హైదరాబాద్ ప్లైఓవర్లపై కెటీఆర్ ట్వీట్
posted on Aug 27, 2024 @ 10:26AM
తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రజలకు మేలు కన్నా కీడు ఎక్కువగా చేసింది. ఫలితంగా వోటర్లు ఆ పార్టీకి పుట్టగతులు లేకుండా తీర్పు ఇచ్చారు. అహంకారమే ఆభరణంగా భావించే మాజీ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రస్తుతం ట్వీట్ లకే పరిమితమయ్యారు. కాంగ్రెస్ పాలనను విమర్శిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. కాంగ్రెస్ చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేకపోతున్నారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు. హైదరాబాద్లో ఫ్లైఓవర్లు, కనెక్టింగ్ రోడ్లపై ట్వీట్ చేసిన కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్(ఎస్ఆర్డీపీ) పనులు నెమ్మదించాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే హైదరాబాద్లో మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఎస్ఆర్డీపీ ద్వారా చొరవ తీసుకున్నామన్నారు. దీని కింద అప్పటి కేసీఆర్ ప్రభుత్వం 42 కొత్త ప్రాజెక్టులను ప్రారంభించిందని గుర్తు చేశారు. అందులో 36 ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి అయ్యాయని, మిగిలిన వాటిని 2024లో పూర్తి చేయాల్సి ఉండేనని తెలిపారు. అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ఎస్ఆర్డీపీ పనులు పూర్తిగా నెమ్మదించాయన్నారు. గడిచిన 8 నెలలుగా సర్కార్ తరుఫున సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లకు సకాలంలో చెల్లింపులు జరగడం లేదని మండిపడ్డారు. ఎస్ఆర్డీపీ ఫేజ్-3 పనులను తిరిగి ప్రారంభించాలని కేటీఆర్ కోరారు. ఈ ఫేజ్-3 పనుల్లో మూసీ వెంబడి ఎక్స్ప్రెస్వే, కేబీఆర్ పార్క్ కింద టన్నెల్స్ నిర్మాణం, ఫ్లైఓవర్లు, అండర్పాస్లు, ఇతర అనేక గ్రేడ్సెపరేటర్లు ఉన్నాయన్నారు.