చంద్రబాబును కల్సిన పిన్నెల్లి బాధితుడు మాణిక్యాలరావు
posted on May 30, 2024 @ 5:18PM
ఎపి సార్వత్రిక ఎన్నికల్లో పిన్నెల్లిలో జరిగిన హింసాత్మక సంఘటనలు మరెక్కడా జరగలేదు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధితుడు నోముల మాణిక్యాలరావు కలిశారు. హైదరాబాద్ లో గురువారం చంద్రబాబును కలిసిన మాణిక్యాలరావు...పిన్నెల్లి సోదరుల అరాచకాన్ని బయటపెట్టాక తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పిన్నెల్లి సోదరుల అరాచకాలపై మీడియాతో మాట్లాడటం, పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినప్పటి నుండి మరింత కక్షగట్టారని వివరించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్యే సోదరుడు తనను, తన కుటుంబాన్ని అంతమొందించేందుకు ప్రైవేటు సైన్యాన్ని ఉసిగొల్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణభయంతో ప్రస్తుతం హైదరాబాద్ లో తలదాచుకున్నానని, సాక్షాత్తు డీజీపీకి కూడా మొరపెట్టుకున్నానని చంద్రబాబుకు వివరించారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ పూర్తిగా ఉంటుందని భరోసా ఇచ్చిన చంద్రబాబు...మాణిక్యాలరావు పోరాటాన్ని అభినందించారు.