వివేకా హత్యకేసు నిందితుడు పోలీసులకు ఫిర్యాదు...చంపాలని చూస్తున్నారు

 

కడప ఎంపీ అవినాష్ రెడ్డి మనుషులు తనను వెంబడించారని వివేకా హత్య కేసులోని ఎం -2 నిందితుడు సునీల్ యాదవ్ పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ  ఫిర్యాదు మేరకు  సునీల్ యాదవ్ పెళ్లి రోజు కావడంతో క్రిష్ణుడి గుడికి వెళ్లి  అక్కడి నుంచి తన వాహనంలో ఇంటికి వస్తున్న సమయంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులైన లోకేశ్వర్ రెడ్డి, పవన్ కుమార్ (వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ )లతోపాటు మరో ఇరువురు వాహనంలో వెంబడించారని ఫిర్యాదు లో పేర్కొన్నారు. తన వాహనం ముందు వెళ్తుంటే దాన్ని అనుసరిస్తూ మరో వాహనం వస్తూ ఉండడం గమనించానని తెలిపారు .ఈ వాహనంలో లోకేశ్వర్ రెడ్డి పవన్ కుమార్ ల ను గుర్తించినట్లు పోలీసులకు తెలిపారు. 

తనకు ప్రాణం ఉందని పులివెందుల అర్బన్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే హత్య సినిమాకు సంబంధించి కొన్ని వీడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది .ఆ సమయంలో పవన్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి విచారించారు. గతంలో కూడా తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు సునీల్ యాదవ్ ఫిర్యాదు చేయడం జరిగింది. తాజాగా  జరిగిన సంఘటన నేపథ్యంలో మరో సారి తనకు ప్రాణహాని  ఉందని సునీల్ యాదవ్  ఫిర్యాదు చేశారు .ఈ ఫిర్యాదు పై పోలీసులు విచారణలో చేయనున్నట్లు సమాచారం.

Teluguone gnews banner

మజ్లిస్ మద్దతు కాంగ్రెస్ కే!

జూబ్లీహిల్ ఉప ఎన్నికలో మజ్లిస్ పార్టీ ఎవరివైపు అన్న విషయంలో క్లారిటీ వచ్చేసింది. నిన్న మొన్నటి దాకా జూబ్లీ బైపోల్ లో పోటీ అంటూ లీకులిచ్చిన మజ్లిస్ పార్టీ ఇప్పుడు పోటీలో లేదు. కాంగ్రెస్ జూబ్లీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ను ప్రకటించడంతోనే ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది. మజ్లిస్ మద్దతు లేకుండా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏ పార్టీ అయినా విజయం సాధించడం కష్టమే. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్ల సంఖ్య ఒకింత ఎక్కువే. బీఆర్ఎస్ జూబ్లీ బైపోల్ లో నిలబడే పార్టీ అభ్యర్థి పేరు అందరి కంటే ముందుగానే ప్రకటించి ప్రచారం ప్రారంభించేయడం, కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది నిర్ణయించుకోలేక మల్లగుల్లాలు పడుతుండటంతో.. జూబ్లీ బైపోల్ లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును నిలబెట్టుకుంటుందన్న అంచనాలు పెరిగాయి. అయితే అందరూ ఊహించినట్లుగానే.. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఖరారు అయ్యారు. ఈయన ఎంపిక విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాకచక్యంగా, ప్రణాళికాబద్ధంగా, వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్పాల్సి ఉంటుంది. నవీన్ యాదవ్ వినా మరెవరిని అభ్యర్థిగా నిలబెట్టినా మజ్లిస్ మద్దతు లభించే అవకాశాలు లేవు. మజ్లిస్ మద్దతు లేకుండా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయం అంత తేలిక కాదు. అందుకే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. అజారుద్దీన్ మొదలకుని ఈ నియోజకవర్గ టికెట్ కోసం రేసులో ఉన్న ఒక్కొక్కరినీ పక్కకు తప్పించి నవీన్ యాదవ్ కు టికెట్ ఖరారయ్యేలా చూశారు. ఇందుకోసం ఆయన అధిష్ఠానాన్ని ఒప్పించారు. ఎవరినీ నొప్పించకుండానే.. పక్కకు తప్పించి తాను కోరుకున్నట్లు నవీన్ యాదవ్ కు పార్టీ హైకమాండ్  టికెట్ కన్ ఫర్మ్ చేసేలా చూశారు.   అయితే జూబ్లీ బైపోల్ కు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తరువాత.. ఎన్నికల సంఘం ఫిర్యాదు మేరకు నవీన్ యాదవ్ పై కేసు నమోదు కావడంతో ఆయనకు టికెట్ ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పునరాలోచనలో పడుతుందా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమయ్యాయి. అయితే కాంగ్రెస్ నవీన్ యాదవ్ నే అభ్యర్థిగా ఖరారు చేసింది.  ఇక నవీన్ యాదవ్ విషయానికి వస్తే..  ఆయనకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గట్టిపట్టు ఉంది. పైగా మజ్లిస్ పార్టీలో అనుబంధం ఉంది. తొలి నుంచీ కూడా జూబ్లీ బైపోల్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ఉంటే మద్దతు ఇస్తామని మజ్లిస్ లోపాయికారీగా చెబుతూ వస్తున్నది. మజ్లిస్ మద్దతు ఉంటే నియోజకవర్గ పరిధిలో దాదాపు 90 వేల పైచిలుకు ఉన్న మైనారిటీ ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ కు పడతాయి. అందుకే రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా నవీన్ యాదవ్ అభ్యర్థిత్వమే ఖరారయ్యేలా పావులు కదిపారు. ఇక ఇప్పుడు సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలని ఆశిస్తున్న బీఆర్ఎస్ తన ఆశ నెరవేరాలంటే చాలా అంటే చాలా కష్టపడాల్సి ఉంటుందని పరిశీలకులు అంటున్నారు.  

