బాహుబలి రాకెట్ ప్రయోగం సక్సెస్ కావాలి.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ  ఇస్రో మరో చారిత్రక ప్రయోగానికి రెడీ అయిపోయింది. ఎల్వీఎం 3 బాహుబలి రాకెట్ ద్వారా బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని ఈ నెల 24 ప్రయోగించనుంది. ఇది  సెల్యులార్ కవరేజ్ లేని ప్రాంతాలకు సేవలు అందించడమే లక్ష్యంగా చేపట్టిన భారీ మిషన్.  4జీ, 5జీ సిగ్నల్‌ను నేరుగా సాధారణ స్మార్ట్‌ఫోన్‌లకు అందించడానికి ఉద్దేశించిన ప్రయోం.  ఈ నెల 24  ఉదయం 8:54 నిమిషాలకు ఎల్వీఎం 3  శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి అంతరిక్షానికి దూసుకెళ్లనుంది.

ఎల్వీఎం 3 సిరీస్ లో ఇది తొమ్మిదది. ఈ ఏడాది ఇస్రో  చేపట్టిన అయిదో ప్రయోగం ఇది. అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్ అభివృద్ధి చేసిన బ్లూబర్డ్ బ్లాక్ 2, ఉపగ్రహ టెలికమ్యూనికేషన్స్‌లో ఓ వ్యూహాత్మక ప్రయోగంగా భావిస్తున్నారు.   బ్లూబర్డ్ బ్లాక్ శాటిలైట్ బరువు 6,100 కిలోలు. ఈ బాహుబలి రాకెట్ ఎత్తు 43.5 మీటర్లు. 640 టన్నుల బరువు. ఈ ప్రయోగం విజయవంతమైతే   కమ్యూనికేషన్ల ముఖచిత్రం మారిపోతుందంటున్నారు. ఇలా ఉండగా ఈ  బాహుబలి రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని కోరుతూ ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్  తిరుమల శ్రీవారి ఆలయంలో బ్లూబర్డ్  2 ఉపగ్రహానికి పూజలు చేశారు. 

