చంద్రబాబును బండబూతులు తిట్టిన మరో మంత్రి.. బాబంటే భయమా లేక...
posted on Oct 3, 2020 @ 10:39AM
టీడీపీ అధినేత చంద్రబాబు పై వైసిపి నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం సహజమే. అయితే ఒకరిద్దరు మంత్రులు మాత్రం అభ్యంతరకర భాషను ఉపయోగించడం కూడా చూసాం. అయితే తాజాగా సౌమ్యుడిగా పేరు ఉన్న ఏపీ రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ సభ్యత మరచి చంద్రబాబు పై నోరు పారేసుకున్నారు. మంత్రి హోదాలో హుందాగా వ్యవహరించాల్సిన ఆయన ఒక బహిరంగ సభలో, మైకు పట్టుకుని మరీ పచ్చి బూతు మాట్లాడారు. అంతేకాకుండా "రాసుకోండి! మరేం పర్లేదు" అంటూ అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులకు సలహా కూడా ఇచ్చారు.
తాజాగా శుక్రవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పరిధిలోని దేశవానిపేటలో సచివాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై తీవ్రమైన విమర్శలు చేస్తూ.. పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘అమరావతి రైతులను రెచ్చగొట్టి, ఉద్యమం నడపడానికి పెయిడ్ వర్కర్స్ను పెడుతున్నారు. మంచి టీ షర్టు, దాని మీద టర్కీ టవల్ వేసుకుని మరీ రైతులకు అన్యాయం చేస్తున్నాడంటాడు ----కొడుకు’’ అని ఒక బూతు మాట ప్రయోగించారు. అంతేకాకుండా మీడియా వారిని చూసి నవ్వుతూ... "రాసుకోండి. నా మాటలు మొత్తం రాసుకోండి ఫర్వాలేదు. ఎంత నిగ్రహించుకున్నా ఆ మాటలు వచ్చేస్తున్నాయ్’’ అని అన్నారు. "అమరావతిలోనే రాజధాని ఉండాలి. విశాఖలో వద్దు" అనే అజెండాతో టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్రలో పోటీకి రావాలని, తాను కూడా పదవికి రాజీనామా చేసి అయన పై బరిలోకి దిగుతానని కృష్ణ దాస్ సవాల్ విసిరారు. ఇంతకూ మంత్రి గారి తాజా ప్రేలాపనలు, వచ్చే ఎన్నికలలో బాబుని ఫేస్ చేయాలంటే భయంతో చేసినవా.. లేక రెండున్నర ఏళ్ల తరువాత సీఎం జగన్ చేసే సమీక్షలో.. ఉంటుందో ఊడుతుందో తెలియని మంత్రి పదవి గురించో అని రాజకీయ విశ్లేషకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.