అమిత్షాకు భోజనం పెట్టిన గిరిజన మహిళకు హోంగార్డు ఉద్యోగం!
posted on Nov 6, 2020 @ 4:44PM
వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్ లో రాజకీయాలు ఇప్పటికే వేడెక్కాయి. బెంగాల్ పై స్పెషల్ ఫోకస్ చేసింది బీజేపీ. అయితే బీజేపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. అమిత్షా పశ్చిమబెంగాల్ పర్యటనలో ఉన్న సమయంలోనే బీజేపీకి షాకిచ్చే నిర్ణయం తీసుకుంది. గతంలో అమిత్ షాకు భోజనం వడ్డించిన గిరిజన మహిళకు హోంగార్డు ఉద్యోగం ఇచ్చింది మమతా సర్కార్.
2017లో అప్పటి బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న అమిత్షా సిలిగురిలోని ఒక గిరిజన మహిళ ఇంటికి వచ్చారు. తన ఇంటికి వచ్చిన అమిత్ షాకు భోజనం పెట్టింది ఆ గిరిజన మహిళ గీతా మహిలి. ఇప్పుడా మహిళకే మమత సర్కార్ హోంగార్డు ఉద్యోగం ఇచ్చింది. ఉద్యోగ నియామక పత్రాలను స్థానిక టీఎంసీ నాయకులు నేరుగా మహలి ఇంటికి వెళ్లి అందజేశారు. నక్సల్బరి పోలీస్ స్టేషన్లో హోం గార్డుగా ఆమెను ప్రభుత్వం నియమించింది. బీజేపీ కేవలం గిరిజనులకు తప్పుడు హామీలివ్వడానికే పరిమితమైందని, మూడేళ్ల క్రితం మహలి ఇంట్లో లంచ్ చేసిన సమయంలో ఆ పార్టీ చాలా హామీలే ఇచ్చిందని, ఆ తర్వాత మళ్లీ ఆమె ముఖం చూడనేలేది స్థానిక టీఎంసీ నేతలు ఆరోపించారు. మమతా బెనర్జీ స్వయంగా ఆమె యోగక్షేమాలు చూసుకున్నారని, ఉద్యోగం కూడా కల్పించారని చెప్పారు.
తనకు మమత సర్కార్ హోంగార్డు ఉద్యోగం ఇవ్వడంపై గిరిజన మహిళ సంతోషం వ్యక్తం చేసింది. టీఎంసీ ఇప్పటికే నాకు ఇల్లు కట్టించి ఇచ్చింది..గ్యాస్ సిలెండర్ ఇచ్చింది. ఇప్పుడు ఉద్యోగావకాశం కల్పించింది. చాలా సంతృప్తిగా ఉంది. ఉద్యోగం రావడంతో నా కుటుంబాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా పోషించుకోగలుగుతానని మహిలి సంతోషం వ్యక్తం చేసింది. అమిత్షా మూడేళ్ల క్రితం మహలి ఇంటికి వచ్చి వెళ్లిన తర్వాత ఆమె, ఆమె భర్త రాజు మహలి టీఎంసీలో చేరారు.
అయితే గీతా మహలికి టీఎంసీ ప్రభుత్వం ఉద్యోగం కల్పించిన సమయంపై బీజేపీ ప్రశ్నలు గుప్పించింది. గిరిజనుల అభివృద్ధిని కాంక్షించే ఉద్దేశం ఇందులో ఎంతమాత్రం లేదని, అమిత్షా బెంగాల్కు వచ్చిన సమయం చూసుకుని మరీ రాజకీయాలకు టీఎంసీ పాల్పడుతోందని ఆరోపించింది. టీఎంసీ ఉద్యోగాలు ఇస్తామంటే తమ మంత్రులంతా పేదలకు ఇండ్లకు వెళ్లి భోజనాలు చేస్తారని బెంగాల్ బీజేపీ నేతలు చెప్పారు.