చైనా మాంజా విక్రయించినా...నిల్వ ఉంచినా కఠిన చర్యలు : సీపీ

  సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నగరవ్యాప్తంగా గాలిపటాల పండుగ ఉత్సాహం వెల్లివిరుస్తున్న వేళ, ప్రాణాంతకంగా మారిన నిషేధిత చైనీస్ మాంజాపై హైదరాబాద్ నగర పోలీసులు ఉక్కుపాదం మోపారు. చైనీస్ మాంజా విక్రయాలు, వినియోగం, నిల్వపై ఎలాంటి ఉపేక్ష ఉండదని నగర పోలీసు కమిషనర్  వీసీ సజ్జనార్‌ స్పష్టం చేశారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. పక్షుల ప్రాణాలకు, అమాయక వాహనదారుల భద్రతకు తీవ్ర ముప్పుగా మారుతున్న ప్రమాదకరమైన ఈ మాంజాను పూర్తిగా అరికట్టేందుకు నగర పోలీసు యంత్రాంగం సమాయత్త మైందని సీపీ వెల్లడించారు. గుట్టుచప్పుడు కాకుండా ఈ ప్రమాదకరమైన మాంజాను విక్రయించినా, నిల్వ ఉంచినా చట్టం నుంచి తప్పించుకునే అవకాశం లేదని తేల్చి చెప్పారు. కచైనీస్ మాంజా నియంత్రణపై కఠినంగా వ్యవహరించాలని క్షేత్రస్థాయి పోలీసు అధికారులకు సీపీ సజ్జనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని అన్ని జోన్లలో ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి, టాస్క్‌ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులు సంయుక్తం గా ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కైట్స్ విక్రయ కేంద్రాలు, చిన్న కిరాణా దుకాణాలు, అనుమానిత గోదాములు, గుట్టుగా నిల్వ చేసే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, ఎక్కడైనా చైనీస్ మాంజా లభిస్తే వెంటనే స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేయను న్నట్లు పేర్కొన్నారు.అంతే కాకుండా నగరానికి ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా చైనీస్ మాంజా రవాణా చేస్తున్న ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీలు, పార్శిల్ సర్వీసుల పైనా కూడా నిఘా పెంచి నట్లు సీపీ వెల్లడించారు. ఈ అక్రమ రవాణాలో ఏజెన్సీ యజమానుల ప్రమేయం ఉన్నట్లు తేలితే, వారిపైనా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  చైనీస్ మాంజా కేవలం మానవ ప్రాణాలకు మాత్రమే కాకుండా పర్యావరణానికి కూడా తీవ్ర హాని కలిగిస్తోం దని సీపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మాంజా మట్టిలో కలిసిపోక ఏళ్ల తరబడి అలాగే ఉండిపోతూ భూమిని, పర్యావరణాన్ని కలుషితం చేస్తోందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ చట్టం–1986 ప్రకారం ప్రభుత్వం చైనీస్ మాంజా తయారీ, విక్రయం, నిల్వ, వినియోగంపై పూర్తిస్థాయి నిషేధం విధించిందని గుర్తుచేశారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనర్ విజ్ఞప్తి చేశారు. చైనీస్ మాంజాలో ప్లాస్టిక్, సింథటిక్ పదార్థాలతో పాటు గాజు పెంకులు, మెటాలిక్ పదార్థాల పూత ఉండటం వల్ల తీవ్రమైన ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ద్విచక్ర వాహనదారుల మెడలు తెగిపోవడం, పిల్లల వేళ్లు కోసుకుపోవడం వంటి దుర్ఘటనలు ఇప్పటికే చాలా చోటుచేసుకున్నాయని గుర్తు చేశారు. విద్యుత్ తీగలకు తగిలినప్పుడు మెటాలిక్ మాంజా కారణంగా విద్యుత్ షాక్ కొట్టి పిల్లలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు.  తల్లిదండ్రులు తమ పిల్లలకు సంప్రదాయ నూలు దారా లతో చేసిన మాంజానే ఇచ్చి, సురక్షితంగా గాలిపటాలు ఎగురవేయాలని కోరారు.నగర పౌరులు సామాజిక బాధ్యతతో వ్యవహరించి పోలీసులకు సహకరించాలని సీపీ పిలుపునిచ్చారు. తమ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా నిషేధిత చైనీస్ మాంజాను గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్నా, నిల్వ ఉంచినా వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని, లేదా హైదరాబాద్ పోలీస్ వాట్సాప్ నెంబర్ +91 94906 16555కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచు తామని సీపీ స్పష్టం చేశారు.  

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్‌ ఇంటిపై కాల్పులు

  అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీవాన్స్‌ ఇంటిపై కాల్పుల కలకలం రేపుతున్నాయి. ఒహియో రాష్ట్రం సిన్సినాటిలోని  జేడీ వాన్స్‌ నివాసంపై అగంతకుడు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జేడీ వాన్స్‌ ఇంటి అద్దాలు ధ్వంసమయ్యాయి. కాల్పులతో అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. అయితే ఈ కాల్పులు జరిగిన సమయంలో జేడీవాన్స్‌ దంపతులు ఇంట్లో లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.  సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్, పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. జేడీవాన్స్‌ సెలవుల అనంతరం ఆదివారమే ఆయన వాషింగ్టన్ డీసీకి బయలుదేరి వెళ్లినట్లు తెలిసింది. అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించే ప్రయత్నం చేయలేదని ప్రాథమికంగా భావిస్తున్నారు. అతడు ఉపాధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకుని ఈ చర్యకు పాల్పడ్డాడా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై వైట్ హౌస్ లేదా సీక్రెట్ సర్వీస్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు  

జనవరిలో వరుసగా 4 రోజులు బ్యాంకుల బంద్.. ఎందుకంటే?

