బీఆర్ఎస్ పార్టీ కోసం 20 ఏళ్లు నా జీవితాన్ని దారబోశా : కవిత
posted on Sep 29, 2025 @ 8:48PM
లండన్ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరం వచ్చినప్పుడు ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతామని అభిమానులతో కవిత అన్నారు. తెలంగాణ, బీఆర్ఎస్ పార్టీ కోసం 20 ఏళ్లు నా జీవితాన్ని దారబోశానని తెలిపారు. లండన్లోని తెలంగాణ ప్రవాసులతో కవిత ముఖాముఖి మాట్లాడారు. తెలంగాణ జాగృతిని దేశానికి రోల్ మోడల్గా నిలపాలన్నదే సంకల్పమని చెప్పారు. సామాజిక తెలంగాణ కోసం జాగృతి పనిచేస్తుందన్నారు.. నా వెనక ఏ జాతీయ పార్టీ లేదు.. జాతీయ పార్టీల్లో చేరే ఆలోచ లేదని కవిత అన్నారు.
పార్టీ లోపల చీలికలు రాకూడదని ఎన్నో ఇబ్బందులు భరించాను. ఆ సమయంలో అనేక అవమానాలు ఎదుర్కొన్నాను. నా ఓటమి నుంచి 2023 శాసన సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి వరకు కుట్రలే కొనసాగాయి. అయితే ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లోనే మాట్లాడాల్సి వచ్చింది. ఈ విషయాలు ప్రజల్లోకి వచ్చిన తర్వాత స్పందించకపోతే సరికాదు. అందుకే నా అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నాను. పార్టీ నన్ను అక్కర్లేదనుకుంది కాబట్టే.. నేను కూడా పార్టీ ఇచ్చిన పదవిని వదిలేశాని కవిత పేర్కొన్నారు.
నియమావళి ప్రకారం రాజీనామా చేశాను. కానీ, ఇంకా శాసన మండలి ఛైర్మన్ ఆమోదించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. నేను ఈ స్థితికి రావడానికి కారణం అవతలి వాళ్లే. కష్టమని తెలిసినా మాజీ సీఎం కేసీఆర్ బిడ్డగా ధైర్యంగా ముందుకు వెళ్తాను. జైలు జీవితం నాలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. అది నన్ను సమూలంగా మార్చేసింది. నిజమైన మార్పు కోసం తెలంగాణ ఉద్యమకారులు ఒక్కటై పనిచేయాలి’’ అని కవిత అన్నారు.