సింగరేణి భూమిని ఎవరు అమ్ముకున్నారు?
posted on Mar 25, 2020 @ 11:58AM
మందమర్రిలో శ్రీకృష్ణ థియేటర్ ముందు ఉన్న సింగరేణి భూమి (గ్రౌండ్)ని ఎవరు అమ్ముకున్నారు? మందమర్రిలోని శ్రీకృష్ణ థియేటర్ ముందు సింగరేణికి సంబంధించిన గ్రౌండ్ ఉన్న మాట మందమర్రి ప్రజలందరికీ తెలుసు. అయితే ఆ గ్రౌండ్ క్రమంగా కనుమరుగైపోతున్నా ఎవరూ నిలదీసే దమ్ము ఎవరికీ లేదు. ఎందుకు? దీని వెనకాల ఎవరున్నారు?
గ్రౌండ్ భూమిని కబ్జా చేసి క్రమంగా తెగనమ్ముతున్నారు. అంతే కాదు ఇప్పుడు వారి కన్ను ఆ గ్రౌండ్ ముందు గుడెసెలేసుకొని జీవిస్తున్న పేద కుటుంబాలపై పడింది. అదే గత నలభై సంవత్సరాలుగా జీవిస్తున్న సీస కమ్మరి కుటుంబాలపైన పడింది. మేక తలకాయలను కమిరిచ్చి పొట్టపోసుకునే ఈ సీస కమ్మరి కుటుంబాలను ఎందుకు వెళ్ళాగొట్టాలి అనుకుంటున్నారు, వారి గుడిసెలను అక్రమంగా తొలగించిందెవరు? వాళ్ళను ఏ నీడ లేకుండా బిక్కుబిక్కుమంటూ భయపడుతూ బ్రతికేలా చేస్తుందెవరో ఎవరికి తెలియడం లేదు. ఎవరో డబుల్ గేమ్ ఆడుతున్నారని స్థానికులు అనుకుంటున్నారట.
సీస కమ్మరి కుటుంబాల వాళ్ళను హెల్త్ సెంటర్ సాకుతో గతంలో వెళ్ళాగొట్టాలనుకున్నప్పడు, సాక్షాత్తు ఎమ్మెల్యే బాల్క సుమన్ వెళ్ళవలసిన అవసరం లేదని అభయమిచ్చారట. అయినా ఇప్పుడు ఈ నిరుపేదలను భయపెట్టే వాళ్ళకు తెలియదా లేక మర్చిపోయారా?
సింగరేణి గ్రౌండ్ భూమికి, వాళ్ళ గుడిసెలకు సంబంధం లేకున్నా వాళ్ళను వెళ్ళగొట్టి ఆ భూమిని ఏం చేద్దామనుకుంటున్నారు. పురపాలక అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని పౌరహక్కుల ప్రజాసంఘం నేత ఎం.వి. గుణ ఆరోపిస్తున్నారు.