బ్యాంకు ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించారు. ఈ నెల 27న దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. వారానికి ఐదు రోజుల పని విధానం, వేతన సవరణ తదితర అంశాలపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని అఖిల భారత బ్యాంకు అధికారుల కాన్ఫెడరేషన్ (ఐఐబీఓఎస్) సమ్మెకు పిలుపు నిచ్చింది. ఈ సమ్మె కారణంగా జనవరి నెలలో బ్యాంకులు వరుసగా నాలుగు రోజులు మూతపడనున్నాయి. అదెలాగంటే.. జనవరి 24  నాలుగవ శనివారం,  , 25 ఆదివారం రావడం ఆ మరుసటి రోజు సోమవారం గణతంత్ర దినోత్సవం కావడంతో వరుసగా మూడు రోజలూ బ్యాంకులకుసెలవు. ఇక 27 మంగళవారం   సమ్మె కారణంగా బ్యాంకులు పని చేయవు. దీంతో బ్యాంకు సేవలు వరుసగా నాలుగు రోజులు అందుబాటులో ఉండవు.   

ఓఎన్‌జీసీ గ్యాస్ లీక్....500 కొబ్బరి చెట్లు దగ్ధం

  అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఓఎన్‌జీసీ డ్రిల్ సైట్‌లో మంటలు ఇంక అదుపులోకి రాలేదు. సమీపంలోని కొబ్బరి తోటలను మంటలు అంటుకుని...500 కొబ్బరి చేట్లు కాలిపోయినట్లు అంచన వేస్తున్నారు. ఇప్పటికే అధికారులు గ్రామాన్ని ఖాళీ చేయించారు. చుట్టుపక్కల 5 కి.మీల పరిధిలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతలకు తరలిస్తున్నారు. ఓఎన్‌జీసీ ఉన్నతాధికారులు, సాంకేతిక బృందాలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీగా గ్యాస్ బయటకు వచ్చి గ్రామంలోకి వ్యాపించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.  ప్రస్తుతం గ్యాస్ లీకేజ్ ఆపరేషన్ కొనసాగుతుంది. చుట్టుపక్కల 5 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఓఎన్జీసీ ఉన్నతాధికారులు, సాంకేతిక బృందాలు రాజమండ్రి నుంచి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించారు. మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.  ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చూడాలని, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారు. మంటలను త్వరితగతిన అదుపు చేసేందుకు ఓఎన్జీసీతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఘటనపై ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని కోరారు. కాగా, ఉత్పత్తిని పెంచే పనుల్లో భాగంగానే ఈ లీకేజీ జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. గ్యాస్‌ లీక్ ఘటనలో మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారని  జిల్లా కలెక్టర్ మహేశ్‌ కుమార్‌ తెలిపారు. మలికిపురం ఘటనపై కలెక్టర్ వివరాలను తెలిపారు. మంటలు అదుపులోకి వస్తాయో లేదో తెలియాలంటే 24 గంటలు ఆగాలన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని కలెక్టర్ పేర్కొన్నారు