జగన్ విశాఖ పర్యటనకు పోలీసుల రూట్ మ్యాప్

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్ నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. నర్సీపట్నం వైద్య కళాశాలను సందర్శించనున్నారు.  ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా  ఆయనీ పర్యటన చేపట్టారు. అయితే నేడు విశాఖలో మహిళల ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ జరగనున్నందున కాన్వాయ్ లో 10కి మించి వాహనాలు ఉండకూడదని, రోడ్ షో నిర్వహించడం, కూడళ్ల వద్ద ప్రసంగాలు చేయకూడదని ఆయన పర్యటనకు పోలీసులు షరతులు విధించారు. జగన్ పర్యటనకు అనుమతి ఇచ్చిన పోలీసులు వైసీపీ ప్రతిపాదించిన మార్గంలో కాకుండా కొత్త రూట్ మ్యాప్ ఇచ్చి, దాని ప్రకారమే పర్యటన సాగాలని కండీషన్ పెట్టారు. పోలీసులు నిర్దేశించిన మార్గం ప్రకారం  విశాఖ ఎయిర్ పోర్టు నుంచి ఎన్ఏడీ జంక్షన్, పెందుర్తి కూడలి మీదుగా అనకాపల్లి, తాళ్లపాలెం నుంచి నర్సీపట్నం మెడికల్ కాలేజ్ వరకు వెళ్లాల్సి ఉంటుంది.  నిర్దేశించిన మార్గంలో, నిబంధనలకు లోబడే జగన్ పర్యటన సాగాలని పోలీసులు స్పష్టంగా ఆదేశించారు. 

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్!

   జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక  కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్‌ పేరును అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర సీనియర్ నాయకత్వం నవీన్ యాదవ్‌‌కు మద్దతుగా ఉన్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. సర్వేలలో ఆయన ముందంజలో ఉండడం బీసీ సామాజికవర్గం మద్దతు ఉండటంతో ఆమోదించినట్లు తెలుస్తోంది.  ఈ నేపథ్యంలో నిన్న జూబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి రేసులో నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు బొంతు రామ్మోహన్. జూబ్లీహిల్స్ అభ్యర్థిని కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయిస్తుందని రామ్మోహన్ తెలిపారు.  మరోవైపు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌లు ఇన్‌చార్జి మంత్రులు సూచించిన పేర్లపై సమీక్షించారు. నవీన్‌ యాదవ్‌, సీఎన్‌ రెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌ పేర్లను అధిష్ఠానానికి పంపారు.లోకల్ నాయకుడు కావడం గతంలో  జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేయటంతో నవీన్ యాదవ్‌ వైపు మొగ్గుచుపినట్లు తెలుస్తోంది.  2014లో మజ్లిస్ తరపున పోటీ చేసి .. 9వేల ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు. 2019లో బీఆర్ఎస్ తో అవగాహన కారణంగా మజ్లిస్ టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. సొంత బలంతోనే మూడో స్థానంలో నిలిచారు. 2023లోనూ అదే అవగాహన కొనసాగడంతో  మజ్లిస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.  

బీహార్ ఎన్నికలు.. ట్రంప్ కార్డుగా పీకే పార్టీ?

