వివేకా గొడ్డలిపోటు సూత్రధారి ఎంపీ అవినాశ్ రెడ్డే!
posted on Nov 17, 2021 @ 8:59PM
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. వివేకా కారు డ్రైవర్ ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్ మెంట్ ప్రకంపనలు రేపుతుండగా.. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న వైసీపీ నేత దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. శివశంకర్ రెడ్డి అరెస్టుతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని అంటున్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి టీడీపీ నేత నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివేకా డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలం మేరకు గొడ్డలిపోటు సూత్రధారి వైసీపీ ఎంపీ వైయస్ అవినాశ్ రెడ్డేనని ఆరోపించారు. హైదరాబాదులో శివశంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడం అనుమానాలను మరింత బలపరుస్తోందని చెప్పారు.
అవినాశ్ రెడ్డికి శివశంకర్ రెడ్డి అన్నీ తానై వ్యవహరించారని లోకేష్ అన్నారు. ఈ హత్యలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి శివశంకర్ రెడ్డి పాత్రపై ముందు నుంచి అనుమానాలు ఉన్నాయని చెప్పారు లోకేష్. ఈ కేసు నుంచి అవినాశ్ రెడ్డిని తప్పించేందుకు సిట్ బృందాన్ని జగన్ మార్చేశారని మండిపడ్డారు. సీబీఐ విచారణ వద్దన్నది కూడా జగనే అని దుయ్యబట్టారు. తన బులుగు మీడియాలో వైయస్సాసుర చరిత్ర గురించి జగన్ ఎప్పుడు రాయిస్తారని ప్రశ్నించారు.