నాలెడ్జ్ బేస్డ్ సొసైటీ నిర్మాణంలో యూనివర్సిటీలదే కీలక పాత్ర : లోకేష్

  నాలెడ్జ్ బేస్డ్ సొసైటీని నిర్మించడంలో విశ్వవిద్యాలయాలదే కీలక పాత్ర అని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పబ్లిక్ యూనివర్సిటీల వైస్ చాన్సలర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… వైస్ చాన్సలర్లు కేవలం పరిపాలనాధిపతులు కాకుండా విద్యారంగ సంస్కరణలకు అంబాసిడర్లుగా వ్యవహరించాలని సూచించారు. పుట్టినరోజు రోజున కూడా సమావేశానికి హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్ అంకితభావం అందరికీ స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. పాదయాత్రలో యువత ఆశలు చూశాను తన సుదీర్ఘ పాదయాత్రలో ఆంధ్రప్రదేశ్ యువతను ప్రత్యక్షంగా కలిశానని, ఉన్నత విద్య పూర్తిచేసినా ఉద్యోగ భవిష్యత్‌పై గందరగోళంలో ఉన్నారని లోకేష్ తెలిపారు. యువత ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలనే సంకల్పంతోనే సవాళ్లతో కూడిన విద్యాశాఖను స్వీకరించానన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజకీయ నాయకుడు హెచ్ఆర్‌డీ శాఖ చేపట్టడం ఇదే తొలిసారి అని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ఐదు కీలక సవాళ్లు పబ్లిక్ యూనివర్సిటీల బలోపేతానికి ఐదు ప్రధాన అంశాలపై దృష్టి పెట్టాలని వీసీలను లోకేష్ కోరారు. బోధన–అవసరాల మధ్య వ్యత్యాసం, కాలానుగుణంగా సిలబస్ మార్పులు, ఉద్యోగావకాశాలు లేని డిగ్రీలు, పరిశ్రమలతో బలహీన అనుసంధానం, ప్రయోజనం లేని పరిశోధనలు, ఆవిష్కరణల లోపం, పరిపాలనపై అధిక సమయం, అకడమిక్ ప్రమాణాలపై తక్కువ దృష్టి, విద్యార్థుల అనుభవంలో సమానత్వం, మానసిక మద్దతు లోపం స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ ఉదాహరణగా తీసుకుని, ప్రపంచ స్థాయిలో పోటీ పడాలంటే పాఠ్యాంశాలను తరచుగా పూర్తిస్థాయిలో నవీకరించాల్సిన అవసరం ఉందని లోకేష్ తెలిపారు. విద్య–ఉపాధి మధ్య వారధిగా యూనివర్సిటీలు డిగ్రీలు ఉపాధిని, ఆత్మగౌరవాన్ని తీసుకురావాలని స్పష్టం చేసిన లోకేష్… పట్టభద్రులు అమీర్‌పేటలో నాలుగు నెలల శిక్షణ తీసుకుని ఉద్యోగాలు పొందుతున్న పరిస్థితి మన సంస్థల వైఫల్యమేనన్నారు. ఇంటర్న్‌షిప్‌లు, అప్రెంటిస్‌షిప్‌లు, పరిశ్రమ ఆధారిత కోర్సులు కీలకమని తెలిపారు. పరిశోధన సమస్యల పరిష్కారానికి ఉపయోగపడాలి పరిశోధన అనేది కేవలం జర్నల్స్‌కే పరిమితం కాకుండా నీటి కొరత, వాతావరణ మార్పులు, వ్యవసాయం, ప్రజారోగ్యం వంటి సమస్యలకు పరిష్కారాలు అందించే దిశగా సాగాలన్నారు. స్టార్ట్‌అప్స్, పేటెంట్లు, టెక్నాలజీ బదిలీలు యూనివర్సిటీల బలాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడండి వైస్ చాన్సలర్లు ప్రతి వారం కొద్ది గంటలైనా విద్యార్థులతో నేరుగా మాట్లాడే “ఓపెన్ హౌస్” కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. విద్యార్థుల అనుభవాలను పట్టించుకోని విశ్వవిద్యాలయాలు ఎంత ప్రతిష్టాత్మకమైనవైనా సమయానుకూలత కోల్పోతాయని హెచ్చరించారు. ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలే లక్ష్యం ప్రపంచ స్థాయి పబ్లిక్ విశ్వవిద్యాలయాలే రాష్ట్ర లక్ష్యమని, ఈ దిశగా పూర్తి స్వతంత్రత, ప్రతిభకు గౌరవం ఇస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఈ సమావేశం నుంచి విద్యారంగంలో సరికొత్త ప్రయాణం ప్రారంభం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మానవ వనరుల శాఖ కార్యదర్శి కోన శశిధర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ కె. మధుమూర్తి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ పాల్గొన్నారు.

