రైతులకు మద్దతుగా పోలీసు స్టేషన్ వద్ద అవినాష్ రెడ్డి ధర్నా

 

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం  లింగాల మండలంలో విపరీతంగా, విచ్చల విడిగా రైతులకు సంబంధించిన వ్యవసాయ విద్యుత్  మోటార్ల కేబుల్స్ చోరీకి గురవుతన్నాయని, వెంటనే అరికట్టి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం లింగాల పోలీసు స్టేషన్ ఎదుట కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రైతులతో కలిసి బైఠాయించారు. 

లింగాల మండల పరిధిలోని పలు  గ్రామాల్లో రైతులకు సంబంధించిన వ్యవసాయ విద్యుత్ మోటార్లు కేబుల్ వైర్లను దొంగలించడంతో రైతులందరూ ఎం.పి వై.ఎస్ అవినాష్ రెడ్డినికలసి ఫిర్యాదు చేశారు. దీంతో ఎం.పి వై.ఎస్ అవినాష్ రెడ్డి  రైతులతో  లింగాల ఎస్.ఐ అనిల్ కుమార్ ను కలసి ఇటీవల రైతుల కేబుల్ వైర్లు దొంగతనాల పై చర్చించారు. అలాగే ఈ దొంగతనాల పై షెల్కే నచికేతన్ విశ్వనాథ్ తో కూడ ఫోన్ లో మాట్లాడారు. వీలైనంత త్వరగా దొంగలను  పట్టుకొని కఠినంగా శిక్షించి రికవరీ చేయించాలని కోరారు. 
    

అనంతరం ఎం.పి  రైతులతో కలసి లింగాల పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  గత కొన్ని రోజులుగా మండల పరిధిలోని పలు గ్రామాల్లో రైతుల వ్యవసాయ మోటార్ల కేబుల్ వైర్లను దొంగలు చోరీ చేయడంతో రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.  నిన్న రాత్రి ఒక్క రోజే 40 మంది రైతులకు సంబంధించిన కేబుల్స్ చోరీకి గురయ్యాయన్నారు.  రైతుల కేబుల్స్ దొంగతనాలు జరుగుతుంటే ప్రభుత్వం ఏమి చేస్తోందని ఆయన ప్రశ్నించారు.  

కొమ్మనూతల గ్రామానికి చెందిన  పురుషోత్తమరెడ్డి భార్యకు సంబంధించి 1000 మీటర్ల కేసుబ్ చోరీ గురి కావడంతో రూ.2.5 లక్షలు నష్టపోయారన్నారు.  ఈ విషయాన్ని ఎస్.ఐ దృష్టికి తీసుకెళ్లడంతో త్వరలో రికవరీ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. రైతులకు జరుగుతున్న  నష్టాన్ని గుర్తించి రికవరీ విషయంలో శ్రద్ధ చూపాలని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లామన్నారు.   ప్రస్తుతం అరటి పంట కు టన్ను రూ.4 వేలు, 5 వేలు అడుగు తుండడంతో  రైతులు ఆర్థికంగా చితికి పోతున్నారన్నారు.  

దీనికి తోడు దొంగలు ఇష్టానుసారంగా రైతుల కేబుల్ వైర్లను తస్కరించడంతో రైతుల బాధ వర్ణణాతీతమన్నారు. వీలైనంత త్వరగా కేబుల్ వైర్ల దొంగలను పట్టుకుని వైర్లు రికవరీ చేయాలని, అలాగే కేబుల్ వైర్ లోని రాగి వైరు కొన్న వారిని కూడ అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నట్లయితే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావన్నారు. 

కేబుల్ వైర్లు పోయిన రైతులకు నష్టపరిహారం కూడ అందేలా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు.సాగుచేసిన పంటలకుగిట్టు బాటు ధరలు లభించక రైతులు ఇబ్బందులు పడుతుంటే నేడు మోటార్ కేబుల్స్ చోరీకి పాల్పడు తుండండతో ఆర్థికంగా మరింత ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారన్నారు.  తప్పుడు పనులు చేసే వారు మానుకోవాలని, రైతుల పొట్ట కొట్ట వద్దని ఎం.పి వై.ఎస్ అవినాష్ రెడ్డి కోరారు.

