రేవంత్ రెడ్డిలో అసంతృప్తి నిజమేనా?

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు..  ఒక్క మంత్రి వర్గ విస్తరణ విషయంలోనే కాదు..  ఆయన అసంతృప్తికి ఇంకా చాలా  కారణాలున్నాయి.  అయితే.. రోజు రోజుకు అధిష్టానంతో పెరుగతున్న దూరం విషయంలో, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పెరుగతున్న దూరం విషయంలో ఆయన కొంత మధన పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి ఇటీవల చేసిన కొన్ని  వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. 
 ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో .. ఆ ఇంటికి ఈ ఇల్లూ అంతేదూరం అవుతుంది. అందులో సందేహం లేదు. అవును.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం మధ్య పెరుగుతున్న దూరం గురించిన చర్చ సందర్భంగా ఒక పెద్దాయన నోటి నుంచి వచ్చిన మాట ఇది. నిజమే.. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి అంత కంఫర్టబుల్ గా లేరు. ఇంకా స్పష్టంగా చెప్పలంటే.. కష్ట నష్టాలను తట్టుకుని తెచ్చుకున్న ముఖ్యమంత్రి కుర్చీలో కంఫర్టబుల్ గా కూర్చో లేకపోతున్నారు. అవును.. రేవంత్ రెడ్డి అక్కడ ఇక్కడ మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు గమినిస్తే.. ఇటు  పార్టీలో,  అటు ప్రభుత్వ వ్యవహారాల్లో  ఆయన సంతృప్తిగా లేరని.. ఒక విధమైన ఉక్క పోతను అనుభవిస్తున్నారని అపిస్తోందని అంటున్నారు.  
అవును..  ముఖ్యమంత్రి కంఫర్టబుల్ గా లేరన్న విషయం ఎవరో చెప్పడం కాదు..  ఆయన మాటల్లోనే ఆ ధ్వని స్పష్టంగానే వినిపిస్తోందన్న చర్చ రాజకీయ వర్గాల్లో  జరుగుతోంది.  ముఖ్యంగా కొద్ది రోజుల కిందట హరియాణ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఆత్మకథ,  ప్రజల కథే ..నా ఆత్మ కథ   పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి అసౌకర్యానికి అద్దం పడుతున్నాయని అంటున్నారు. ముఖ్యంగా మోదీ బడిలో, చంద్రబాబు కాలేజీలో చదువుకుని,రాహుల్‌గాంధీ వద్ద ఉద్యోగం చేస్తున్నాను అంటూ చేసిన వ్యాఖ్య ఆయనలోని అసంతృప్తిని ప్రతిబింబించేలా ఉందని అంటున్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాను అంటూ.. ముఖ్యమంత్రి పదవిని  కొలువుగా పేర్కొనడంలో ఏదో నిగూఢ అర్థం,  కనిపించని బాధ దాగుందని అంటున్నారు.  

అయితే.. రేవంత్ రెడ్డిలో ఉన్న అసంతృప్తి, కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎదుర్కుంటున్నట్లు చెపుతున్న అవమానాల విషయాన్ని పక్కన పెడితే.. దత్తాత్రేయ ఆత్మ కథ ఆవిష్కరణ సభలో ఆయన తమ పూర్వాశ్రమ సంబంధాలను నెమరవేసుకోవడం వెనక ఏదో కథ ఉందనే అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి. నిజానికి,రేవంత్ రెడ్డి బీజేపీ వేదిక మీద ప్రసంగించడం, ఆ వేదిక మీద నుంచే బీజేపీ, ఆర్ఎస్ఎస్ లతో తనుకున్న పూర్వ అనుబంధాన్ని గుర్తు చేసుకోవడం అలాగే.. దత్తాత్రేయ మొదలు కిషన్ రెడ్డి వరకు అనేక మంది బీజేపీ నాయకులతో తనకున్న సన్నిహిత పరిచయం గురించి బహిరంగ వేదిక నుంచి ప్రస్తావించడం ఇదే మొదటి సారి కాదు.  గతంలో బీజేపీ సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర రావు , ఆత్మ కథ, ‘ఉనిక’ ఆవిష్కరణ సభలోనూ రేవంత్ రెడ్డి బీజేపీ, బీజేపీ నాయకులతోనే కాదు, సంఘ్ (ఆర్ఎస్ఎస్) పెద్దలతో సంబంధ బాంధవ్యాలను గుర్తు చేసుకున్నారు. అంతకు ముందు ప్రధాని మోదీని, అయన సమక్షంలోనే బడేభాయ్‌ అని సంబోదించారు.

అయితే.. అప్పటికీ, ఇప్పటికీ  ముఖ్యమంత్రి వ్యాఖ్యల్లో కొంత తేడా ఉందనీ.. అప్పట్లో  రాహుల్ ప్రస్తావన చేయని రేవంత్ రెడ్డి ఈసారి,  తాను రాహుల్ గాంధీ వద్ద కొలువు చేస్తున్నాని అన్నారు. అంటే..  తనకు స్వయం నిర్ణయాధికారం లేదనీ చెప్పకనే చెప్పారు. అలాగే..  కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డీ తానూ కలిస్తే రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఇప్పడు ఈ వ్యాఖ్యలే   రాజకీయ వర్గాల్లో  చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా.. బీజేపీ నేతలు, ఎన్డీయే కూటమిలోని భాగస్వామ్యపక్షాల నాయకులు పాల్గొన్న సభలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి పాల్గొనడమే విశేషం అనుకునుటే, రేవంత్‌రెడ్డి ఇంకో అడుగు ముందుకేసి,చేసిన వ్యాఖ్యలు,  అనుమానస్పదంగా ఉన్నాయని అంటున్నారు. 

బీజేపీ నేతలను ఇంతలా ప్రసన్నం చేసుకోవడానికి రేవంత్ రెడ్డి పాకులాడటం వెనుక ఆంతర్యమేంటని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాహుల్‌గాంధీ దగ్గర  ఉద్యోగం  చేస్తున్నా అని బీజేపీ వేదికపై చెప్పడం ద్వారా..  రేవంత్ రెడ్డి  ఎవరికీ ఎలాంటి సంకేతం ఇచ్చారనే చర్చ నడుస్తోంది. అన్నీ కలిసొస్తే మీతో కలిసి నడుస్తానని కమలదళానికి సంకేతం ఇచ్చారా?  ఉద్యోగ భద్రత, ఉద్యోగ సంతృప్తి లేక పోతే..  రాహుల్ దగ్గర చేస్తున్న ఉద్యోగం వదిలేస్తాననే  సంకేతం కాంగ్రెస్‌ పెద్దలకు ఇచ్చారా..  అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అయితే..  ఈ చర్చకు ముగింపు మాత్రం ఇప్పట్లో ఉండదని అంటున్నారు.