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు  దగ్గరపడుతున్న కొద్దీ ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య  తేడా కేవలం ఒక శాతం కంటే తక్కువేనని సర్వేలు ఉద్ఘాటిస్తున్నాయి. బీహార్ లో ఎన్డీయే, ఇండియా కూటములు మధ్య పోరు హోరాహోరీ అని పరిశీలకులు సైతం ఉదాహరణలతో విశ్లేషణలు చేస్తున్నారు.  ఈ సారి బీహార్ లో హంగ్ ఖాయమని చెబుతున్నారు. అంతేనా బీహార్ లో ఎన్డీయ, ఇండీ కూటములు సొంతంగా అవసరమైన స్థానాలను గెలుచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. హంగ్ ఖాయమనీ, దాంతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పార్టీ జన సురాజ్  కీలకంగా మారుతుందనీ అంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే బీహార్ లో ఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా ప్రశాంత్ కిశోర్ మద్దతు అనివార్యమౌతుందని చెబుతున్నారు. అంటే ప్రశాంత్ కిశోర్ కింగ్ మేకర్ గా, ట్రంప్ కార్డుగా మారతారన్న మాట.  అయితే ఇటు ఇండియా కూటమి, అటు ఎన్డీయే కూటమి కూడా తమ విజయం ఖాయమన్న ధీమా వ్యక్తం చేస్తున్నాయి.  ప్రధానంగా ఎన్డీఏ కూటమి,ఇండియా కూటమి మధ్య ప్రధాన పోటీ జరిగే అవకాశం ఉంది. అలాగే చిరాగ్ పాశ్వాన్ పార్టీ,  ప్రశాంత్ కిషోర్ జన సురాజ్ పార్టీలు కూడా కీలక పాత్ర పోషించనున్నాయి. సాధారణంగా ఓట్లు చీలితే ప్రత్యర్ధి పార్టీకి దెబ్బ అని ఎన్నికల విశ్లేషకులు చెబుతారు. కాని పీకే పార్టీ అధికార పార్టీ ఓట్లనే చీల్చి దాన్నే డ్యామేజ్ చేస్తుందని అంటున్నారు. ముఖ్యంగా పీకే పార్టీ పట్ల యువత ఆకర్షితులౌతున్నారన్నది రాజకీయవర్గాల్లో వినిపిస్తున్న మాట.  అలాగే చిరాగ్ పాశ్వాన్ గతంలో పోటీ చేసిన స్థానాల్లో 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించింది. ఈ సారీ కూడా అదే ఫలితం రావచ్చని అంటున్నారు.   గత రెండు నెలలుగా ప్రచారంలో ఎన్డీఏ, ఇండీ కూటములు హోరాహోరీగా తలపడుతున్నాయి. ముఖ్యంగా . రాహుల్ గాంధీ 64 లక్షల ఓట్లు చోరీ పేరుతో ఎన్నికల కమిషన్ పై ఆరోపణల అస్త్రాలు సంధించడంతో అందరి చూపు బీహార్ ఎన్నికల పై మళ్లింది. ఎన్నికల కమిషన్ మళ్లీ ఓటర్ల జాబితాను పున:పరిశీలించి కొత్తగా 14 లక్షల ఓట్లు చేరాయని ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 7.4 కోట్ల ఓటర్లు ఉన్నట్లు ప్రకటించింది. అది పక్కన పెడితే రాహుల్ ఓట్ చోరీ యాత్రకు బీహార్ వ్యాప్తంగా విశేష స్పందన వచ్చింది.   దీంతో ఇండియా కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి. నిన్న మొన్నటి వరకూ ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, ఆర్జేడీ కీలక నేత అయిన తేజస్వీయాదవ్ అన్న విషయంలో రెండో అభిప్రాయానికి తావు లేదన్నట్లుగా ఉన్న పరిస్థితి మారింది. ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవర్నది ఇంకా నిర్ణయించలేదంటూ కాంగ్రెస్ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ఓట్ చోరి యాత్ర ద్వారా వచ్చిన మైలేజీయే ఇందుకు కారణమన్న అభిప్రాయం పరిశీలకులలో వ్యక్తం అవుతోంది.  ఇది ఆ కూటమిలో ఒకింత అసంతృప్తికి కారణమైంది. అవసరమైతే ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఒక సందర్భంలో హెచ్చరించారు కూడా. అది పక్కన పెడితే లోక్ జనశక్తి నాయకుడు చిరాగ్ పాశ్వాన్ బీజేపీతో పొత్తు విషయంలో నితీష్ వారసుడిగా కావాలని ఆశిస్తున్నారు. అయితే  ఇందుకు బీజేపీ అవకాశాలు లేవు. దీంతో చిరాగ్ పశ్వాన్ పీకే పార్టీ జన  సురాజ్ తో పొత్తుపెట్టుకునే అవకాశం లేకపోలేదని అంటున్నారు. జన సురాజ్ తో పొత్తుపై చిరాగ్ పశ్వాన్ సూచన ప్రాయంగా సానుకూల సంకేతాలు కూడా ఇచ్చారు. అయితే అది బీజేపీపై ఒత్తిడి పెంచి ఎక్కువ స్థానాలను సాధించాలన్న ఎత్తుగడగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బీహార్ ఎన్నికల బరిలోకి దిగడంతో పరిస్థితి మరింత రసకందాయంలో పడిందని చెప్పారు. ఆప్ కూడా రాష్ట్రంలో పొత్తులకు ప్రయత్నాలు చేస్తున్నది. ఇక జేడీయూ విషయానికి వస్తే దాదాపు రెండు దశాబ్దాలుగా నితీష్ కుమార్ సీఎంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన పట్ల, ఆయన పాలన పట్ల తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని అంటున్నారు. అది ఎన్డీయే కూటమి విజయావకాశాలపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన ఎన్డీయే కూటమిలో వ్యక్తం అవుతోంది.  సరే అది పక్కన పెడితే బీహార్ అసెంబ్లీలో 243 సీట్లకు గానూ పొత్తులో చిన్నా చితకా పార్టీలకు కేటాయించిన స్థానాలను మినహాయించి 205 స్థానాలలో చెరిసగంగా బీజేపీ, జేడీయూలు పోటీలోకి దిగాలని  యోచిస్తున్నాయి. అయితే చిరాగ్ పశ్వాన్ మాత్రం తమ పార్టీకి కూటమి పొత్తులో భాగంగా ఇవ్వజూపిన పాతిక స్థానాలతో సంతృప్తి చెందడం లేదు. మరో వైపు ఇండియా కూటమిలోనూ సీట్ల పంచాయతీ ఓ కొలిక్కి రావడం లేదు. .వామపక్ష ఎంఎల్ పార్టీ 30 సీట్లు డిమాండ్ చేస్తున్నది. అలాగే ఆర్జేడీ, కాంగ్రెస్ ల మధ్య కూడా సీట్ల పంపిణీలో పీటముడులు పడే అవకాశం ఉందంటున్నారు.  ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి అంచనా వేస్తే పీకే కింగ్ మేకర్ గా మారతారన్న అభిప్రాయమే పరిశీలకుల్లో వ్యక్తం అవుతోంది. 

