కొత్త మద్యం బ్రాండ్లు వద్దు.. నంద్యాల ఓటర్ల స్లిప్పులు
posted on Mar 15, 2021 8:31AM
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా నంద్యాలలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. నంద్యాల మున్సిపల్ 29 వార్డు ఓట్ల లెక్కింపు కోసం బ్యాలెట్ బాక్సులు తెరిచారు కౌంటింగ్ సిబ్బంది. అయితే బాక్సును చూసిన అధికారులు షాకయ్యారు. బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లతో పాటు ప్రింటెడ్ స్లిప్పులు కనిపించడంతో కలవరపడ్డారు. అయితే ఆ స్లిప్పులను , అందులో వివరాలను చూసిన తర్వాత అంతా నవ్వుకున్నారు.
నంద్యాల తాగుబోతుల విన్నపం అంటూ ఆ చీటీల్లో ముద్రించి ఉన్న సందేశం వారిని అధికారులను విస్మయానికి గురి చేసింది. ఏపీలో కొత్త మద్యం బ్రాండ్లను తొలగించాలని, పాత మద్యం బ్రాండ్లను మళ్లీ తీసుకురావాలని ఆ స్లిప్పుల్లో పేర్కొన్నారు. సుప్రీం, జంబో, హైదరాబాద్, దారు వంటి నూతన బ్రాండ్లు తమకు వద్దని... రాయల్ స్టాగ్, బ్లాక్ డాగ్, ఇంపిరీయల్ బ్లూ వంటి పాత బ్రాండ్లు మళ్లీ తీసుకురావాలని కోరారు. తాము కోరిన పాత బ్రాండ్లు అమ్మకపోతే ఇదే తమ చివరి ఓటు అవుతుందంటూ సీఎంను ఉద్దేశించి స్పష్టం చేశారు మందు బాబులు.
విశాఖ కార్పొరేషన్ బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లతో పాటు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ రాసిన స్లిప్పులు కూడా దర్శనమిచ్చాయి. స్టీల్ ప్లాంట్ ను కాపాడాలని ఓటర్లు కోరారు.