నవ రత్నాలు కాదు.. నవ రంధ్రాలు.. కేంద్రానికి రఘురామ ఫిర్యాదు..
posted on Sep 11, 2021 @ 4:12PM
సీఎం జగన్రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలన్నీ త్వరలోనే నవ రంధ్రాలవుతాయని ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. నవరత్నాలలో ఎప్పుడు.. ఏ రత్నం ఊడుతుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. పింఛన్లను ఎలా తొలగించాలా అని చూస్తున్నారని ఆరోపించారు. పింఛన్లకు ఏదో ఒక విధానం పెట్టాలి తప్ప ఎలా ఎగ్గొట్టాలా అనే ఆలోచనను మానుకోవాలన్నారు. గ్రామ వాలంటీర్ల తల్లిదండ్రులకు సైతం పింఛను రద్దు చేయడం సరికాదన్నారు. గ్రామాల్లో పనిచేసే వాలంటీర్లు ఉద్యోగులు కాదు.. సేవకులని మనమే అంటున్నామని.. అలాంటి సేవకుల కుటుంబాలను ‘షేవ్’ (SHAVE) చేయడం ఎంతవరకు సమంజసమని ప్రజలు అడుగుతున్నారని రఘురామ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు.
విద్యుత్ బిల్లులు రూ.300 దాటితే డయాలసిస్ రోగులకు పింఛన్లలో కోత విధించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. కరెంటు యూనిట్లకు కిడ్నీ రోగులకు ఇచ్చే పింఛనుకు సంబంధం ఏమిటని నిలదీశారు. కిడ్నీ రోగులను నాలుగు కాలాల పాటు బతకనివ్వండంటూ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆటో డైవర్స్కు వాహన మిత్ర కింద వాహనాలు ఇస్తున్నారే గానీ.. చమురు ధరలపై టాక్స్లు, దెబ్బతిన్న రోడ్ల పరిస్థితిపై పట్టించుకోవడం లేదని రఘురామ మండిపడ్డారు.
తెలంగాణలో వినాయకచవితి ఉత్సవాలు ఘనంగా జరుపుకొన్నారని.. ఉత్సవాలలో తెలంగాణ గవర్నర్ సైతం పాల్గొన్నారని.. అయితే ఏపీలో జరిగిన ఉత్సవాల్లో గవర్నర్ కనిపించకపోవడం దురదృష్టకరమని తెలిపారు. ఆదివారం చర్చిల్లో ప్రార్థనలపై ఎలాంటి నియంత్రణా లేదన్నారు. చవితి వేడుకల్లో ఐదుగురికి మించి ఉండకూడదన్న నిబంధన.. చర్చిలకు కుడా అమలు చేస్తారా.. అని ప్రశ్నించారు. చర్చిల్లో ఏ నిబంధనలూ లేనట్లే.. హిందువులు కూడా పూజలు చేసుకునేలా చూడాలని సూచించారు. ధూపదీప నైవేద్యాలకు రూ.234 కోట్లు ఇస్తామని.. ఒక్క పైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు. హిందూ ఆలయాల మీద పడి నాశనం చేయొద్దని రఘురామ విజ్ఞప్తి చేశారు.
ఇక, ఏపీ ఫైబర్గ్రిడ్ లిమిటెడ్ ఎంఎస్వో లైసెన్స్ను అనధికారికంగా, అక్రమంగా ఉపయోగించడంపై కేంద్ర ఐటీ శాఖకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు ఎంపీ రఘురామ.