జ‌గ‌న్ హెలికాప్ట‌ర్ వివాదం

జ‌గ‌న్ విశాఖ జిల్లా ప‌ర్య‌ట‌న వివాదాస్ప‌ద‌మ‌వుతోంది. జ‌గ‌న్ స‌హా ప‌ది వాహ‌నాలు వెళ్లేందుకు రూట్ మ్యాప్ రెడీ చేశారు పోలీసులు. ఎయిర్ పోర్టు నుంచి పెందుర్తి మీదుగా నేష‌న‌ల్ హైవే మీద వెళ్లేందుకు ప‌ర్మిష‌న్ ఇచ్చారు. రోడ్ షోలు, జ‌న‌స‌మీక‌ర‌ణ చేస్తే ఆయ‌న ప‌ర్య‌ట‌న అర్ధాంత‌రంగా ఆపేస్తామ‌ని ష‌ర‌తులు విధించారు. అయితే రోడ్డు మార్గంలో జ‌గ‌న్ న‌ర్సీప‌ట్నం వెళ్లేందుకు మాత్రం అనుమ‌తి లేద‌న్నారు అన‌కాప‌ల్లి ఎస్పీ. అయితే అనుమ‌తులు లేకున్నా స‌రే జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న జ‌రిగి తీరుతుందంటున్నారు వైసీపీ నేత‌లు.  జగన్‌ పర్యటన రోజు అక్టోబ‌ర్ 9న‌, విశాఖలో మహిళల ప్రపంచకప్‌   మ్యాచ్‌ ఉందని, ఆ మ్యాచ్‌కు ఫాన్స్ భారీగా హాజరయ్యే అవకాశమున్నందున పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు విశాఖ సీపీ. వైసీపీ శ్రేణులు ర్యాలీగా వెళ్తే నేష‌న‌ల్ హైవే బ్లాక్‌ అవుతుందని.. అలా జ‌రిగితే  తమిళనాడులోని క‌రూరులో  విజయ్‌ ర్యాలీలో జరిగినట్టు తొక్కిసలాట జరగవచ్చన్నారు. ఆ రోజు గానీ చిన్న పొరపాటు జరిగితే నగరానికి చెడ్డ పేరు వస్తుందని, దీంతో తాము జగన్‌ పర్యటనకు అనుమతి ఇచ్చేది లేద‌ని సీపీ తెగేసి చెప్పారు. కాబ‌ట్టి జ‌గ‌న్ కి హెలికాప్ట‌ర్ లో వెళ్ల‌ాలని సూచించారు.  అయితే  హెలికాప్ట‌ర్ ప‌ర్య‌ట‌న‌కైతే ఓకే అంటున్న పోలీసుల తీరును  వైసీపీ నేత‌లు త‌ప్పు ప‌డుతున్నారు. అదే ప‌నిగా హెలికాప్ట‌ర్ ప్ర‌స్తావ‌న చేస్తున్నారంటే ఇందులో మ‌రేదో కుట్ర కోణం ఉందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్. అయితే గ‌త రాఫ్తాడు ప‌ర్య‌ట‌న‌లోనూ జ‌గ‌న్ చాప‌ర్ వివాదం సంగ‌తి తెలిసిందే.  జ‌గ‌న్ చాప‌ర్ ఎప్పుడైతే ల్యాండ్ అయిందో దానిపైకి కూడా జ‌నం దూసుకొచ్చేశారు. దీంతో ఆ చాప‌ర్ పైల‌ట్ జ‌గ‌న్ లేకుండానే తిరిగి వెళ్లిపోయాడు. ఏది ఏమైనా జగన్ పర్యటన వివాదాస్పదంగా మారిందనే చెప్పాలి. అసలు అధికారం కోల్పోయిన తరువాత జగన్ చేపట్టిన ప్రతి పర్యటనా శాంతిభద్రతలకు భంగం వాటిల్లే విధంగానే ప్లాన్ చేసుకుంటున్నారని తెలుగుదేశం వర్గీయులు ఆరోపిస్తున్నారు 

