కేసీఆర్ కుటుంబ అవినీతి అక్షరాలా 9లక్షల కోట్ల రూపాయలు.. సీబీఐకి కేఏ పాల్ ఫిర్యాదు
posted on Jun 24, 2022 @ 10:24AM
కేఏ పాల్ .. తెలుగు రాష్ట్రాలలో ఇది పరిచయం అక్కర్లేని పాల్. గత ఎన్నికలలో ఏపీలో హడావుడి చేసిన పాల్.. ఈ సారి తెలంగాణలో తన హంగామా చూపుతున్నారు. తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లంటారు. ఆయన మాటను ఎవరూ కాదనరు. ఎందుకంటే అసలు ఆయన మాటలను ఎవరూ పట్టించుకోనే కోరు కనుక. వరుస పెట్టి అందర్నీ ఆయన కలిసేస్తూ ఉంటారు. అమిత్ షా అయినా, కేసీఆర్ అయినా, జగన్ అయినా ఇలా ఎవరైనా సరే ఆయన కలుస్తానంటే వద్దని అనరు ఎందుకొచ్చిన గొడవ ఆయన చెప్పేదేదో చెప్పనిచ్చి పంపిస్తే పోలా అనుకుంటారు. ఇప్పుడు ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి భరతం పడతానంటున్నారు. అని ఊరుకోలేదు. కేసీఆర్ కుటుంబం అవినీతిపై సీబీఐకి ఫిర్యాదు చేశారు. సీబీఐ కార్యాలయానికి వెళ్లి సీబీఐ డైరెక్టర్ సుభోద్ కుమార్ జైశ్వాల్ కు కేసీఆర్ అవినీతిపై ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ఆయన కుటుంబం ఏకంగా 9 లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిందనీ, ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి, ఇంతటి అవినీతిని తాను చూడలేదనీ ఆయనా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎందుకంటే కేఏ పాల్ ప్రపంచం చుట్టి వచ్చిన వీరుడు కదా. ఎక్కడా కనని, వినని అవినీతి తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం పాల్పడిందని, వెంటనే విచారణ జరిపించాలన్నది ఆయన ఫిర్యాదు సారాంశం. ఇది తన ఒక్కడి మాటే కాదనీ యావత్ తెలంగాణ ప్రజ కేసీఆర్, ఆయన కుటుంబం పాల్పడిన అవినీతిపై విచారణ జరగాలని కోరుకుంటోందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
రాష్ట్ర విభజనతో 60వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తో ఆవిర్భవించిన తెలంగాణ కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలనలో నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందన్నారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి కేసీఆర్ కుటుంబ అవినీతికి ఆకాశమే హద్దు అన్నట్లుగా చెలరేగిపోయిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతే కాకుండా తెలంగాణ సహా సింగపూర్ దుబాయ్, అమెరికాలలో కూడా ఆ కుటుంబం ఆస్తులు కూడబెట్టిందని పాల్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా బడ్జెట్ లక్షా 5వేల కోట్ల రూపాయలైతే కేవలం 35 వేల కోట్ల రూపాయలే ఖర్చు చేశారని, ఏకంగా కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పి 75 వేల కోట్ల రూపాయలు దోచుకున్నారనీ ఫిర్యాదులో పేర్కొన్నారు. యాదాద్రి విషయంలోనూ అంతులేని అవినీతికి పాల్పడ్డారని సమగ్ర విచారణ జరిపితే అన్నీ బయటకు వస్తాయనీ పాల్ సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆయన మాటలు ఎవరు నమ్మినా నమ్మకపోయినా.. కేంద్ర దర్యాప్తు సంస్థకు ఫిర్యాదు చేశారు కనుక ఆ సంస్థ దర్యాప్తు ప్రారంభిస్తుందా.. లేక రాజకీయ విదూషకుడి చర్యగా నవ్వుకుని వదిలేస్తుందా అన్నది చూడాలి. సీబీఐ ఏ దర్యాప్తునూ తనంత తానుగా చేపట్టదు కనుక పాల్ ఇచ్చిన ఫిర్యాదుపై సీబీఐ దర్యాప్తునకు కదులుతుందని భావించలేం.
వార్తల్లో నిలవడానికి ఇదో మార్గంగా ఎంచుకుని పాల్ సీబీఐ ఫిర్యాదు అంటూ హడావుడి చేశారని పరిశీలకులు అంటున్నారు. అయితే కేసీఆర్ కుటుంబ అవినీతిపై దర్యాప్తునకు తాను పూర్తి సహకారం అందిస్తాననీ పాల్ సీబీఐకి హామీ ఇచ్చారు. కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే తెలంగాణలో తనపై దాడులు జరుగుతున్నాయని పాల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫిర్యాదు కాపీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సైతం పంపారు.