ఆనందయ్యకు జగన్ సర్కార్ నోటీస్.. జైలుకు పంపేదాకా వదలరా?
posted on Dec 29, 2021 @ 2:19PM
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం నాటు వైద్యుడు ఆనందయ్య మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఆయనకు నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ నోటీసులు ఇచ్చారు. కరోనా విజృంభణ సమయంలో ఆ వైరస్కు మందు తయారుచేసి పంపిణీ చేశారు ఆనందయ్య. ఇప్పుడు ఒమిక్రాన్కు కూడా ఆయన మందు ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ మందు కోసం వేలాది మంది కృష్ణపట్నం వస్తున్నారు. మరోవైపు మందు పంపిణీ చేయకూడదని కృష్ణపట్నం వాసులు ఆందోళనకు దిగారు. రోగులు ఆ మందు కోసం వస్తే జన సంచారం పెరిగి తమకు కూడా కరోనా అంటుకుంటుందని భయపడుతున్నారు. ఆనందయ్య ఇంటి ఎదుట గ్రామస్థులు ధర్నాకు దిగడంతో కృష్ణపట్నంలో గందరగోళం పరిస్థితులు నెలకొన్నాయి.
కృష్ణపట్నం పంచాయతీ పాలవర్గం కూడా అత్యవసరంగా సమావేశమై ఆనందయ్యకు వ్యతిరేకంగా తీర్మానం చేసింది. మందును పంపిణి చేయరాదని ఆదేశించింది.ఆనందయ్య వ్యవహారంపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఆ ఔషధానికి అనుమతులు లేవని ఆయుష్ శాఖ ప్రకటించింది. తాజాగా ఆనందయ్యకు జిల్లా జాయింట్ కలెక్టర్ గణేశ్ కుమార్ నోటీసులు జారీ చేశారు. ఒమిక్రాన్ కు ఆనందయ్య మందు అని వచ్చిన ప్రకటనపై వివరణ ఇవ్వాలని కోరారు. ఆ మందు పంపిణీ చేసేందుకు ఏయే అనుమతులు తీసుకున్నారో తెలపాలని ఆదేశించారు.ఒకవేళ అనుమతులు లేకుండా మందు పంపిణీ చేస్తున్నట్లయితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంపై వారం రోజుల్లోగా పూర్తి సమాచారంతో వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
మరోవైపు జేసీ నోటీసుపై స్పందించారు నాటు వైద్యుడు ఆనందయ్య. తాను ఒమిక్రాన్ కోసం మందు తయారు చేశానని ఎక్కడా చెప్పలేదని అన్నారు. తన మందు ఏ వ్యాధికైనా రోగనిరోధకతను పెంచుతుందని, ఆ విషయాన్నే చెబుతున్నానని తెలిపారు. తనకు జాయింట్ కలెక్టర్ నుంచి అందిన నోటీసులకు పూర్తి వివరాలతో సమాధానం ఇస్తానని చెప్పారు. ఈ మందును తాను ఉచితంగానే ప్రజలకు ఇస్తున్నానని చెప్పారు. ఈ మందు ఇస్తున్నందుకు తనకు వ్యతిరేకంగా గ్రామ పంచాయతీలో తీర్మానం చేయడం బాధాకరమని ఆనందయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే అధికారుల ఆదేశాలతో తాను ఆ మందు పంపిణీని నిలిపేశానని వెల్లడించారు. విషయంపై ప్రభుత్వమే జోక్యం చేసుకోవాలని ఆనందయ్య విజ్ఞప్తి చేశారు.