బంగ్లాదేశ్ లో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం

బంగ్లాదేశ్, ఇండియా మధ్య సంబంధాలు సంక్షోభంలో పడ్డాయి. బంగ్లాదేశ్ లో భారత్ వ్యతిరేక ఆందోళనల ప్రభావం ఇరు దేశాల మధ్యా దౌత్య సంబంధాలనే కాకుండా అన్ని రంగాలపైనా కూడా ప్రభావం చూపుతున్నాయి. తాజాగా ఈ ప్రభావం ఇరు దేశాల మధ్యా క్రికెట్ సంబంధాలపై కూడా పడింది.  బంగ్లాదేశ్ స్టార్ పేస్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను ఐపీఎల్ ఫ్రాంచైజీ జట్టు  కోల్‌కతా నైట్ రైడర్స్ భారీ మొత్తానికి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే బంగ్లాదేశ్ లో భారత వ్యతిరేక ఆల్లర్ల కారణంగా అతడిని జట్టు నుంచి తప్పించాలని బీసీసీఐ కేకేఆర్ ను ఆదేశించింది. ఈ నిర్ణయానికి ప్రతిగా బంగ్లాదేశ్ తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం విధించింది.  ఇటీవల బంగ్లాదేశ్ లో హిందువులపై హింసాకాండ, హిందూ వ్యతిరేకత బాగా పెచ్చరిల్లిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించాయి. బంగ్లాలో పెచ్చరిల్లుతున్న భారత వ్యతిరేకత కారణంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)  ముస్తాఫిజూర్ ను ఐపీఎల్ నుంచి తొల‌గించాల‌ని నిర్ణయించింది. వచ్చే ఐపీఎల్ సీజన్ కు ముస్తాఫిజుర్ ను కేకేఆర్ జట్టు కొనుగోలు చేసింది. ఆ జట్టులో ముస్తాఫిజుర్ కీలక ఆటగాడిగా రాణిస్తాడని ఆ జట్టు భావించింది. అయితే భారత్, బంగ్లాదేశ్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అతడిని ఐపీఎల్ నుంచి తొలగించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దనిపై స్పందించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం అకారణంగా బీసీసీఐ తీసుకున్న నిర్ణయం తమను బాధించిందని పేర్కొన్న బంగ్లాదేశ్ ప్రభుత్వం.. అందుకు ప్రతిగా ఐపీఎల్ ప్రసారాలను తమ దేశంలో నిషేధించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించింది.   

త్వరలో మావోయిస్టు రహితంగా తెలంగాణ : డీజీపీ

  తెలంగాణ రాష్ట్రం అతి త్వరలోనే మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారబోతోందని తెలంగాణ పోలీసులు స్పష్టంగా ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణకు చెందిన మావోయిస్టులు కేవలం 17 మంది మాత్రమే మిగిలి ఉన్నట్లు పోలీసుల అంచనా. ఈ 17 మందిలో ఎవరు ఏ స్థాయి కమిటీల్లో ఉన్నారనే పూర్తి వివరాలతో కూడిన జాబితా పోలీసుల చేతిలో ఉందని వెల్లడించారు. ఈ 17 మంది లొంగిపోతే తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు ఉద్యమానికి పూర్తిగా తెరపడుతుందని, అప్పుడే రాష్ట్రం మావోయిస్టు రహితంగా మారుతుందని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మిగిలిన మావోయిస్టు నేతలు ఆయుధాలు విడిచి, లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం, ప్రస్తుతం మిగిలి ఉన్న 17 మంది మావోయిస్టుల్లో 4 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు,5 మంది స్టేట్ కమిటీ సభ్యులు,6 మంది డివిజన్ కమిటీ సభ్యులు, ఒకరు అండర్ గ్రౌండ్ కార్యకర్తగా ఉన్నారు. ఈ జాబితాలో 5 మంది మహిళా మావోయిస్టులు ఉండటం గమనార్హం. వీరిలో కొందరు ప్రస్తుతం సెంట్రల్ కమిటీలో ఉండగా, మరికొందరు స్టేట్, డివిజన్ కమిటీల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.ఈ 17 మంది తెలంగాణ మావోయిస్టు అగ్ర నేతలపై పోలీసులు మొత్తం రూ.2 కోట్ల 25 లక్షల రివార్డు ప్రకటించారు. వీరి కదలికలపై నిఘా మరింత పెంచినట్లు, అవసరమైతే ఆపరేషన్ కగార్ పరిధిలో చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. లొంగిపోవాలని పోలీసుల పిలుపు ఆపరేషన్ కగార్ పూర్తయ్యేలోపే తెలంగాణను మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పోలీసులు ముందుకెళ్తున్నారు. మిగిలిన 17 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోతే వారికి ప్రభుత్వ విధానాల ప్రకారం పునరావాస అవకాశాలు కల్పిస్తామని కూడా అధికారులు చెబుతున్నారు. మొత్తానికి, రాష్ట్రంలో మావోయిస్టు ఉద్యమానికి ముగింపు దశ సమీపిస్తోందని, తెలంగాణ త్వరలోనే పూర్తిస్థాయిలో శాంతియుత రాష్ట్రంగా మారబోతోందని పోలీసు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సెంట్రల్ కమిటీ సభ్యులు ముప్పాల లక్ష్మణ్ రావ్ @ గణపతి తిప్పిరి తిరుపతి @ దేవ్ జి మల్లారాజి రెడ్డి @ సంగ్రామ్ పసునూరి నరహరి @ సంతోష్ స్టేట్ కమిటీ సభ్యులు ముప్పిడి సాంబయ్య @ సుదర్శన్ వార్త శేఖర్ @ మంగుత్ జోడే రత్నా భాయ్ నక్కా సుశీల లోకేటి చంద్ర శేఖర్ దామోదర్ డివిజన్ కమిటీ సభ్యులు రాజేశ్వరి రంగబోయిన భాగ్య బాడిషా ఉంగా సంగీత భవాణి మైసయ్య భగత్ సింగ్

