మురళీ మోహన్ కొడుకు ఇంట్లో మళ్ళీ చోరీ
posted on Feb 8, 2015 @ 3:26PM
నటుడు, ఎంపీ మురళీమోహన్ కుమారుడు రామ్మోహన్ ఇంట్లో మళ్ళీ చోరీ జరిగింది. ఈ వారం రోజుల్లో ఆయన ఇంట్లో జరిగిన రెండో చోరీ ఇది. మురళీమోహన్ కుటుంబ స్నేహితురాలు ఇటీవల ఓ పెళ్లికి హాజరయ్యేందుకు శ్రీలంక నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చి రామ్మోహన్ ఇంట్లో బస చేసింది. ఆమె తిరిగి శ్రీలంక వెళ్లే రోజున బ్యాగ్లో చూసుకుంటే బ్యాగ్లో వుండాల్సిన ఆరు లక్షల విలువైన నగలు, విదేశీ కరెన్సీ చోరీ జరిగిందని తెలిసింది. ఈ విషయమై రామ్మోహన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసు దర్యాప్తులో వుంది. ఇప్పుడు శనివారం నాడు రామ్మోహన్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి తన ఇంట్లో మరోసారి చోరీ జరిగిందని, ఖరీదైన టీవీని ఎవరో దొంగిలించారని ఫిర్యాదు చేశారు. దాంతో బంజారాహిల్స్ పోలీసులు డాగ్స్క్వాడ్, క్లూస్టీమ్తో ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. రామ్మోహన్ ఇంట్లో వంట మనిషి, పని మనుషులు, డ్రైవర్తో పాటు ఏడుగురిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.