమిత్త మాత్రంగా ఉండటం ఏమిటన్న ఆగ్రహం వారిలో కనిపిస్తోంది.
ప్రభుత్వంలోని పై స్థాయి వాళ్లే పెద్దగా పట్టించుకోవడం లేదు. సీఎం జగన్ సొంత జిల్లాలోనూ సహాయ చర్యలకు దిక్కు లేకుండా పోయింజి. దీంతో కింది స్థాయి అధికార యంత్రాగం కూడా అంతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వరద వస్తుంది… పోతుంది అన్న పద్దతిలో ఫిక్సయిపోయారు. అలాగే వచ్చింది.. పోయింది.. కానీ తుడిచిపెట్టుకుపోయిన జీవితాల గురించి మాత్రం ఎవరూ ఆలోచించడం లేదు. ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు ప్రభుత్వాల స్పందన వేరుగా ఉంటుంది. ఇప్పటి వరకూ అఘామేఘాల మీద ప్రజా జీవితాన్ని సాధారణ స్థితికి తీసుకొచ్చే ప్రభుత్వాలను చూశాం కానీ నిమ్మకు నీరెత్తినట్లుగా.., జరగాల్సింది జరుగుతుందన్నట్లుగా చూసే ప్రభుత్వాలను మాత్రం ప్రజలు ఇప్పుడే చూస్తున్నారు.