తన విగ్రహాన్ని తానే ఆవిష్కరించనున్న రైతు బిడ్డ

ఉన్న ఊరు కన్న తల్లి అంటారు. అందులోనూ రైతుకు అయితే ఉన్న ఊరే కాదు.. తాను సాగు చేసే భూమి కన్నతల్లి కంటే ఎక్కువే. రైతుకు భూమితో ఉన్న అనుబంధాన్ని పోల్చడానికి ఏ బంధమూ సరిపోదు.  రైతు బిడ్డ ఏ దేశమేగిగా, ఎందు కాలిడినా సొంత గడ్డ, తాను సాగు చేసిన పొలం మీదే ధ్యాస ఉంటుంది. ఎక్కడా ఇమడ లేడు. ఎప్పుడెప్పుడు వచ్చి సొంత ఊర్లో, సొంత భూమిలో సాగు చేసుకుందామా అని తహతహలాడుతుంటాడు. అదిగో అచ్చం అలాంటి పదహారణాల రైతు ఉదంతమిది. భూమితో ఉన్న అనుబంధానికి తార్కానంగా తన సొంత భూమిలో తాను బతికుండగానే తన విగ్రహాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. వివరాల్లోకి వెడితే.. కళ్లెం నరసింహారెడ్డి పదహారణాల రైతు. ప్రస్తుతం ఆయన వయస్సు 89 ఏళ్లు.  ఈ వయసులోనూ వ్యవసాయం మీద మమకారం పోలేదు. భూమిపై అనుకర్తి తగ్గలేదు. సొంత ఊరు, దేధం వదిలి మూడు దశాబ్దాల పాటు అమెరికాలో ఉన్నా.. ఆయడా ఆయన వ్యాపకం వ్యవసాయమే.  అమెరికాలో ఐదువేల ఎకరాలు లీజుకు తీసుకుని రకరకాల పంటలు సాగు చేసి రికార్డు సృష్టించారు. అమెరికా ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ నుంచి  ఉత్తమ రైతు అవార్డు  కూడా అందుకున్నారు. అయితే మాతృభూమిపై మమకారం తీరలేదు. అందుకే స్వదేశానికి, అందులోనూ సొంతగడ్డ తెలంగాణకు వచ్చేశారు.  చిలుకూరు సమీ పంలో తన పేరుమీద అంటే కళ్లెం నర్సింహా రెడ్డి పేరుతో వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసుకున్నారు.  ఎన్నో సాగు పద్దతులతో  పేరు గడించిన కళ్లెం ఇప్పుడు తన సొంత ఫామ్ లో మొక్కలు...చెట్లు పెంచిప్రకృతి లోనే జీవితం గడుపుతున్నారు. నిత్యం తన వ్యవసాయ క్షేత్రంలో కలియదిరగందే, ఆయనకు రోజు గడవదు, నిద్రపట్టదు. తొమ్మది పదులకు చేరువ అవుతున్న ఈ వయస్సులోనూ ఆయన పనులు ఆయనే చేసుకుంటారు.   తెలంగాణ పల్లె నుంచి అమెరికా దాకా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న కళ్లెం నర్సింహా రెడ్డి ఇప్పుడు నేల తల్లితో తన మమకారాన్ని వినూత్నంగా చాటి వార్తల్లోకి ఎక్కారు. ఇంతకీ ఆయన ఏం చేశారంటే.. తన వ్యవసాయ క్షేత్రంలో తన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరణించిన తన భార్య విగ్రహం పక్కనే తన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకుని మరణించిన తరువాత తాను తన భూమాతతో అనుబంధం కొనసాగుందంటి చాటారు.   తన భార్య ప్రథమ వర్ధంతి సందర్భంగా శుక్రవారం (డిసెంబర్ 19)న ఈ విగ్రహాలను ఆవిష్కరిం చనున్నారు. అంతే కాకుండా భార్య మరణానంతరం కూడా ఆమెకు తోడుగా తాను ఉన్నానని కూడా ఈ విగ్రహాల ఏర్నాటు చేసినట్లు ఆయన చెబుతారు. ఈ విగ్రహాలను కళ్లెం నరసింహారెడ్డి స్వయంగా శుక్రవారం (డిసెంబర్ 19) ఆవిష్కరించనున్నారు.  ఆమె  ఓంటరిగా ఉండొద్దు అనే ఉద్దేశంతో తన విగ్రహాన్ని కూడా పక్కనే పెట్టుకుంటున్నారు. ఈ విగ్రహాలు స్వయంగా ఆయనే ఆవిష్కరిస్తారు.

