పాకిస్థాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ప్రధాని మోడీ
posted on Aug 15, 2025 @ 9:52AM
పంద్రాగస్టు సందర్భంగా ఎర్రకోట బురుజులపై నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన మోడీ పాకిస్థాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్థాన్ అణు బెదిరింపులను భారత్ ఇసుమంతైనా సహించదన్న ఆయన.. దశాబ్దాలుగా అమల్లో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని ఇకపై భారత్ అంగీకరించబోదని విస్పష్టంగా చెప్పారు.
ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన నీళ్లు, రక్తం ఎప్పటికీ కలిసి ప్రవహించవంటూ పునరుద్ఘాటించారు. బారతదేశానికి చెందిన నీటిని పాకిస్థాన్ తో పంచుకునేది లేదని తేల్చేశారు. మన దేశానికి చెందిన నీటిపై మనకు, మన రైతులకు మాత్రమే పూర్తి హక్తు ఉంటుందని మోడీ ఉద్ఘాటించారు. వికసిత భారత్" నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ మరింత కష్టపడి పనిచేయాలని ఈ సందర్భంగా ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.
దేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం (ఆగస్టు 15) ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వాయుసేన హెలికాప్టర్లు 'ఆపరేషన్ సిందూర్' పేరుతో ప్రత్యేక ప్రదర్శన ఇచ్చాయి. ఈ కార్యక్రమంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్కు చెందిన 2,500 మంది ఎన్సీసీ క్యాడెట్లు, 'మై భారత్' వాలంటీర్లు కూడా పాల్గొన్నారు. వీరంతా జ్ఞానపథ్ వద్ద 'నయా భారత్' లోగో ఆకారంలో కూర్చుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.