ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదుల చెరలో ఇద్దరు జపనీయులు

 

ఇరాక్, సిరియా దేశాలలో తిష్ట వేసిన ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదుల చెరలో ఇద్దరు జపనీయులు బందీలుగా చిక్కారు. వారిరువురితో కూడిన ఒక వీడియో క్లిప్పింగును ఆ సంస్థకు చెందిన అల్-ఫుర్ఖాన్ అనే వెబ్ సైటులో పెట్టింది. వారిరువురు క్షేమంగా స్వదేశానికి తిరిగి రావాలంటే 72 గంటలలోగా జపాన్ ప్రభుత్వం తమకు $200 మిలియన్లు చెల్లించాలని షరతు విధించింది. గడువు ముగిసిన వెంటనే వారిరువురినీ హతమారుస్తామని ఐ.యస్.ఐ.యస్. హెచ్చరించింది. ఇంతకు ముందు ఐ.యస్.ఐ.యస్. తనకు బందీలుగా చిక్కిన వివిధ దేశస్థులను అతి కిరాతకంగా కత్తితో గొంతు కోసి, దానిని చిత్రీకరించి తన వెబ్ సైటులో పెడుతుండేది. ఈసారి కూడా తనకు బందీలుగా చిక్కిన కెంజి గోటో జోగో మరియు హరున యుకావలకు కాషాయ రంగు దుస్తులను ధరింపజేసి, ఒక ఎడారి ప్రాంతంలో వారిరువురిని మోకాలుపై కూర్చోబెట్టి వారిరువురి మధ్య నల్లదుస్తులు, మొహానికి నల్లముసుగు ధరించిన ఒక ఉగ్రవాది చేసిన హెచ్చరికను చిత్రీకరించి ఉగ్రవాద సంస్థకు చెందిన వెబ్ సైటులో ఉంచింది.

 

అందులో నల్ల ముసుగు ధరించిన ఉగ్రవాది నేరుగా జపాన్ ప్రధాన మంత్రి షినాజో అబేని ఉద్దేశించి మాట్లాడుతూ, “మీ దేశం మా ఇస్లామిక్ స్టేట్ కి 8500 కిమీ దూరంలో ఉన్నప్పటికీ, మీరు పనిగట్టుకొని మాపై దాడులలో పాల్గొనేందుకు ముందుకు వచ్చేరు. మా మహిళలు, పిల్లలను హతమార్చేందుకు మీరు చాలా ఉదారంగా $ 100 మిలియన్లు విరాళం ఇచ్చేరు. కనుక ఇప్పుడు మీ ఇద్దరి పౌరుల ప్రాణాలు కాపాడుకోవాలనుకొంటే 72 గంటలలో $200 మిలియన్లు చెల్లించాలి.” అని హెచ్చరించాడు.

 

ఇంతకు ముందు ఐ.యస్.ఐ.యస్. ఉగ్రవాదులు చాలా మందిని అతికిరాతకంగా హతమార్చారు. కానీ ఏనాడు ఈవిధంగా డబ్బు కోసం డిమాండ్ చేయలేదు. కానీ ఇప్పుడు మొట్టమొదటి సారిగా $ 400 మిలియన్ డాలర్లు డిమాండ్ చేస్తున్నారు. బందీలను విడిపించుకొనేందుకు అంత భారీ మొత్తాలు వారికి ముట్టజెప్పడం మొదలుపెడితే ఆ డబ్బుతో వారు మరిన్ని ఆధునిక ఆయుధాలు కొనుగోలు చేసి మరింత బలవంతులవుతారు. కనుక జపాన్ ప్రభుత్వం వారి షరతుకి లొంగకపోవచ్చును. కానీ ఉగ్రవాదుల చెర నుండి 72 గంటలలో వ్యవధిలో బందీలను విడిపించడం కూడా అసాధ్యమే. కనుక ఆ ఇద్దరు బందీలు కూడా ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయే అవకాశాలే ఎక్కువ. ఇది మనసుని కలిచివేసే చేదు నిజం.

Teluguone gnews banner