నిఖిత హత్య కేసులో సంచలన విషయాలు

  అమెరికాలో తెలుగు యువతి నిఖిత హత్య కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మేరీల్యాండ్ రాష్ట్రంలోని ఎలికాట్ సిటీలో జరిగిన ఈ హత్య వెనుక డాలర్ల అప్పు లావాదేవీలు ఉన్నట్టు తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిఖితను హత్య చేసిన వ్యక్తి ఆమె స్నేహితుడు అర్జున్ శర్మేనని హోవార్డ్ కౌంటీ పోలీసులు అధికారికంగా నిర్ధారించారు. అర్జున్ శర్మ నిఖిత వద్ద 4,500 డాలర్లు అప్పుగా తీసుకున్నట్టు గుర్తించారు. ఈ విషయాన్ని నిఖిత కజిన్ సరస్వతి సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టులో వెల్లడించారు. అప్పు తీసుకున్న అర్జున్ శర్మ అందులో 3,500 డాలర్లు మాత్రమే తిరిగి ఇచ్చి, మిగిలిన 1,000 డాలర్లు ఇవ్వకుండా ఆలస్యం చేశాడని తెలుస్తోంది. ఈ విషయమై నిఖిత అతడిని పదే పదే డబ్బులు ఇవ్వాలని అడిగినట్టు సమాచారం. పోలీసుల విచారణలో మరో షాకింగ్ అంశం బయట పడింది. నిఖిత ఖాతా నుంచి 3,500 డాలర్లు అక్రమంగా ట్రాన్స్‌ఫర్ చేసుకున్న అర్జున్ శర్మ, ఆ తర్వాత ఆమెను హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. డబ్బుల విషయంలో తలెత్తిన వివాదమే ఈ దారుణానికి దారి తీసిందని ప్రాథమికంగా తేలింది.డిసెంబర్ 31న డబ్బులు ఇస్తానని చెప్పి నిఖితను తన అపార్ట్‌ మెంట్‌కు పిలిపించిన అర్జున్ శర్మ, అక్కడే ఆమెను హత్య చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. హత్య చేసిన వెంటనే అర్జున్ శర్మ అమెరికా నుంచి పారిపోయి భారత్‌కు వచ్చినట్టు గుర్తించారు.ఈ ఘటనపై నిఖిత తండ్రి ఆనంద్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “అర్జున్ శర్మ మా అమ్మాయి స్నేహితుడు మాత్రమే. మాజీ ప్రియుడు అని మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని నిఖిత తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఇస్తానని పిలిపించి మా కూతురిని అతని అపార్ట్‌మెంట్‌లో హత్య చేశాడు. ఏ తండ్రికీ ఇలాంటి పరిస్థితి రాకూడదు,” అని ఆయన కన్నీళ్లతో చెప్పారు.డిసెంబర్ 31న నిఖిత తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి న్యూ ఇయర్ విషెస్ తెలిపిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో స్నేహితులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో హోవార్డ్ కౌంటీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. జనవరి 2న నిఖిత ఆచూకీని గుర్తించినట్టు హోవార్డ్ కౌంటీ పోలీసులు తెలిపారు. అర్జున్ శర్మ కొలంబియా ప్రాంతం లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నట్టు విచారణలో తేలింది.హత్య అనంతరం భారత్‌కు పారిపోయిన అర్జున్ శర్మను తమిళనాడులో అదుపులోకి తీసుకు న్నట్టు సమాచారం. ఈ కేసులో అమెరికా, భారత అధికారుల మధ్య సమన్వయంతో చర్యలు కొనసాగుతున్నాయి. నిఖిత హత్య జరిగిన విషయాన్ని భారత రాయబారి కార్యాలయం కుటుంబ సభ్యులకు అధికారికంగా తెలియ జేసింది. నిఖిత మృతదేహాన్ని త్వరితగతిన హైదరాబాద్‌కు తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని తండ్రి ఆనంద్ విజ్ఞప్తి చేశారు. నిఖిత హత్యకు పాల్పడిన అర్జున్ శర్మకు అమెరికా ప్రభుత్వం కఠినమైన శిక్ష విధించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన ప్రవాస భారతీయులను తీవ్రంగా కలచివేసింది.