జగన్ రోడ్ షోకు నో పర్మిషన్

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌ రోడ్ షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆయనకు రోడ్డు మార్గంలో అనుమతి లేదని అనకాపల్లి పోలీసులు తేల్చి చెప్పారు. జగన్ దాదాపు 63 కిలోమీటర్లు రోడ్ షో చేయాలని భావించారు. అయితే ఇటీవల  తమిళనాడు కరూర్ లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించాన సంఘటనను పేర్కొంటూ.. జగన్ రోడ్ షోకు అనకాపల్లి పోలీసులు అనుమతి నిరారించారు. అయన వైజాగ్ నుంచి  నేరుగా హెలికాప్ట‌ర్‌లో వెళ్లేందుకు మాత్ర‌మే అనుమ‌తి ఇస్తున్న‌ట్టు చెప్పారు. అసలింతకీ విషయమేంటంటే.. జగన్ గురువారం (అక్టోబర్ 9) విశాఖకు 63 కిలోమీటర్ల దూరంలో ఉనన వాకవరపాలెంలో మెడికల్ కాలేజీ వద్ద నిరసన చేపట్టనున్నారు. ఇందు కోసం ఆయన వైజాగ్ నుంచి రోడ్ మార్గం ద్వారా 53 కిలోమీటర్లు ప్రయాణించాలని నిర్ణయించారు. ఇందుకోసం స్థానిక వైసీపీ నాయకులు పోలీసుల అనుమతి కోరారు.  త‌న హ‌యాంలో తీసుకు వ‌చ్చిన 17 మెడిక‌ల్ కాలేజీల్లో 12 కాలేజీల‌ను ప్ర‌వేటు భాగ‌స్వామ్యానికి ఇవ్వ‌డాన్ని తప్పుపడుతున్న జగన్ నిరసనలకు పిలుపునిచ్చారు. దీనిపై స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు.. త‌న నియోజ‌ క‌వ‌ర్గం లోనూ.. కొత్త‌గా మెడిక‌ల్ కాలేజీ ప్రారంభించి వ‌దిలేశార‌ని   ఇటీవ‌ల వ్యాఖ్యానించారు.  దానికి జీవో కూడా లేద‌ని.. అది ఎప్ప‌టికి పూర్త‌వుతుందో కూడా చెప్ప‌లేమ‌నీ అన్నారు. అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై స్పందించిన జగన్.. స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడి నియోజ‌క‌వ‌ర్గంలో మెడికల్ కాలేజీ నిర్మాణం దాదాపు పూర్తయ్యిందనీ,  ఆ విషయాన్ని తానే స్వయంగా నిరూపిస్తాననీ సవాల్ విసిరి మకవర పాలెం పర్యటకు రెడీ అయ్యారు. విశాఖ నుంచి 63 కిలోమీటర్లు రోడ్ షో ద్వారా మాకవర పాలెంలో నిర్మాణంలో ఉన్న కాలేజీని సందర్శించేందుకు సమాయత్తమయ్యారు. అయితే జగన్ రోడ్ షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. కావాలంటే. విశాఖ నుంచి హెలికాప్టర్ లో మాకవర పాలెం వెళ్లాలని సూచించారు.  అయితే వైసీపీ నేతలు మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు. అనుమతి ఉన్నా లేకున్నా రోడ్ షో జరుగుతుందంటూ సవాళ్లు విసురుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటన ఎలా సాగుతుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. రోడ్డు మార్గంలోనే వెడతానంటూ పట్టుబట్టడం వెనుక శాంతి భద్రతల సమస్య సృష్టించాలన్న కుట్ర కోణం ఉందని తెలుగుదేశం శ్రేణులు అంటున్నాయి.  

బీహార్ ఫ‌లితాల‌తో ఓట్ చోరీ.. ఆరోపణల నిగ్గు తేలనుందా?

