కన్నీళ్లను దాచుకుని చంద్రబాబును ఓదార్చిన భువనేశ్వరి!
posted on Nov 21, 2021 @ 2:45PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో శుక్రవారం జరిగిన పరిణామాలు యావత్ తెలుగు జాతిని కలిచివేసింది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టార్గెట్ గా సభలో వైసీపీ ఎమ్మెల్యేలు రెచ్చిపోయారు. చంద్రబాబు ఉక్కుమనిషి అని వాళ్లకు తెలుసు. రెచ్చగొట్టే కామెంట్లు రాజకీయ జీవితంలో ఆయన ఎన్ని చూసి ఉంటారు. ఆ విషయం వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా తెలుసుు. అందుకే గురి చూసి ఆయన వీక్నెస్ మీద కొట్టారు. చంద్రబాబు ఆయువు పట్టులాంటి ఆయన కుటుంబం పరువు మర్యాదలపై దెబ్బకొట్టారు. ఎన్ని దెబ్బలు కొట్టినా.. గోడకు కొట్టిన బంతిలా తిరుగొస్తున్నాడనే అక్కస్సుతో చంద్రబాబు ఫ్యామిలీ ఇమేజ్ను టార్గెట్ చేశారు. అర్థనారీశ్వరుడులాంటి చంద్రబాబుకు.. భార్య భువనేశ్వరే సర్వస్వం. ప్రాణంకంటే ప్రియం. అందుకే ఆమెపై దాడికి దిగారు. నిండు సభలో భువనేశ్వరిపై అసభ్యంగా మాట్లాడారు వైసీపీ ఎమ్మెల్యేలు.
అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేల నీచ, నికృష్ట వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు చంద్రబాబు. సభలోనే ఉద్వేగానికి లోనయ్యారు. సభకు దండం పెట్టిన బయటికి వచ్చిన చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టారు. సభలో జరిగిన పరిమాణాలను వివరిస్తూ భోరున ఏడ్చేశారు. చిన్న పిల్లాడిలా వెక్కివెక్కి ఏడ్చారు. ప్రస్తుతం దేశంలోని టాప్ రాజకీయ నేతల్లో ఒకరు చంద్రబాబు. 15 ఏండ్లు ముఖ్యమంత్రిగా, పదేండ్లు ప్రతిపక్ష నేతగా పనిచేశారు. అలాంటి చంద్రబాబు కన్నీళ్లు పెట్టడంతో దేశమంతా అవ్వాక్కైంది. చంద్రబాబు ఎందుకు ఏడ్చారో తెలుసుకుని షాకైంది. చంద్రబాబు కుటుంబంపై వైసీపీ ఎమ్మెల్యేలు నీచంగా ప్రవర్తించారని తెలుసుకుని జాతీయ స్థాయి నేతలు కూడా తీవ్రంగా స్పందించారు. చంద్రబాబుకు ఫోన్ చేసి పరామర్శించారు. ఓదార్చారు. వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే అసెంబ్లీలో జరిగిన పరిణామాలతో ఉక్కుమనిషి లాంటి చంద్రబాబు విలవిల ఏడిస్తే.. ఆయన సతీమణి భువనేశ్వరి పరిస్థితి ఎలా ఉందో అన్న ఆందోళన అందరిలో వ్యక్తమైంది. తనపై సభ్య సమాజం తలదించుకునేలా వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన కామెంట్లను ఆమె తట్టుకుంటుందా అన్న భయం కూడా నారా ఫ్యామిలీతో పాటు టీడీపీ నేతల్లో కనిపించింది. అయితే అసెంబ్లీ జరిగిన ఘటనలు. ప్రెస్ మీట్ లో చంద్రబాబు బోరున విలపించడం చూసిన.. భువనేశ్వరి తీవ్ర మనస్తాపానికి గురయ్యారట. అయితే సాయంత్రానికి తేరుకుని భర్త చంద్రబాబుకే ఆమె ధైర్యం చెప్పారని తెలుస్తోంది.
చంద్రబాబు విలేకరుల సమావేశంలో విలపించిన ఆ దృశ్యాన్ని టీవీలో చూసిన భువనేశ్వరి.. తాను కూడా విపరీతంగా విలపించారు. ఆ సమయంలో ఇంట్లో ఆమె ఒక్కరే ఉన్నారు. ఈ విషయం తెలిసి చంద్రబాబు, లోకేశ్ శుక్రవారం సాయంత్రం హుటాహుటిన హైదరాబాద్లోని ఇంటికి వెళ్లారు. వారిని చూడగానే ఆమె మరోసారి రోదించారు. కానీ ఆ తర్వాత ఆమె త్వరగానే కోలుకున్నారు. జరిగిన ఘటనలపై బాధపడుతున్న చంద్రబాబును ఆమె ఓదార్చారని కుటుంబ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
చంద్రబాబు ఇంటికి వెళ్లగానే.. ‘దిగజారిన మనుషులు ఏవో మాట్లాడతారు. అవన్నీ మనసులో పెట్టుకోవద్దు.. వదిలేయండి’ అని భువనేశ్వరి ఆయనను అనునయించినట్లు సమాచారం. ‘రాజకీయాల్లో ఒక్కోసారి ఇటువంటి వ్యక్తులను ఎదుర్కోవాల్సి వస్తుంది. నాన్నగారు ఉన్నప్పుడు కూడా కొంతమంది ఆయనను ఉద్దేశించి ఇలాగే నీచంగా మాట్లాడేవారు. మనసుకు బాధ కలిగినా వాటిని వెనక్కినెట్టి మన పని మనం చేసుకోవాలి. మిమ్మల్ని బాధ పెట్టడానికే ఇలా మాట్లాడుతుంటారు. వారిని పట్టించుకోవద్దు’ అని ఆమె అన్నట్టు ఆ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీలో జరిగిన ఘటనలతో శుక్రవారం బాగా బాధపడిన చంద్రబాబు.. భార్య భువేనశ్వరి ఇచ్చిన ధైర్యంతో త్వరగానే మామూలు స్థితికి వచ్చేశారని చెబుతున్నారు. శనివార ఆయన పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి వరద పరిస్థితిపై చర్చించారు.