కేసీఆర్.. మరో కేఏ పాల్!?
posted on May 12, 2024 @ 10:39PM
దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతానంటూ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీయే నాకు పోటీ అన్నట్లుగా పీఎం కుర్చీపై గురిపెట్టారు. మోడీతో ఢీ అంటే ఢీ అన్నారు. దేశంలోని పలు ప్రాంతీయ పార్టీల అధినేతలతో భేటీ జరిపి ఒకే తాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేశారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీని విస్తరించేందుకు ప్రయత్నాలు చేశారు. మూడు నాలుగు బహిరంగ సభలు పెట్టి ఇక మహారాష్ట్రలోనూ బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని చెప్పారు. ఇవన్నీ ప్రజలు నమ్మారు. ప్రాంతీయ, జాతీయ మీడియా సైతం కేసీఆర్ మాటలను విశ్వసించింది. కానీ, ప్రస్తుతం ఒక్కసారిగా సీన్ మారిపోయింది. గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. సీఎం కేసీఆర్ కాస్తా.. మాజీ సీఎం అయ్యారు. కేసీఆర్ మాత్రం ఇంకా తానే సీఎంను అనే భ్రమల్లో ఉన్నట్లు కనిపిస్తోంది. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా కేసీఆర్ ప్రవర్తన ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ సభల్లో కేసీఆర్ ప్రసంగాలు చూస్తే అదే విషయం తేటతెల్లం చేస్తున్నాయి. తాజాగా కేసీఆర్ నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాటలు రాజకీయ వర్గాలలో నవ్వులు పూయించింది. జనబాహుల్యంలో ఆయనను నవ్వుల పాలు చేసింది.
తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఉన్న సమయంలో కేసీఆర్ మాటలు ప్రతి ఒక్కరూ విశ్వసించే వారు. ఎందుకంటే.. ఆయన చెప్పిన మాటలు కార్యరూపం దాల్చేందుకు ఆస్కారం ఉండేది. కానీ, అధికారం కోల్పోయిన తరువాత కూడా తాను చెప్పిందే జరుగుతుంది అనే తరహాలో కేసీఆర్ వ్యాఖ్యలు, తీరు ఉండటం బీఆర్ఎస్ శ్రేణులకు కూడా మింగుడు పడటం లేదు. కేసీఆర్ ప్రస్తుతం అధికారంలో లేరు. అంతేకాక, అధికారంలో ఉన్నన్ని రోజులు ఆయన పక్కన ఉన్న ప్రజాబలం, పేరున్న నేతలు సైతం బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నేతలు, ద్వితీయ శ్రేణి నేతలు బీఆర్ఎస్ ను వీడుతున్నారు. రోజు రోజుకూ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, బీజేపీలోకి చేరికలు పెరుగుతున్నాయి. ఇవన్నీ గ్రహించని కేసీఆర్ వాస్తవానికి దూరంగా వ్యాఖ్యలు చేయడం బీఆర్ఎస్ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో కేసీఆర్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 12 నుంచి 14 స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో ఎలాంటి తప్పులేదు. ఏపీలో వైసీపీకి 175 స్థానాలకు 175 స్థానాలు వస్తాయని జగన్ చెప్పుకుంటున్నట్లుగా కేసీఆర్ కూడా తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో 17కు 17 పార్లమెంట్ స్థానాల్లో గెలుస్తామని చెప్పుకోవచ్చు. కానీ, తన పరిధి దాటేసి.. కేంద్రంలో అధికారం ప్రాంతీయ పార్టీల కూటమిదే.. అవకాశం వస్తే ప్రధాని రేసులో తానూ ఉంటానంటూ చెప్పుకోవటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కేసీఆర్ అధికారాన్ని కోల్పోయినప్పటికీ వాస్తవాలను తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
కేసీఆర్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన మాటలను చూస్తే ఎవరికైనా కేఏ పాల్ గుర్తుకొచ్చే ఉంటారు. ఎందుకంటే.. కేఏ పాల్ అంటే ఆషామాషీ వ్యక్తి కాదు. ప్రపంచ దేశాల్లో గుర్తింపు పొందిన మతబోధకుడు. దేశంలోని అనేక రాజకీయ పార్టీల అధినేతలు సైతం ఒకప్పుడు కేఏ పాల్ అపాయింట్ మెంట్ కోసం వేచి చూడాల్సి వచ్చేందన్నది జగమెరిగిన సత్యమే. కానీ, ప్రస్తుతం కేఏ పాల్ పరిస్థితి ఏమిటి. ఊహకు కూడా అందని విధంగా కేఏ పాల్ మాట్లాడటంతో ప్రజలు ఆయన్ను విశ్వసించడం మానేశారు. రాజకీయాల్లో మన స్థాయిని గుర్తెరిగి మాట్లాడాలి. కానీ, కేఏ పాల్ ఆచరణకు సాధ్యంకాని హామీలు, వాగ్దానాలతో ప్రసంగాలు చేయడం, ఇంటర్వ్యూలు ఇవ్వడంతో ఆయన్ను తెలుగు ప్రజలు ఓ జోకర్ గా భావిస్తున్నారు. రాబోయే కాలంలో కేసీఆర్ కు అదే పరిస్థితి ఎదువుతుందన్న వాదన రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నది. ప్రధాని మంత్రిని అవుతానని కేసీఆర్ చెప్పడంతో ఆయనను పాల్ తో పోలుస్తూ సెటైర్లు పేలుతున్నాయి.