జగన్ బెయిల్ పై తారాస్థాయి బెట్టింగులాట

 

జగన్ కి బెయిలొస్తుందా రాదా..? రాష్ట్రంలో ఇప్పుడిదే హాట్ టాపిక్. సామాన్యులకుకూడా దీనిమీదే ఆసక్తి. శుక్రవారం జరగబోయే విచారణలో జగన్ కి బెయిలొస్తుందని కొందరు, రాదని కొందరు పోటీలుపడి పందాలు కట్టుకుంటున్నారు. ఈ బెట్టింగుల స్థాయి కోట్లరూపాయల్లో జరుగుతోందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వరల్డ్ కప్ మ్యాచ్ మీదకూడా ఇంతపెద్దమొత్తంలో బెట్టింగులాట జరగలేదని బెట్టింగుల్లో ఆరితేరినవాళ్లుకూడా నోరెళ్లబెడుతున్నారని సమాచారం. జగన్ కి బెయిల్ మంజూరౌతుందని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి ఆశలతో ఉంది. జగన్ వ్యతిరేకవర్గంమాత్రం ఆరునూరైనా బెయిల్ దొరకనే దొరకదంటూ గట్టిగానే ప్రచారం మొదలుపెట్టేసింది. రెండింటిలో ఏదినిజమవుతుందో తెలియని ఉత్మంఠ పెరిగిపోవడంతో బెట్టింగు రాయుళ్ల పని మూడుపూలు ఆరుకాయలుగా సాగుతోందని వినికిడి. కొందరు కాస్త తెలివితేటల్ని ఉపయోగించి అయినవాళ్లతోనే రెండువైపులా పందేలుపెట్టి నో లాస్ నో ప్రాఫిట్ బేసిస్ కి కూడా సిద్ధపడి బెట్టింగులు కట్టుకుంటున్నారని గోదావరిజిల్లాల్లో ప్రచారం జరుగుతోంది. ఇంట్లో ఇద్దరుంటే చెరోపక్క బెట్టింగ్ భారీగా పెట్టేస్తే రెండిట్లో ఏదోఒకటి కచ్చితంగా నిజమవ్వాలిగనక దెబ్బతినకుండా జాగ్రత్తపడొచ్చని చాలామంది పార్టీలకతీతంగా ప్లాన్ చేస్తున్నారనికూడా వినికిడి.

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.