హుజూరాబాద్ బైపోల్ తర్వాత కేసీఆర్ సంచలనం? సీనియర్లకు షాక్ తప్పదా..
posted on Sep 30, 2021 @ 9:03PM
హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకుంటారా? రాష్ట్ర మంత్రివర్గాన్ని పునర్వ్యవస్తీకరిస్తారా, అంటే పార్టీ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటమిని ఉహిస్తున్న కేసీఆర్.. ఓటమి నుంచి ప్రజలు, పత్రికలు,మీడియా దృష్టిని మరల్చేందుకు,ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్య పోనవసరం లేదని రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. హుజూరాబాద్ గెలుపు ఓటములతో సంబంధం లేకుండానే, ముఖ్యమంత్రి మత్రివర్గ పునర్వ్యవస్తీకరణ గురించి సీరియస్’గా అలోచిస్తున్నారని అటు పార్టీలో, ఇటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా, ఈసారి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెర్త్ ఖాయమని అంటున్నారు. నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, మంత్రి పదవి కోసం అలిగి కొన్ని నెలల పాటు అటు రాజకీయ కార్యక్రమాలకు,ఇటు కుటుంబ వేడుకలకు దూరంగా ఉన్నఆమె ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన హామీవచ్చిన తర్వాతనే తిరిగి రాజకీయ స్రవంతిలోకి వచ్చారని కూడా పార్టీలో వినవస్తోంది. అంతే కాకుండా కవిత మంత్రివర్గంలో ఎంట్రీకి అవరోధాలు లేకుండా, రాకుండా లైన్ క్లేర్ చేసుకుంటూ వస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో తమకు పోటీ వస్తారనుకున్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజీ రెడ్డి గోవర్ధన్’ను కవిత చాకచక్యంగా ఆర్టీసీ చైర్మన్ కుర్చీలో కూర్చో పెట్టారు.
శాసన మండలిలో చేసిన తొలి ప్రసంగంలోనే కవిత సొంత ప్రభుత్వంపై విమర్శలు చేశారు.అయితే ఆమె విమర్శల లక్ష్యం మాత్రం ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి కాదు, మంత్రి ఎర్రబెల్లిని టార్గెట్ చేసేందుకే ఆమె పంచాయతీ రాజ్ శాఖ పని తీరును పట్టి చూపించే ప్రయత్నం చేశారని,అందుకూ ఓ లెక్కుందని అంటున్నారు. నిజమే, ఆమె స్థానిక ప్రజాప్రతినిధుల నియోజక వర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు కాబట్టి, ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా శాసనమండలిలో ఎంపీటీసీ, జడ్పిటిసి సభ్యుల సమస్యలపై ప్రస్తావించారు అనుకోవచ్చును. అయితే, నిజంగా కూడ అందులో కొంత నిజం ఉన్నా ఉండవచ్చును. కానీ, అదే సమయంలో జిల్లా లెక్కల్లో బాజిరెడ్డి అడ్డును తప్పించుకున్న విధంగానే క్యాస్ట్ (వెలమ) ఈక్వేషన్లో అడ్డవుతారనుకున్న ఎర్రబెల్లి మంత్రి పదవికి ఎర్త్ పెట్టే వ్యూహం కూడా అందులో ఉందని అంటున్నారు.
శాసనమండలిలో కవిత చేసిన వ్యాఖ్యలను గమనిస్తే, మంత్రి ఎర్రబెల్లిని టార్గెట్ చేశారనే అనుమానాలు బలపడుతున్నాయని అంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఎదుర్కుంటున్న సమస్యలు మంత్రి దయాకర రావు దృష్టికి తెస్తున్నానని, మొదలు పెట్టి సమస్యలు ఏకరవు పెట్టిన కవిత, పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యం కంటే, మంత్రి చేతకానితనం ఎక్కువ ఉందనే విధంగా మాట్లాడారు. ఆమె ప్రసంగం అలా సాగిందని అంటున్నారు.గతంలో కూడా అనేక సమస్యలు మంత్రి ఎర్రబెల్లి దృష్టికి తీసుకు వెళ్ళానని అయినా ప్రయోజనం లేదని అన్నారు. ఎంపీటీసీలు జడ్పీటీసీలు కూర్చునేందుకు కుర్చీలు కూడా లేవని, మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు చొరవ తీసుకుని, ఈ చిన్న సమస్యను పరిష్కరించాలని అన్నారు. అలాగే కొత్తగా మండలాలు అయితే ఏర్పడ్డాయి కానీ, ఎంపీపీలకు కార్యాలయాలు లేవని, అందుకు కూడా మంత్రి దయాకర రావే కారణ మన్నట్లుగా కవిత మాట్లాడారు.
అదే సమయంలో 15 ఫైనాన్సు కమిషన్ స్థానిక సంస్థలకు ఐదువందల కోట్ల రూపాయల లోటు పెట్టినా, మండల, జిల్లా పరిషత్ సభ్యుల గౌరవం కాపాడడం కోసం, ముఖ్యమంత్రి కేసీఆర్ అందనంగా ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించారని, అన్నారు. అంటే లోపాలను మంత్రి ఎర్రబెల్లి ఖాతాలో వేసిన కవిత క్రెడిట్ ను మాత్రం ముఖ్యమంత్రి ఖాతాలో వేశారు. ఇలా ఆమె ఎర్రబెల్లి మంత్రి పదవికి కూడా ఎసరు పెట్టారని, అంటున్నారు. మంత్రి వర్గ విస్తరణలో భారీ, సంచలనాత్మక మార్పులు ఉంటాయని అంటున్నారు. ఒకరిద్దరు సీనియర్ మంత్రులకు కూడా ఉద్వాసన తప్పక పోవచ్చని, కవితతో పాటుగా మరో సీనియర్ ఎమ్మెల్సీకి కూడా మంత్రివర్గంలో స్థానం లభించవచ్చని అంటున్నారు.