వల్లభనేని వంశీ.. వెంటాడుతున్న గత పాపాలు.. తాజాగా మరో కేసు

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని కేసులు వదలడం లేదు. ఇప్పటికే ఆయనపై దాడి, దౌర్జన్యం, భూ కబ్జా ఇలా పలు కేసులు నమోదై ఉన్నాయి. గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్ధం కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదరించిన కేసులో జైలుకు వెళ్లి బెయిలుపై బయటకు వచ్చారు.   వల్లభనేని వంశీ దాదాపు 140 రోజులు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పటికే వంశీ  మొత్తం 11 కేసులలో నిందితుడిగా ఉన్నారు.   ఈ నేపథ్యంలో ఆయనపై తాజాగా మరో కేసు నమోదైంది. విజయవాడ మాచవరం పోలీసు స్టేషన్ లో ఈ కేసు నమోదైంది. వంశీ తన అనుచరులతో కలిసి తనపై గత ఏడాది జులైలో దాడికి పాల్పడ్డారంటూ సునీల్ అను వ్యక్తి ఫిర్యాదు మేరకు వల్లభనేని వంశీపై తాజాగా మాచవరం పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది.    జగన్ హయాంలో   దాడులు, దౌర్జన్యాల, కబ్జాలు, అనుచిత వ్యాఖ్యలతో దూషణలతో చెలరేగిపోయిన వల్లభనేని వంశీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సైలెంటైపోయారు. కేసుల భయంతో వణికిపోయి దాదాపుగా అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టేందుకు కూడా జంకుతున్న పరిస్థితి.  గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంకా వైసీపీలో ఉన్నారా? అసలు రాజకీయాలలో ఉన్నారా? అంటూ వైసీపీ శ్రేణులే సందిగ్ధంలో ఉన్న పరిస్థితి.  కోర్టు ఆదేశాల మేరకు వల్లభనేని వంశీ గన్నవరం సమీపంలోనే నివాసం ఉంటున్నా  వైసీపీ నేతలను, కార్యకర్తలను కలవడం లేదు. వారిని కనీసం తన ఇంటి ఛాయలకు కూడా రానీయడం లేదంటున్నారు.  కానీ ఇదే వంశీ.. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం కబ్జాలు, దాడులు, దౌర్జన్యాలతో చెలరేగిపోయారు. తెలుగుదేశం అగ్రనాయకులు, వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయారు.  ఇప్పుడు సైలెంటైపోయినంత మాత్రాన కర్మ వదులుతుందా?  అంటే వదలదని ఆయనపై నమోదైన కేసులు చెబుతున్నాయి. తాజాగా  వంశీపై మరో కేసు నమోదైంది.   

అనాధ బాలల నైపుణ్యాభివృద్దికి సహకారం : ఎంఈఐఎల్ ఫౌండేషన్

  అనాధ బాలల్లో నైపుణ్యాభివృద్దితో పాటు, ఎం ఎన్ జె కాన్సర్ ఆసుపత్రి  అభివృద్దికి సంపూర్ణ సహకారం అందిస్తామని మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రుక్చర్స్ లిమిటెడ్ (ఎం ఈ ఐ ఎల్ ) డైరెక్టర్ సుధా రెడ్డి అన్నారు. తమ సంస్థ పది సంవత్సరాల నుంచి యువతలో నైపుణ్యాలను పెంచి వారు సొంత కాళ్లపై నిలబడేలా శిక్షణనిస్తున్నదని,  అనాధ బాలలు కూడా అలా తమ కాళ్లపై తాము  నిలబడేలా చర్యలు తీసుకుంటామన్నారు.  నిమ్స్ ఆసుపత్రిలో  క్యాన్సర్ బ్లాక్ ను ఎలా అయితే అభివృద్ధి చేసామో అలానే ఎం ఎన్ జె క్యాన్సర్ ఆసుపత్రిని కూడా అభివృద్ధి చేస్తామని అన్నారు.   