ప్రధాని మోడీ గడ్డం గీసుకోండి! వంద రూపాయలు పంపిన చాయ్ వాలా
posted on Jun 9, 2021 @ 9:15PM
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన నేతల్లో ఒకరు. సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నది మోడీకే. ట్విట్టర్ లో అమెరికా అధ్యక్షుడి కంటే మోడీనే పవర్ పుల్. దేశంలోని నరేంద్ర మోడీ.. నమో అంటే ఓ వైబ్రేషన్. కాని ఇప్పుడు సీన్ మారింది. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ దేశంలో స్పష్టించిన కల్లోలం తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్ భారీగా తగ్గిపోయింది. కరోనా కట్టడిలో విఫలమయ్యారంటూ అంతర్జాతీయంగానూ మోడీపై విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది.
దేశంలో గతంలో ఎప్పుడు లేనంతగా ప్రధాని మోడీపై జనాల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. ఆయనపై జనాల్లో ఎంత కోపంగా చెప్పే ఘటన మహారాష్ట్రలో జరిగింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ గడ్డం గీసుకోవాలంటూ వంద రూపాయలు పంపాడు ఓ టీస్టాల్ యజమాని. ప్రధాని గడ్డం పెంచుతూ పోతున్నారని, ఇకపై ఆయన ఏదైనా పెంచాలనుకుంటే అది దేశ ప్రజలకు ఉపయోగపడేది అయి ఉండాలంటూ తన నిరసనను వ్యక్తం చేస్తూ ప్రధానికి లేఖ రాశాడు అనిల్ మోరే. కరోనా కారణంగా గతేడాది నుంచి అసంఘటిత రంగ కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా తన లేఖలో ప్రస్తావించారు.
బారామతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి ఎదురుగా టీస్టాల్ నిర్వహిస్తున్నాడు అనిల్ మోరే. ప్రధాని మోదీ గడ్డం పెంచడం మాని, ప్రజలకు వీలైనంత త్వరగా టీకాలు, వైద్య సదుపాయాలు అందించేందుకు ప్రయత్నించాలని కోరాడు. లాక్డౌన్ల వల్ల ఎదుర్కొంటున్న కష్టాల నుంచి ప్రజలను బయటపడేయడంపై ప్రధాని దృష్టి సారించాలని ఆ లేఖలో సూచించారు. ప్రధాని మోడీ అంటే తనకు ఎంతో గౌరవమని పేర్కొన్న మోరే.. తాను దాచుకున్న డబ్బుల నుంచి వంద రూపాయలు పంపిస్తున్నానని, ఆ డబ్బులతో ఆయన గడ్డం గీయించుకోవాలని సూచించాడు. ప్రధానిని అవమానించడం, బాధపెట్టడం తన ఉద్దేశం కాదని, ఆయన ఈ దేశానికి అత్యున్నత నాయకుడని కూడా లేఖలో తెలిపాడు అనిల్ మోరే. కరోనా కారణంగా దేశ ప్రజలు, పేదలు పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు వివరించాడు.