అటు బీహార్  ఎన్నిక‌తో పాటు ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక  షెడ్యూల్ కూడా విడుద‌లైంది. న‌వంబ‌ర్ 6, 11వ తేదీల్లో బీహార్ లో రెండు విడ‌త‌ల పోలింగ్ జ‌ర‌గ‌నుండ‌గా.. అదే నెల 14న ఫ‌లితాలు విడుద‌ల కానున్నాయి. బీహార్ సీట్ల సంఖ్య 243 కాగా, ఓట‌ర్ల సంఖ్య 7. 43 కోట్లుగా ఉంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంగ‌తేంట‌ని చూస్తే.. న‌వంబ‌ర్ 11న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ నెల 13 నుంచి నామినేష‌న్ల‌ను స్వీక‌రించ‌నుండ‌గా.. 21 తుదిగ‌డువు. 22వ తేదీ ప‌రిశీల‌న‌, 24వ తేదీ ఉప‌సంహ‌ర‌ణ‌. కాగా న‌వంబ‌ర్ 14న ఈ ఉప‌ ఎన్నిక ఫ‌లితం కూడా తేల‌నుంది.  ఈ రెండు ఎన్నిక‌లు కాంగ్రెస్ కి ఎంత కీల‌క‌మంటే.. ఒక ప‌క్క దేశ వ్యాప్తంగా రాహుల్ ఓట్ల చోరీ ప్ర‌చారం చేయ‌డంతో పాటు బీహార్ లో ప్ర‌త్యేకించి ఆయ‌న యాత్ర నిర్వ‌హించారు. ఎందుకంటే బీహార్ లో సుమారు 45 ల‌క్ష‌ల ఓట్లు తొల‌గించ‌డంతో.. రాహుల్ పెద్ద ఎత్తున ఓట్ల చోరీ పై ప్రెజంటేష‌న్లిచ్చి.. ఈసీ ని ఇరుకున పెట్టే య‌త్నం చేశారు. ఈసీ బీజేపీ చేతిలో కీలుబొమ్మ‌లా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ంటూ ఆరోపణలు గుప్పించారు. దీనిపై  రియాక్ట‌యిన సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఆధారాల‌తో స‌హా కంప్ల‌యింట్  చేయాల‌ని రాహుల్ కి సూచించారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు తగవని  వారించారు. తాను ప్ర‌త్యేకించీ ఆధారాలు చూపించ‌న‌క్క‌ర్లేద‌నీ.. త‌న ప్రెజంటేష‌న్లు తీసుకుని వాటిపై మీరు స్పందించాలంటూ కౌంటర్ ఇచ్చారు రాహుల్.  ఏది ఏమైనా రాహుల్ ఓట్ల చోరీ ప్ర‌చార‌మంతా కూడా బీహార్ ఎన్నిక‌ల‌ను  దృష్టిలో పెట్టుకుని చేసిందే. దానికి తోడు ఆయ‌న ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేసిన యాత్ర కూడా ఇదే చెబుతోంది. ఇప్పుడు రాహుల్ ఓట్ చోరీ ప్ర‌చారం జ‌నం న‌మ్మారా లేదా? అన్న‌ది ఈ ఎన్నిక‌ల ఫ‌లితం తేల్చేస్తుందంటున్నారు పరిశీలకులు.  కాబ‌ట్టి ఈ రాష్ట్ర ఎన్నిక‌ల ఫ‌లితాలను బ‌టి కాంగ్రెస్  ఎలిగేష‌న్లు జ‌నం సీరియ‌స్ గా తీస్కుంటున్నారా లేదా? అన్నదానిపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.  ఇక చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌. ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ త‌మ అభ్య‌ర్ధిగా మాగంటి స‌తీమ‌ణి సునీత‌ను ప్రకటించింది. అధికార కాంగ్రెస్ మాత్రం ఇంకా మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఈ బై పోల్ కూడా  కాంగ్రెస్ కి అగ్ని ప‌రీక్షేనని చెప్పాలి. రేవంత్ స‌ర్కార్ హైద‌రాబాద్ లో హైడ్రా ప్ర‌యోగం ద్వారా చేసిన మేలు ఎలాంటిదో చెప్పలేం కానీ..  జ‌నం మాత్రం బ్యాడ్ గా ఫీల‌వుతున్నారని ప్రచారం జరుగుతోంది. దానికి  తోడు హ‌రీష్ రావ్ ఇక్క‌డ ఎక్కువ‌గా ఉన్న మైనార్టీ  ఓటు బ్యాంకును టార్గెట్ చేస్కుని..  ఈ క‌మ్యూనిటీకి ఒక్క మంత్రి ప‌ద‌వి కూడా ఇవ్వ‌లేద‌ని ప్ర‌చారం చేస్తున్నారు.  ఆపై ఇక్క‌డ అధికంగా ఉండే  సినీ జ‌నం, అందునా  ఎక్కువ‌గా ఉండే క‌మ్మ సామాజిక వ‌ర్గం. వీట‌న్నిటినీ  క‌వ‌ర్ చేయ‌డానికి మాగంటి సామాజిక వ‌ర్గం స‌రిపోతుంద‌ని భావిస్తోంది కారు పార్టీ. దీంతో ఈ గెలుపు త‌మ‌కు న‌ల్లేరు  న‌డకే అన్న ఊహ‌ల్లో ఉంది గులాబీ దండు.  అయితే కాంగ్రెస్ మాత్రం ఎట్ట‌కేల‌కు జూబ్లీహిల్స్  ద్వారా మ‌రో కంటోన్మెంట్ రిజ‌ల్ట్ రిపీట్ చేయాల‌న్న కృత నిశ్చ‌యంతో ఉంది. ఇక ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షీ న‌ట‌రాజ‌న్ అయితే ఈ సీటు ఎలాగైనా స‌రే కైవ‌సం చేసుకోడానికి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇలా ఎటు నుంచి ఎటు చూసినా బీహార్ పోల్, జూబ్లీ బై పోల్ కాంగ్రెస్ కి రెఫ‌రండంగా మార‌నున్నాయ‌నే అంటున్నారంతా. మ‌రి చూడాలి.. ఈ ఫ‌లితాలు కాంగ్రెస్ కి ఎంత అనుకూలంగా వ‌స్తాయో తెలియాలంటే మ‌నం న‌వంబ‌ర్ 14 వ‌ర‌కూ ఎదురు చూడాల్సిందే.