ముందుగా ఇక్కడి వైద్యులతో మాట్లాడి ఏమి అవసరమో తెలుసుకుని  ఆ అవసరాలను తీరుస్తామన్నారు. ఎం ఈ ఐ ఎల్, ఎస్ ఆర్ ఫౌండేషన్ ల ఆధ్వర్యంలో   బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో అనాధలకు చలి నుంచి రక్షణ పొందేందుకు ఉన్ని  బ్లాంకెట్లను పంపిణీ చేశారు. ఎమ్ ఎన్ జె కాన్సర్ ఆసుపత్రిలో చిన్న పిల్లలకు బ్లాంకెట్స్, పండ్లు,   , మూసాపేటలోని సాయి  సేవా సంఘ్ లో  విద్యను అభ్యసించే వారికి  బ్లాంకెట్స్ ను సుధా రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో, ఆ తరువాత విలేకరులతో సుధా రెడ్డి మాట్లాడారు.  నగరంలోని సాయి సేవా సంఘ్   విద్యా మందిర్ లో   ఆనాధలు, తల్లి లేదా తండ్రిని కోల్పోయిన వారు విద్యనభ్యసిస్తున్నారు. వారు పదో తరగతి లేదా ఆ  పై చదువుల తరువాత  తమ కాళ్లపై తాము నిలబడి స్వశక్తితో జీవించేందుకు తమ సంస్థ సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు.   ఈ సంస్థ కొన్ని వృత్తి విద్యా కోర్సులు నిర్వహిస్తోందని, వాటికి అదనంగా తమ సంస్థ తరపున అదనపు  కోర్సులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు.  చిన్న పిల్లలతో గడపడం వల్ల వచ్చే సంతోషం వేరే కార్యక్రమాల వల్ల తనకు రాదన్నారు. అందుకే తాను చిన్న పిల్లల కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు.  తనకు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ స్ఫూర్తి అని అన్నారు. తానూ చిన్నగా ఉన్నపుడు కొన్ని అంశాలను ఆమె ద్వారా  స్ఫూర్తిగా తీసుకుని నిర్ణయాలు తీసుకున్నానని అన్నారు.  చిన్నపుడు తీసుకునే సరైన నిర్ణయాలు అందరి జీవితాలను ఒక మలుపు తిప్పుతాయని, అందువల్లే ప్రతి ఒక్కరు చిన్న వయస్సులో సరైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు.   ప్రస్తుతం ప్రతి ఒక్కరు చలికాలంలో ఇబ్బందులు పడుతున్నారని, ఆ ఇబ్బందుల నుంచి బైట పడేసేందుకు తమ  ఫౌండేషన్ల తరఫున సాయం చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం తెలంగాణాలో ఈ కార్యక్రమం ప్రారంభమైందని, దీన్ని విస్తరిస్తామని తెలిపారు   చలికాలంలో  అంటువ్యాధులు, జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యతను ఇవ్వాలని అన్నారు.  ఎం ఎన్ జె క్యాన్సర్ ఆసుపత్రిలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను ముద్దాడిన సుధా రెడ్డి వారికి  బ్లాంకెట్స్,   పండ్లు పంపిణీ చేశారు. తాము అక్షయ పాత్ర ద్వారా క్యాన్సర్ రోగులకు కొని సంవత్సరాల నుంచి ఆహారం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. తమ ఫౌండేషన్ కార్యక్రమాలు మరింత విస్తృత పరుస్తామన్నారు.  ఈ కార్యక్రమంలో సాయి సేవా సంఘ్ ప్రతినిధులు, ఎం ఎన్  జె క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు.  

