గాంధీ జయంతి నిజమైన పండగ

ఒంటిమీద కొల్లాయిగుడ్డ.. చేతిలో భగవద్గీత.. పెదాలపై నిరంతరం చెరగని చిరునవ్వు.. అంతులేని శాంతి, సహనం.. సత్యం ఆయన జీవన మార్గం.. అహింస ఆయన ఎన్నుకున్న పదునైన ఆయుధం.. ఏళ్లపాటు భరతజాతిని దాస్యసృంఖలాలతో బంధించిన తెల్లోళ్లని ఓ బోసి నవ్వుల తాతయ్య దేశంనుంచి తరిమికొట్టాడు.. అదీ.. ఆ శాంతిమూర్తి గొప్పదనం.. తను నమ్మిన సిద్ధాంతాల్ని ఆచరించి చూపించి మరీ గాంధీ తాత జాతిపిత అయ్యాడు. తరతరాలకూ ఆదర్శంగా నిలిచిపోయాడు. జాతి దురహంకారాన్ని సమూలంగా ఏరిపారేసేందుకు కంకణం కట్టుకున్న మహాత్ముడు సత్యాగ్రహాలతోనే తెల్లవాళ్లగుండెల్లో గుబులు పట్టించాడు. సత్యానికి అఖండమైన, అనంతమైన శక్తి ఉందన్న సత్యాన్ని ప్రపంచానికి చాటి చూపించాడు. మహాత్ముడి జీవితం ఆద్యంతమూ ఆదర్శప్రాయమే. కోట్లాది రూపాయల్ని కురిపించగల బారిస్టరీని వదిలేసి దేశం కోసం తన సర్వస్వాన్నీ త్యాగం చేశాడు. దేశమాతకు తన జీవితాన్ని కానుకగా ఇచ్చాడు. జాతి దాస్యసృంఖలాల్ని ఛేదించేందుకు నిరంతరం తపించాడు. ఆవేశకావేశాలకు లోనయ్యే యువరక్తాన్ని సన్మార్గంలోకి మళ్లించాడు. జాతిమొత్తం మహాత్ముడి వెంట నడిచొచ్చింది. స్వాతంత్ర్య పోరాటంలో సబర్మతీ ఆశ్రమం పరమపావన క్షేత్రమయ్యింది. చిన్నాపెద్దా తేడా లేదు.. బీదాగొప్పా భేదం లేదు. మహాత్ముడి పిలుపుని అందుకున్న కోట్లాదిమంది భారతీయులు కదనరంగంలోకి దూకారు. సత్యాగ్రహాలతో శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. తెల్లోళ్లు ఓ చెంప పగలగొడితే మరో చెంపచూపించారు. లాఠీలతో చావగొడితే వందేమాతరమంటూ నినదించారు తప్ప తిరగబడి మళ్లీ వాళ్లని చావగొట్టలేదు. శరీరం రక్తమోడుతున్నా శాంతంగా ఉండగల శక్తిని స్వాంతంత్ర్య పోరాటయోధులకు బోసి నవ్వుల తాతయ్యే అందించాడు. ప్రాణాలు పోతున్నా హింసకు పాల్పడకూడదన్న ధృడ నిశ్చయాన్ని

స్వాతంత్ర సమరయోధులకు వరంగా ఇచ్చాడు మహాత్ముడు. అందుకే ఆయన చూపించిన శాంతంలోంచే అంఖడమైన శక్తి జ్వాల పుట్టింది. ఆయన నమ్ముకున్న సత్యం లోంచి విజయం నడిచొచ్చింది. ఇప్పటికీ, ఎప్పటికీ జాతికి మహాత్ముడి శాంతి తత్వం తిరుగులేని శక్తిగా జాతిని నడిపిస్తోంది. అందుకే మహాత్మా గాంధీ పుట్టిన రోజు నిజంగా భారతీయులందరికీ పెద్ద పండగ.

 

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.