దేశం అభ్యంతరాలు బేఖాతర్.. మిథున్ రెడ్డికే కేంద్రం ఇంపార్టెన్స్!

తెలుగుదేశం, బీజేపీల మధ్య సఖ్యత సరే.. అసలు వైసీపీ విషయంలో కేంద్రం పెద్దలకు ఇంకా సాఫ్ట్ కార్నర్ ఉందా? ఆ పార్టీ నేతలకు కేంద్రం పెద్దల వద్ద ప్రాముఖ్యత ఇసుమంతైనా తగ్గలేదా? అంటే జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ఔనని అనక తప్పదని అంటున్నారు పరిశీలకులు. తాజాగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కేంద్రం ఇచ్చిన ప్రాధాన్యత ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. మద్యం కుంభకోణం కేసులో అరెస్టై.. ఇటీవలే బెయిలుపై విడుదలైన మిథున్ రెడ్డికి ఐరాస (ఐక్యరాజ్యసమితి) జనరల్ అసెంబ్లీకి వెళ్లే భారత ప్రతినిథుల బృందంలో చోటు కల్పించింది. తనకీ అరుదైన గౌరవం ఇచ్చినందుకు మిథున్ రెడ్డి ప్రధాని నరేంద్రమోడీకి కృతజ్ణతలు తెలిపారు. అంతే కాదు.. ఆ బృందంలో ఇటా చోటు దక్కగానే, అలా  పాస్ పోర్టు కోసం కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసేశారు. ఈ నెల 27 నుంచి న్యూయార్క్ లో జరిగే ఐరాస జనరల్ అసెంబ్లీ 80వ సమావేశానికి హాజరయ్యే భారత ఎంపీల బృందాన్ని కేంద్రం ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి నాయకత్వం వహించే ఈ బృందంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి చోటు దక్కింది. అదే సమయంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ నుంచి ఒక్క ఎంపీకి కూడా చోటు దక్కలేదు.   ప్రపంచ దేశాలు శాంతి, భద్రత, మానవ హక్కులు, అభివృద్ధి, అంతర్జాతీయ సహకారం వంటి అత్యంత కీలకమైనఅంశాలపై చర్చించే వేదిక అయిన ఐరాస జనరల్ అసెంబ్లీకి హాజరయ్యే భారత ఎంపీల బృందంలో మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉండి, ఇటివలే బెయిలుపై బయటకు వచ్చిన మిథున్ రెడ్డికి  చోటు కల్పించడంపై తెలుగుదేశం వర్గాలలో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం అవుతోంది. మిథున్ రెడ్డి బెయిలు రద్దు చేయాలని కోరుతూ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది కూడా.  అదలా ఉంటే ఐరాసా జనరల్ అసెంబ్లీకి హాజరయ్యే భారత ఎంపీల బృందంలో తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, బీజేడీ, ఆమ్ ఆద్మీ పార్టీల ఎంపీలు కూడా ఉన్నారు. అయితే కేంద్రంలో మోడీ సర్కార్ మనుగడకు కీలక మద్దతు దారుగా ఉన్న తెలుగుదేశం నుంచి మాత్రం ఒక్కరంటే ఒక్క ఎంపీకి కూడా చోటు దక్కలేదు.  చోటు దక్కకపోవడం అటుంచి.. మిథున్ రెడ్డి ఎంపికను తెలుగుదేశం తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా కూడా కేంద్రం పెద్దలు లెక్క చేయలేదు. నిందితుడు మాత్రమే కదా.. నేరం రుజువు కాలేదుగా అంటూ తేలిగ్గా తీసుకున్నారు.  గతంలో అంటే 2014లో కూడా తెలుగుదేశం రాష్ట్రంలో అధికారంలో ఉంది. కేంద్రంలో ఎన్డీయే సర్కార్ లో భాగస్వామ్య పార్టీగా ఉంది. అప్పట్లో కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కంటే.. ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకే కేంద్రం ప్రయారిటీ ఇచ్చింది. ఇప్పుడు కూడా అదే తీరులో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. 

బిహార్‌ ఎన్నికల సర్వే... గెలుపు ఎవరిదంటే?