ఏఎన్ఆర్ పుట్టిన గడ్డ గుడివాడకు రావడం గర్వంగా ఉంది : హీరో నాగార్జున

  నాన్న ఏఎన్ఆర్ పుట్టిన గుడివాడ రావడం తనకు ఎంతో భావోద్వేగంగా ఉందని సినీ హీరో అక్కినేని నాగార్జున అన్నారు. ఏఎన్ఆర్ స్థాపించిన సంస్థలు తనకు ఎప్పుడు ప్రత్యేకమేనవేనని నాగార్జున తెలిపారు ... ఏఎన్ఆర్ కళాశాల విద్యార్థుల స్కాలర్షిప్ నిమిత్తం రూ.2కోట్ల రూపాయలను ప్రకటించారు. గుడివాడ ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెండో రోజు వేడుకల్లో సినీ హీరో అక్కినేని నాగార్జున, హైకోర్టు జస్టిస్ బట్టు దేవానంద్, గుడివాడ, పామర్రు ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజాలు ముఖ్యఅతిథిలుగా పాల్గొన్నారు. ముందుగా నాగార్జున సభా వేదిక మీదకు చేరుకోగానే అభిమానులు, విద్యార్థులు కేరింతలు కొడుతూ సందడి చేశారు.  అనంతరం హీరో నాగార్జునకు, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శాలువా, పుష్పగుచ్చం అందిస్తూ  గౌరవ సత్కారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హీరో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ..అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మ పేర్ల మీద... కళాశాల విద్యార్థుల  స్కాలర్షిప్ కోసం... కుటుంబం తరఫున రూ.2కోట్లను అందిస్తున్నట్లు ప్రకటించారు.ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంతో పాటు గర్వంగా ఉందనీ నాగార్జున పేర్కొన్నారు. మనుషులు శాశ్వతం కాదనీ వారు చేసే పనులే శాశ్వతమని,తాను చదువుకోలేక పోయినా...వేలాదిమంది చదువు, వారి బంగారు భవిష్యత్తు కోసం  నాగేశ్వరరావు కళాశాల స్థాపించారనీ ,రైతు బిడ్డ అయిన నాగేశ్వరరావుకు...చదువు అంటే ఎంతో ఇష్టమన్నారు. సినిమాకు రూ. 5వేలు వచ్చే 1951 సంవత్సరాల్లో.... లక్ష రూపాయలు కళాశాలకు విరాళంగా ఇచ్చారనీ, ఏఎన్ఆర్ కళాశాలలో చదివిన విద్యార్థులు నేడు దేశ,విదేశాల్లో, ఎంతో ఉన్నత స్థానాల్లో నిలవడం సంతోషకరమన్నారు. నా తరపున నా కుటుంబ సభ్యుల తరఫున... ప్రతి ఏటా విద్యార్థులకు స్కాలర్షిప్ లను అందిస్తామన్నారు. కళాశాలలో ఏర్పాటు చేయబోయే స్కిల్ డెవలప్మెంట్ అభివృద్ధికి... రేపు వేడుకల్లో పాల్గొనే మంత్రి లోకేష్ సహకరించేలా ఎమ్మెల్యే రాము కృషి చేయాలని నాగార్జున కోరారు. గుడివాడలో నాపై చూపుతున్న ప్రేమాభిమానాలకు.. చేతులెత్తి నమస్కరిస్తున్నట్లు నాగార్జున చెప్పారు. నన్ను కింగ్, మన్మధుడు, మాస్ అని రకరకాల పేర్లతో పిలుస్తారని... నేను అక్కినేని నాగేశ్వరావు  అబ్బాయి నాగార్జున అంటేనే ఇష్టమన్నారు. నాగార్జున మాట్లాడుతున్నంతసేపు  అభిమానులు..విద్యార్థులు కేరింతలు కొట్టారు. హైకోర్టు జస్టిస్ బట్టు దేవానంద్ మాట్లాడుతూ...మహోన్నత ఆలోచనతో ఏర్పడిన ఏఎన్ఆర్ కలశాల ఎందరికో మంచి భవిష్యత్తు అందించడమే కాక, దేశానికి గొప్ప పౌరులను ఇచ్చిందన్నారు. ఈ కళాశాలలో చదివే నేను... హైకోర్టు జస్టిస్ స్థాయికి ఎదిగాననీ పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ... నేడు నాగార్జున రావడంతో గుడివాడలో ఎప్పుడూ లేనంత సందడి నెలకొందన్నారు. నేను కళాశాల చదివే రోజుల్లో నాగార్జునకు  ఫ్యాన్స్ క్రేజీ చెప్పలేనంత ఉందన్నారు.  ప్రపంచం గర్వించదగ్గ నటుడుగా ఎదిగిన అక్కినేని మన గుడివాడ వాసి కావడం మనందరికీ గర్వకారణం అన్నారు. గుడివాడ ప్రజలందరూ చదువుకోవాలని ఎంతో గొప్ప ఆశయంతో కళాశాల స్థాపించారనీ కొనియాడారు. చదువు అంటే ఎంతో ఇష్టపడే అక్కినేని... అనేక యూనివర్సిటీలకు చెప్పలేనన్నీ గుప్త దానాలు చేశారన్నారు. ఆయన చేసిన సేవలను చూస్తుంటే, చదువు అంటే అక్కినేనికు ఎంత మమకారమో అర్థం అవుతుందన్నారు.  కళాశాలకు డబ్బు మాత్రమే కాకుండా ఆయన పేరు కూడా అందించారన్నారు. అంతటి మహనీయుడు కుటుంబ సభ్యులతో కలిసి వేదికను పంచుకోవడం ఆనందదాయకం అన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా గుడివాడ అంటే ఎన్టీఆర్ ఏఎన్నార్ పుట్టిన గడ్డ అని గర్వంగా చెప్పుకుంటామన్నారు. వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు గుడివాడ వచ్చిన నాగార్జునకు ఎమ్మెల్యే రాము ధన్యవాదాలు చెప్పారు. నాడు ఏఎన్ఆర్ ఇచ్చిన లక్ష రూపాయలు ఏ విధంగా సద్వినియోగం అయ్యాయో... నేడు విద్యార్థుల భవిష్యత్తు కోసం నాగార్జున ఇచ్చిన రెండు కోట్లను అదేవిధంగా సద్వినియోగం చేస్తామని సభా వేదికగా పేర్కొన్నారు.  నాగార్జున వస్తున్నారని తెలిసి నేను 18 కిలోలు తగ్గిన... ఆయన ముందు ఏమాత్రం అనడం లేదని ఎమ్మెల్యే రాము అన్న మాటలకు సభా అంత నవ్వుకున్నారు.మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రచించిన ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ పుస్తకాన్ని  అక్కినేని నాగార్జున, ఎమ్మెల్యే రాము ఇతర ప్రముఖులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, అక్కినేని కుమార్తె సుశీల, ఏఎన్ఆర్ కళాశాల కమిటీ పెద్దలు, వేడుకల నిర్వహణ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.  

