ఉచితాలపై మోడీ నీతులు... చెప్పేటందుకేనా?
posted on Jan 4, 2023 @ 1:52PM
మాకు ఓటేయండి చాలు... ఇంక మీరేం చేయనవసరం లేదు. మీ అవసరాలన్నీ మేమే ఉచితంగా తీర్చేస్తాం. కాలు బయటపెట్టకుండా మీకు సకల సౌకర్యాలూ ఇంటి ముంగిటకు తీసుకువచ్చి అమరుస్తాం అన్న రీతిలో ఎన్నికలలో విజయమే లక్ష్యంగా పార్టీలు, ప్రభుత్వాలూ పోటీలు పడి మరీ హామీలు గుప్పించేస్తున్న సంగతి విదితమే. అన్నీ ఉచితంగా ఇచ్చేస్తామంటూ హామీలు గుప్పించేసి, తీరా అధికారం చేపట్టిన తరువాత వాటి అమలుకు రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతున్నా సరే నిబంధనలన్నిటికీ తిలోదకాలిచ్చేసి మరీ అప్పులు చేస్తున్నాయి.
ఇంత చేసినా ఇచ్చిన హామీల అమలుకు సరిపోక.. రాష్ట్రాలకు రాష్ట్రాలు దివాళా ముంగిట నిలబడుతున్నాయి. అన్నీ ఉచితమంటూనే.. రోజు గడవడానికి ఆదాయం కోసం ప్రజలపైన పన్నులు విధించి ముక్కు పిండి వసూలు చేస్తూ వారి జీవితాలనూ కుదేలు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల ప్రస్తుత స్థితి ఇందుకు ఉదాహరణగా చెప్ప వచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయాన్నే తీసుకుంటే.. అప్పులు చేసి మరీ ఉచితాలకు లక్షల కోట్లు ఖర్చు వ్యయం చేస్తోంది. అదే చేత్తో నిత్యావసర ధరలన్నీ విపరీతంగా పెంచేసి ఆ ప్రజల నెత్తినే భారం పడేస్తోంది. పాతికేళ్ల మద్యం ఆదాయాన్ని సైతం తాకట్టు పెట్టి అప్పు తెచ్చి రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్ చేయడానికి కూడా సిద్ధమైపోయింది జగన్ సర్కార్.
ఏపీ దుస్థితికి పరోక్షంగా కేంద్రంలోని మోడీ సర్కార్ కూడా కారణమే. రాజకీయ ప్రయోజనం ఆశించి కేంద్రం ఏపీ అడ్డగోలు అప్పులకు అంతకంటే అడ్డగోలుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది. వాస్తవం ఇలా ఉంటే.. ప్రధాని మోడీ మోడీ ఉచితాలు ప్రమాదకరం అంటూ తనదైన స్టైల్ లో రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మోడీ ఆశీస్సులు లేకుండానే కుప్ప తెప్పలుగా అప్పులు చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు తిలోదకాలిచ్చేసి మూడేళ్లలోనే రాష్ట్ర భవిష్యత్ ను అంధకార బంధురంగా మార్చేసిన ఏపీ గురించి ఆయన ఏం చెబుతారనీ ప్రశ్నిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ తీరు దేశ భవిష్యత్ కు ప్రతిబంధకం కాదా అని ప్రశ్నిస్తున్నారు.
ఏపీ అడగడమే ఆలస్యం అన్నట్లుగా అప్పులకు ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా ఏపీలా అడ్డగోలుగా అప్పులు చేసి మరీ ఓట్ల కోసం పెట్టుబడిగా పెట్టిన రాష్ట్ర్రాల నిగ్గు తేల్చి వాటిని నియంత్రించడమే కాకుండా నిబంధనల ఉల్లంఘనపై చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తేనే మోడీ మాటలకు విశ్వసనీయత ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. అన్నిటికీ మించి కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత పేరిట ఓట్ల భద్రత కోసం కొనసాగిస్తున్న ఉచిత బియ్యం పథకం మాటేమిటని ప్రశ్నిస్తున్నారు. పేదలకు ఆహార భద్రత అంటూ మోడీ సర్కార్ 2020 నుంచి 2022 డిసెంబర్ వరకూ అమలు చేసిన ఉచిత బియ్యం పంపిణీని మరో ఏడాది పటు కొనసాగించడాన్ని ఏమనాలని ప్రశ్నిస్తున్నారు.
దేశంలో దేశంలో 81.35 కోట్ల మంది అర్హులైన వారికి ఉచిత ఆహార ధాన్యాలు కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ పథకం అమలు కోసం కేంద్రం మోయలేని ర్థిక భారాన్నితలకెత్తుకునేందుకు కూడా వెరవడం లేదు. ఈ పథకాన్ని మరో ఏడాది పొడిగించడానికి ఏకైక కారణం ఈ ఏడాది పొడవునా ఎన్నికలు జరుగుతుండటమే. ఔను నిజం.. 2023 సంవత్సరంలో దేశంలో మొత్తం 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
ఇంత కీలకమైన సమయంలో ఉచిత పథకాలను కేంద్రం ఎలా రద్దు చేస్తుంది? ఉచితాలు అనర్ధాలన్న ఆయన సూచన చెప్పడానికే కాదు ఆచరించడానికి కాదు అని స్వయంగా మోడీయే తన చేతల ద్వారా నిరూపించుకున్నారని విశ్లేషకులు అంటున్నారు. దేశంలోని మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయి. అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్ల సంఖ్యే అత్యధికం. ఎన్నికలలో మళ్లీ అధికారం అన్నదే మోడీ టార్గెట్. ఈ పరిస్థితుల్లోనే మోడీ ఆహార భద్రత పథకాన్నిమో ఏడాది పాటుపొడిగించారు. దీంతో ఇది పేదలకు ఉచిత ఆహార భద్రత కోసం కాదనీ.. మోడీకి అధికార భద్రత అన్న విర్శలు వెల్లువెత్తుతున్నాయి.