  బిహార్‌లో ఎన్డీయే కుటమి ఘన విజయం సాధిస్తుందని మ్యాటిజ్-ఐఎఎఎన్ఎస్ పబ్లిక్ ఒపినియన్ పోల్‌లో వెల్లడైంది. ఎన్డీయే కూటమి బీజేపీ, జేడీయూకి 150-160 సీట్లు గెలిచి అధికారన్ని నిలబెట్టుకునే అవకాశం ఉందని సర్వేపోల్‌ వెల్లడించింది. మహాఘట్‌బంధన్ ఆర్జేడీ, కాంగ్రెస్‌, లెప్ట్ పార్టీలు 70-85 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొంది. ఎన్డీయేకి 49%, మహాఘట్‌బంధన్ 36% ఓట్లు పోలవుతాయని తెలిపింది. ప్రశాంత్ కిశోర్, జన్ సూరజ్ పార్టీకి 2-5 సీట్లు వస్తాయని వివరించింది. బీజేపీ 80-85, జేడీయూ 60-65 సీట్లు గెలుచుకోవచ్చు అని అంచన వేస్తున్నారు. ఆర్జేడీకి 60-65, కాంగ్రెస్‌కి 15-20 అసెంబ్లీ సీట్లు గెలిచే ఛాన్స్ ఉందని ఒపినియన్ పోల్‌ తెలిపింది.  బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువు వచ్చే నెల చివరి వారంతో ముగియనుంది. ప్రస్తుతం బిహార్‌లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉంది. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం లభించలేదు. దీంతో జేడీయూ, బీజేపీ కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నీతీశ్ కుమార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ, రెండేళ్లకే నీతీశ్ ఎన్డీయేను వీడి.. ఆర్జేడీ, కాంగ్రెస్‌తో మహాగఠ్‌బంధన్‌లో చేరి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, ఈ బంధమూ ఎంతోకాలం నిలవలేదు. 2024 జనవరిలో మహా కూటమిని వీడిన జేడీయూ మళ్లీ ఎన్డీయేతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో మరోసారి నీతీశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 

నవంబర్ 11న జూబ్లీ బైపోల్

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు నగారా మోగింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం (అక్టోబర్ 6) విడుదల చేసింది. జూబ్లీ హిల్స్ బైపోల్ వచ్చే నెల 11న జరగనుంది.  కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. షెడ్యూల్‌ ప్రకారం జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు ఈ నెల 13న ఎ  నోటిఫికేషన్‌ విడుదల అవుతుంది. ఆ రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 21 తుదిగడువు.  22న నామినేషన్ల పరిశీలను ఉంటుంది. వచ్చే నెల 11న పోలింగ్ జరుగుతుంది. నవంబర్  14న ఫలితం వెలువడుతుంది.  జూబ్లీ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలన్నీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. జూబ్లీ  ఉప ఎన్నికకు బీఆర్ఎస్ తన అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించింది. మాగంటి గోపీనాథ్ మరణించడం వల్ల అనివార్యమైన ఈ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు ఆయన సతీమణి మాగంట సునీతను బీఆర్ఎస్ బరిలోకి దింపింది. ఎలాగైనా సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో బీఆర్ఎస్ ఉంది. ఇక కాంగ్రెస్ కూడా జూబ్లీ ఉపఎన్నికలో విజయంతో ప్రభుత్వంపై ప్రజలలో సానుకూలత ఉందని నిరూపించాలని భావిస్తోంది. ఇక బీజేపీ విషయానికి వస్తే.. ఈ స్థానం నుంచి పోటీకి ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అభ్యర్థి ఎంపికకు త్రిసభ్య కమిటీని నియమించింది. జూబ్లీ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు బీజేపీ నుంచి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు లంకాల దీపక్ రెడ్డి,  ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, ఎన్వీ సుభాష్, మాధవీ లత  రేసులో ఉన్నారు.  ఇక కాంగ్రెస్ పార్టీలో అయితే జూబ్లీ ఉప ఎన్నికలో టికెట్ కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య చాలా పెద్దగా ఉంది.  ఎవరికి వారే తామే అభ్యర్థి అంటూ ఇప్పటికే ప్రచారం సైతం మొదలెట్టేశారు.  ఈ తరుఏణంలో  తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నలుగురి పేర్లతో ఓ జాబితాను ఏఐసీసీకి సమర్పించింది. ఈ జాబితాలో   నవీన్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ సి.ఎన్‌. రెడ్డి పేర్లు ఉన్నాయి. కాగా పీసీసీ ప్రతిపాదించిన ఈ పేర్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ సోమవారం చర్చించారు.  మూమూలుగా అయితే ఆశావహులు అధికంగా ఉంటే అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీలు చివరి నిముషం వరకూ ఎటూ తేల్చకుండా నాన్చడం కద్దు. అయితే అలా నాన్చడం అసెంబ్లీ, జనరల్ ఎలక్షన్లలో అయితే ఓకే కానీ, ఒకే ఒక్క నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు అలా నాన్చడం వల్ల  మొదటికే మోసం వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నిక జరిగేది ఒకే నియోజకవర్గానికి కావడంతో  ప్రచారం చాలా ముఖ్యపాత్ర వహిస్తుంది. అభ్యర్థిని ఎంత త్వరగా ప్రకటిస్తే అంత త్వరగా ప్రచారం ప్రారంభించడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనూ కాంగ్రెస్ అధిష్ఠానంపై అభ్యర్థి ప్రకటన చేయాలన్న ఒత్తిడి పెరుగుతోంది. అటు బీజేపీ శ్రేణులు సైతం అభ్యర్థి ఎవరో తేల్చండి అంటూ పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నేడో, రేపో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరో తేలిపోయే అవకాశం ఉందని పరిశీలకులు సైతం అంటున్నారు.