డీలిమిటేషన్‌పై అభ్యంతరాల గడువు పెంపు

  జీహెచ్‌ఎంసీ డీలిమిటేషన్‌పై అభ్యంతరల గడువు  మరో రెండు రోజులు (డిసెంబర్ 19 వరకు) పొడిగిస్తూ కోర్టు ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ప్రాథమిక నోటిఫీకేషన్‌పై దాఖలైన పిటిషన్లపై వాదనలు ముగిశాయి. వార్డుల వారీగా జనాభా సంఖ్యతో పాటు మ్యాప్‌లను 24 గంటల్లోపు పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని జీహెచ్‌ఎంసీకి కోర్టు ఆదేశించింది.  పిటిషనర్ పునర్విభజనపై సమాచారం అందించలేదని జనాభ, సరిహద్దులను పరిగణలోకి తీసుకోలేదని పేర్కొన్నారు.సెన్సస్ కమిషనర్ ఇచ్చిన డిసెంబర్ 31 డెడ్‌లైన్ గురించి అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. గ్రేటర్ పరిధిని విస్తరించి 150 నుంచి 300 వార్డులకు పెంచుతూ డిసెంబర్ 9న ప్రాథమిక నోటిఫికేషన్ జారీ అయింది.దీనిపై వెల్లువలా అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి  

మహిళా క్రికెటర్ శ్రీచరణికి భారీ నగదు ప్రోత్సాహకం

  ఉమెన్ వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన యువ క్రికెటర్ శ్రీ చరణికి కూటమి ప్రభుత్వం రూ. 2.5 కోట్ల నగదు ప్రోత్సాహకాన్ని అందించింది. ఇవాళ‌ ఉండవల్లిలోని తన నివాసంలో  మంత్రి నారా లోకేశ్ స్వయంగా ఆమెకు ఈ చెక్కును అందజేశారు. ఈ నగదు బహుమతితో పాటు విశాఖలో 500 గజాల నివాస స్థలాన్ని కూడా ప్రభుత్వం కేటాయించింది. ఆమె డిగ్రీ పూర్తి చేసిన తర్వాత గ్రూప్-1 స్థాయి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చింది.  ఈ మేరకు ఇప్పటికే అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొని శ్రీచరణిని అభినందించారు. క్రీడల్లో మహిళలు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ, ప్రభుత్వం ఎల్లప్పుడూ క్రీడాకారులకు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాప్ చైర్మన్ రవినాయుడు, ఎండి భరణి, స్పెషల్ సిఎస్ అజయ్ జైన్ పాల్గొన్నారు.

ఢిల్లీలో పొల్యూషన్ సర్టిఫికెట్ ఉంటే వాహనాలకు ఆయిల్

  దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం రోజు రోజుకు పెరుగుతూపోతోంది. జనం శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో అల్లాడిపోతున్నారు. తాజాగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400గా రికార్డు అయింది. దీంతో ‘ది ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ’ గాలి కాలుష్యాన్ని తగ్గించటం కోసం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే ఢిల్లీ వ్యాప్తంగా బొగ్గు, వంట చెరుకుతో తయారు చేసే తందూరీ రోటీలపై బ్యాన్ విధించింది. డీపీసీసీ నిర్ణయం ప్రకారం సిటీలోని హోటల్స్, రెస్టారెంట్లు, తిను బండారాలు అమ్మే షాపులు తందూరీ రోటీలను తయారీ కోసం గ్యాస్ లేదా కరెంట్‌ను మాత్రమే వాడుకోవాలి. కాలుష్య నివారణలో భాగంగా వాహనాలపై కూడా ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ ఉన్న వాహనాలకు మాత్రమే ఇంధనాన్ని అమ్మనుంది. ఈ మేరకు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా కీలక ప్రకటన చేశారు. పీయూసీ సర్టిఫికేట్ లేని వాహనాలకు ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లోని పెట్రోల్ స్టేషన్‌లలో పెట్రోల్ కానీ, డీజిల్ కానీ అమ్మరని తేల్చి చెప్పారు. జీఆర్ఏపీ 3, 4 సందర్బంగా ఢిల్లీ బయట రిజిస్టర్ అయిన బీఎస్ 4 కంటే తక్కువ స్టాండర్డ్ కలిగిన వాహనాలు ఢిల్లీలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ .. ఆన్ గ్రౌండ్ చెక్స్ ద్వారా వాహనాలకు సంబంధించిన పీయూసీసీ స్టాటస్, ఎమిషన్ క్యాటగిరీ చెక్ చేస్తాం. పీయూసీసీ సర్టిఫికేట్ లేని వారు.. బీఎస్ 4 కంటే తక్కువ స్టాండర్డ్ వాహనాలను వాడుతున్న వారు పెట్రోల్ బంకుల దగ్గర, సరిహద్దు అధికారులతో గొడవలకు దిగవద్దు. గురువారం నుంచి కొత్త రూల్ అమల్లో ఉంటుంది. గత నవంబర్ నెలలో ఏక్యూఐ 20 పాయింట్లు తగ్గింది. గాలి కాలుష్యాన్ని తగ్గించటం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది’ అని అన్నారు. 9 నుంచి 10 నెలల్లో గాలి కాలుష్యాన్ని పూర్తిగా తగ్గించటం ఏ ప్రభుత్వానికైనా అసాధ్యమైన పని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కారణంగానే కాలుష్యమనే రోగం ఢిల్లీకి వచ్చిందని చెప్పారు. ఢిల్లీలోని గాలి కాలుష్యం గురించి ప్రజలకు క్షమాపణ చెప్పారు.