మండలిలో కవిత కన్నీళ్లు...అవినీతిని ప్రశ్నించినందున సస్పెండ్

  తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శాసన మండలిలో భావోద్వేగానికి గురయ్యారు. బీఆర్ఎస్ పార్టీలో తనకు ఏ బాధ్యత అప్పగించినా అంకితభావంతో, చిత్తశుద్ధితో నిర్వర్తించానని పేర్కొన్నారు. అయితే పార్టీ, ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ప్రశ్నించినందుకే తనను దారుణంగా అవమానించి బయటకు పంపారని కవిత మండలిలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… “2004లో అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి భారత్‌కు వచ్చాను. 2006లో తెలంగాణ ఉద్యమంలోకి అడుగుపెట్టాను. 2013–14లో తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పే కీలక ఘట్టాలు చోటుచేసుకున్నాయి. తెలంగాణపై తుది నిర్ణయం తీసుకుంటారని పిలుపు రావడంతో 2013లో కుటుంబ సమేతంగా ఢిల్లీకి వెళ్లాం. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత రెండు నెలలు గడిచినా కాంగ్రెస్ పెద్ద నాయకుల్లో ఎవరూ మమ్మల్ని పలకరించలేదు. అటువంటి సమయంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి సన్నిహితుడైన ఆస్కార్ ఫెర్నాండెజ్‌తో ఉన్న పరిచయం వల్ల కేసీఆర్‌కు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయగలిగాను. ఆ తర్వాత సోనియా గాంధీ ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ కావడంతో తెలంగాణ సాధన ముందుకు సాగింది” అని కవిత తెలిపారు. 2014లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించామని, ఆ తర్వాత నుంచే తనపై ఆంక్షలు మొదలయ్యాయని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నించారు. పార్టీలో అవినీతిని ప్రశ్నించినందుకే తనపై కక్షగట్టారని ఆరోపించారు. ఈడీ, సీబీఐ కేసుల్లో తాను పోరాడుతున్న సమయంలో పార్టీ తనకు అండగా నిలవలేదని, కేసీఆర్‌పై కక్షతో బీజేపీ తనను జైలుకు పంపించినా పార్టీ ఆదుకోలేదని కవిత విమర్శించారు. “అమరవీరుల స్తూపం నుంచి కలెక్టరేట్ల వరకు అన్నిచోట్లా అవినీతి జరిగింది. సిద్ధిపేట, సిరిసిల్ల నిర్మించిన కలెక్టరేట్ ఒక్క వర్షానికే కొట్టుకుపోయింది. అమరవీరులకు తగిన గుర్తింపు ఇవ్వాలని, ఉద్యమకారులకు పింఛన్ ఇవ్వాలని పార్టీ వేదికల్లో ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదు. కేసీఆర్‌ను ప్రశ్నించే ధైర్యం నాకే ఉంది. బోధన్ షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని ఎన్నిసార్లు కోరినా ఫలితం లేదు. ఆ పరిశ్రమను తెరిపించలేకపోవడం నాకు అవమానకరం. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్‌పై వచ్చిన ఆరోపణలపై బీఆర్ఎస్‌లో పెద్ద నాయకులమని చెప్పుకునే వారెవరూ స్పందించలేదు. అందుకే ప్రెస్‌మీట్ పెట్టి బలంగా మాట్లాడాను. అవినీతిపరుల పేర్లను మీడియాకు వెల్లడించాను” అని కవిత తెలిపారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చాలన్న నిర్ణయాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకించానని, పార్టీ పేరు మార్పు, జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడాన్ని తాను ఒప్పుకోలేదని స్పష్టం చేశారు. “తెలంగాణలో ఏం సాధించామో చెప్పకుండా జాతీయ రాజకీయాల్లోకి వెళ్తామని చెప్పడం సరైంది కాదు” అంటూ కవిత తన ఆవేదనను వ్యక్తం చేశారు.

