హిందూ మహిళ పాడే మోసిన ముస్లింలు!
posted on Apr 8, 2020 @ 11:11AM
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లోని జునా ప్రాంతంలో నివాసం ఉంటూ దుర్గామాగా పిలువబడే 65 ఏళ్ల వృద్ధురాలు ఆనారోగ్యకారణాలతో మరణించింది. ఈ సమాచారాన్ని వేరే ప్రాంతంలో ఉన్న ఆమె కుమారులకు అందించగా వెంటనే వారు ఇండోర్కు చేరుకున్నారు. అయితే తల్లి దహనసంస్కారాలు చేసేందుకు వారివద్ద సరిపడా డబ్బులు లేవు. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో బంధువులు, స్థానికులు ఎవరూ కూడా అంత్యక్రియలకు రావడానికి సాహసం చేయలేదు.
దీంతో స్థానికంగా ఉన్న ముస్లింయువకులు అక్కడికి చేరుకుని దహనసంస్కారాలకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. అంతే కాదు దాదాపు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్మశానానికి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఏ విధమైన వాహనమూ అందుబాటులో లేకపోవడంతో, మాస్క్ లు ధరించి, తమ భుజాలపై పాడెను మోస్తూ శ్మశానానికి తీసుకెళ్లారు. తమకు ఆ మహిళ చిన్నప్పటి నుంచి తెలుసునని, ఆమె మరణిస్తే, అంత్యక్రియలకు సహకరించడం తమ విధిగా భావించామని ముస్లిం యువకులు వ్యాఖ్యానించారు.
ఇందుకు సంబంధించిన చిత్రాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మనుషులంతా కులమతాలకు అతీతంగా ఒకరికొకరు సహరించుకుంటున్నారు. హిందూ-ముస్లిం భాయీ భాయీ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. హిందూ మహిళ పాడే మోసిన ముస్లిం యువకులపై మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ ప్రశంసలు కురిపించారు.