బోండీ బీచ్‌ మృతులు అసీస్, ఇంగ్లాండ్ క్రికెటర్ల సంతాపం

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ప్రముఖ పర్యాటక ప్రదేశమైన బోండీ బీచ్‌లోరెండు రోజుల క్రితం యూదుల హనుక్కా వేడుక లక్ష్యంగా ఇద్దరు దుండగలు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడి.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారికి సంతాపం తెలుపుతూ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ క్రికెటర్లు  చేతికి నల్ల బ్యాండ్లు ధరించారు. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ మధ్య మూడో టెస్టు బుధవారం (డిసెంబర్ 17) ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఇరుజట్ల ప్లేయర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆటలో పాల్గొన్నారు.  అలాగే స్టేడియంలోని ఇరు దేశాల జెండాలను సగం ఎత్తులోనే ఎగురవేశారు. సిడ్నీలో జరిగిన కాల్పుల ఘటన నేపథ్యంలో.. మూడో టెస్టు జరిగే ఆడిలైడ్ మైదానం లోపల, వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు. బోండీ బీచ్ దుర్ఘటనపై ఇరు జట్ల ప్లేయర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటనా స్థలానికి సమీపంలో నివసించే ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్.. జరిగిన దుర్ఘటన తనను భయాందోళనకు గురి చేసిందన్నాడు. బోండీ బీచ్‌ తన ఇంటికి చాలా దగ్గర్లోనే ఉంటుందని, తరచూ తన పిల్లలను అక్కడికి తీసుకువెళుతుంటానని కమిన్స్ తెలిపాడు. క్రికెట్ ప్రపంచంలోని ప్రతిఒక్కరూ బోండీ బీచ్ బాధితులకు, వారి కుటుంబాలకు, స్నేహితులకు, యూదులకు మద్దతుగా ఉన్నారని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ టాడ్ గ్రీన్‌బర్గ్ అన్నారు. ఇంగ్లాండ్‌ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడుతూ.. ఇది ఆస్ట్రేలియా, సిడ్నీ నగరంతో పాటు యూవత్తు ప్రపంచానికి కూడా చాలా విచారకరం అని అన్నాడు.  

హైదరాబాద్‌ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

  శీతాకాలం విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. హకీంపేటలోని ఎయిర్‌ఫోర్స్‌ శిక్షణ కేంద్రానికి ప్రత్యేక విమానం ద్వారా చేరుకున్న రాష్ట్రపతికి తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క తదితరులు స్వాగతం పలికారు. డిసెంబర్ 17 నుంచి 22 వరకు మొత్తం 5 రోజులు పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు.  18న రాష్ట్రపతి నిలయంలో విశ్రాంతి తీసుకుంటారు. 19న రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలకు హాజరవుతారు. 20న గచ్చిబౌలిలో బ్రహ్మకుమారీస్‌ శాంతిసరోవర్‌ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పాల్గొంటారు. 21న నిలయంలో నిర్వహించే పౌరుల భేటీ, ఎట్‌ హోమ్‌లో పాల్గొంటారు. 22న సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి  రాష్ట్రపతి ముర్ము వెళ్లనున్నారు

నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి రాజీనామా

నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి పై అవిశ్వాస తీర్మానం పెట్టి గద్దె దించి, ఆ స్థానంలో డిప్యూటీ మేయర్ రూఫ్ కుమార్ యాదవ్ ను మేయర్ చేయాలన్న  అధికార పార్టీ పెద్దల కోరిక నెరవేరింది. అయితే అవిశ్వాస తీర్మానం ద్వారా మేయర్ ను గద్దె దించాలన్న ఆకాంక్ష మాత్రం నెరవేరలేదు. ఎందుకంటే.. గురువారం (డిసెంబర్ 18) మేయర్ పై అవిశ్వాస   తీర్మానం పెట్టేందుకు  వ్యూహాలు రచించి, క్యాంపు రాజకీయాలు చేపట్టిన అధికార పార్టీ నేతలకు మేయర్ స్రవంతి తన రాజీనామా ద్వారా షాక్ ఇచ్చారు.  అవిశ్వాస తీర్మానానికి ముందే తన పదవికి రాజీనామా చేసిన మేయర్  తన రాజీనామా లేఖనం జిల్లా కలెక్టర్ కు వాట్సప్ ద్వారా పంపారు.  దీంతో మేయర్ పై అవిశ్వాస తీర్మానం అటకెక్కింది.   ఇలా ఉంటే.. గంట గంటకు మారుతున్న నెల్లూరు కార్పొరేషన్ రాజకీయం    మేయర్ స్రవంతి పై గురువారం (డిసెంబర్ 18) అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైన నేపథ్యంలో కార్పొరేటర్లు పార్టీలు మారుతూ రాజకీయాన్ని రసవత్తరంగా మార్చారు. అధికార పార్టీకి మద్దతుగా ఉన్న కార్పొరేటర్లలో ఐదుగురిని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాజీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేర్చారు. దీంతో అప్రమత్తమైన తెలుగుదేశం   వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ.. వైసీపీకి ఉన్న కార్పొరేటర్ లను ఒక్కొక్కరిని పార్టీలోకి చేర్చుకోవడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో సిటీ నియోజకవర్గంలో మైనార్టీ కార్పొరేటర్ కరిముల్లా మంత్రి నారాయణ సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. అది జరిగిన మూడు గంటల్లోనే.. వైసీపీ నగర అధ్యక్షుడు, 37వ డివిజన్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ ఆ పార్టీకి షాక్ ఇచ్చి.. సైకిల్ ఎక్కారు.   దీంతో 54 స్థానాలు కలిగిన నెల్లూరు కార్పొరేషన్ లో.. 41 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నారు. అవిశ్వాసం నెగ్గి మెజారిటీ టిడిపికి ఉండగా.. వైసీపీకి 11 మంది సభ్యులు ఉన్నట్లు ఆ పార్టీ చెబుతోంది. అధికార పార్టీకి మద్దతుగా ఉన్న కార్పొరేటర్లను కాపాడుకునేందుకు క్యాంపు రాజకీయాలకు మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. శ్రీకాళహస్తి తో పాటు తిరుమల, గోవా పాండిచ్చేరి వంటి ప్రాంతాలలో క్యాంపులు ఏర్పాటు చేశారు. వైసీపీలో ఉన్న 11 మందీ కూడా  తెలుగుదేశంకే మద్దతు ఇస్తున్నారు, ఇస్తారు అంటూ అధికార పార్టీ ప్రచారం చేసుకుంటున్న వేళ నెల్లూరు నగర మేయర్ స్రవంతి తన పదవికి రాజీనామా చేశారు.   2021 నవంబర్ 24న మేయర్ గా  ప్రమాణ స్వీకారం చేసిన స్రవంతి.. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తప్పడుగులు వేశారనే చర్చ పొలిటికల్ సర్కిల్లో జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీకి  రాజీనామా చేసి.. తెలుగుదేశం గూటికి చేరేందుకు మేయర్ స్రవంతి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.   దీంతో ఆమె రెండు పార్టీలకూ దూరం పాటిస్తూ వచ్చారు.  ఈ క్రమంలో నవంబర్ 24న ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు 40 మంది కార్పొరేటర్లు సంతకాలు చేశారు. 25వ తేదీన వారందరూ జిల్లా కలెక్టర్ ను కలిసి నోటీసు అందజేశారు. అదే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ.. తమ పార్టీకి మేయర్ కి సంబంధం లేదని.. ఆమె ఎప్పుడో వైసీపీకి రాజీనామా చేశారని వెల్లడించారు. దీంతో మేయర్ స్రవంతికి మద్దతు ఇచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఈనెల 18న అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన కౌన్సిల్ మీటింగ్ నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఈ క్రమంలో తమకు పూర్తిగా మద్దతు ఉందని సైలెంట్ గా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఐదుగురు కార్పొరేటర్లు తెలుగుదేశంకి రాజీనామా చేసి వైసీపీలో చేరడం గట్టి షాక్ ఇచ్చింది.  దీనిపై మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. వైసీపీలో ఉండే కార్పొరేటర్లను ఒక్కొక్కరిగా లాగేయడం మొదలుపెట్టారు. దీంతో వైసిపి షాక్ కు గురైంది. సిటీ నియోజకవర్గంలో ఉండే ముగ్గురు కార్పొరేటర్లను లాగేసేందుకు అధికార పార్టీ స్కెచ్ వేసిన సమయంలోనే  తాను మేయర్  పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు స్రవంతి.