కోనసీమలో బ్లో ఔట్.. వణికిపోతున్న జనం

కోనసీమలో ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. మలికిపురం మండలం ఇరుసుమండ వద్ద ఈ లేజీజ్ సంభవించింది. భారీ శబ్దంతో గ్యాస్ లీక్ అవుతుండటంతో పరిసర ప్రాంతాల వారు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. భారీ స్థాయిలో గ్యాస్ లీక్ అవుతుండటం, మంటలు ఎగసిపడుతుండటంతో   కోనసీమ వాసులు భయాందోళనలతో వణికి పోతున్నారు.  మూడు దశాబ్దాల కిందటి బ్లో ఔట్ ను తలచుకుని ఆందోళనకు గురౌతున్నారు.  సరిగ్గా 30 ఏళ్ల కిందట.. అంటే 1995 జనవరి 8న ఇదే కోనసీమలో సంభవించిన భారీ బ్లో ఔట్ ను గుర్తు తెచ్చుకుని వణికి పోతున్నారు. అప్పట్లో  కోనసీమ లోని మామిడికుదురు మండలం పాశర్లపూడి గ్రామం వద్ద ఓఎన్జీసీ రిగ్గు లీకై భారీ ఎత్తున మంటలు ఎగసి పడ్డాయి.  ఆ మంటల ధాటికి ఆ పరిసర ప్రాంతాల్లోని పచ్చదనమంతా మాడి మసైపోయింది. కొబ్బరి చెట్లు దగ్ధమైపోయాయి. జనవరి 8న జరిగిన ఆ బ్లోఔన్ మార్చి 15 నాటికి కానీ అదుపులోకి రాలేదు. అప్పట్లో సంభవించిన ఆ బ్లో ఔట్ ప్రపంచ బ్లో ఔట్ ల చరిత్రలోనే రెండో అతి పెద్ద బ్లో ఔట్ గా చరిత్ర సృష్టించింది. ఆ బ్లో ఔట్ కారణంగా భారీ నష్టం సంభవించింది. దాదాపు రెండు నెలలకు పైగా  ఆ మంటల వేడికి పాశర్లపూడి పరిసర గ్రామాల ప్రజలు మగ్గిపోయారు. పొలాలన్నీ ధ్వంసమయ్యాయి. ఇప్పుడు మళ్లీ భారీగా ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ అవుతుండటంతో కోనసీమ వాసులు నాటి రోజులను జ్ణప్తికి తెచ్చుకుని భయంతో వణికిపోతున్నారు. ఓఎన్జీసీ అధికారులు తక్షణమే స్పందించి గ్యాస్ లీకేజీని అరికట్టి మంటలను ఆర్పివేయాలని కోరుతున్నారు.