కుప్పం నుంచి పోటి అంటే కష్టం: నారా లోకేష్

తెలుగుదేశం పార్టీ నేతగా క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన నారా చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారనే చర్చలు పాదయాత్రతో పాటు మొదలైనాయి. పాదయాత్రలో కొందరు కుప్పం నుంచి పోటీ చేస్తారా అని ప్రశ్నించగా, కుప్పం ప్రజలకు చంద్రబాబు దేవుడు అని, అక్కడి నుండి తాను పోటీ చేస్తే కుప్పం ప్రజలు ఒప్పుకోరని చెప్పారు. ఆయన రాజకీయాల గురించి పలు విషయాలను మీడియాతో చర్చించారు. కాంగ్రెస్ రాష్ట్రాన్ని నాశనం చేసిందని, ఇపుడు రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం వైపు చూస్తున్నారని అన్నారు. నేనెప్పుడూ రాజకీయాల నుంచి వేరు కాలేదని, 1995 నుంచే పార్టీ కోసం పని చేస్తున్నానని అన్నారు. 1999 నుంచి క్రియాశీలక రాజకీయాల్లోనే ఉన్నానన్నారు. తన తండ్రి పాదయాత్రలో నారా, నందమూరి కుటుంబ సభ్యులు ఇరువురు పాల్గొంటారన్నారు. రాష్ట్రంలో ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నాయని, వాటిని చెప్పుకునేందుకు బాబు కోసం రాత్రి రెండు గంటల వరకు ప్రజలు వేచి చూస్తున్నారన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం ప్రజల విశ్వాసం పూర్తిగా కోల్పోయిందని వ్యాఖ్యానించారు. పాదయాత్ర జయప్రదం అవుతుందని ఆయన అన్నారు.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.