హైదరాబాద్ లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్.. తన కల నెరవేరిందన్న సీజేఐ
posted on Aug 20, 2021 @ 4:21PM
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మరో ప్రఖ్యాత కార్యాలయానికి వేదికవుతోంది. అంతర్జాతీయ వాణిజ్య వివాదాల మధ్యవర్తుల కేంద్రం ఏర్పాటులో కీలక అడుగు పడింది. ఆర్బిట్రేషన్ సెంటర్కు చెందిన ట్రస్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరిగింది. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుతో తెలంగాణ చరిత్రలోనూ, హైదరాబాద్ చరిత్ర లోనూ ఈ రోజు గొప్పదినంగా నిలిచిపోతుందని ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
హైదరాబాద్ లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం ఏర్పాటు తన కల అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. 3 నెలల సమయంలోనే తన కల నిజమవుతుందని ఎన్నడూ ఊహించలేదన్నారు. తన కల నిజమయ్యేలా చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్, సీజే హిమా కోహ్లీకి ఆయన థ్యాంక్స్ తెలిపారు.ఇక్కడ మౌలిక వసతులు, ఆర్థిక సహకారానికి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, ఆర్బిట్రేషన్ కేంద్ర ఏర్పాటు బాధ్యతలను జస్టిస్ లావు నాగేశ్వరరావు తీసుకోవాలని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. జూన్లో హైదరాబాద్కు వచ్చానని, ఆ సమయంలో ఆర్బిట్రేషన్ సెంటర్ గురించి చీఫ్ జస్టిస్తో మాట్లాడినట్లు ఆయన గుర్తు చేశారు. ఈ సెంటర్ గురించి అందరికీ తెలిసేలా చర్యలు చేపట్టాలని ఆయన తెలంగాణ చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీని కోరారు.ఈ మీడియేషన్ సెంటర్ ను ఎలా వాడుకోవాలన్న దానిపై అవగాహన కల్పించాలన్నారు.
ఎలాంటి వివాదాలు లేని వాతావరణంలో వ్యాపారం చేసుకునేందుకు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతుంటారని, ఏ వివాదాలు లేకుండా ఈ ఆర్బిట్రేషన్ కేంద్రం చూస్తుందని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడైన తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలోనే ఈ కేంద్రం ఏర్పాటుకు చట్టం వచ్చిందని గుర్తు చేశారు.ప్రపంచంలో తొలిసారిగా 1926లో ఆర్బిట్రేషన్ కేంద్రం ఏర్పాటైందని చెప్పారు. అయితే మన దగ్గర ఆర్బిట్రేషన్ కేంద్రం లేకపోవడం వల్ల ప్రతిసారీ సింగపూర్, దుబాయ్ కు వెళ్లాల్సి వస్తోందని అన్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో ఆ కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ఆ బాధ తప్పుతుందన్నారు. కోర్టుల చుట్టూ తిరిగే బాధ కూడా తప్పుతుందన్నారు.ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ఏర్పాటులో తెలంగాణ సహకారం మరువలేమన్నారు.
ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు అయితే అంతర్జాతీయ ఆర్బిట్రేటర్లు ఇక్కడకు వస్తారన్నారు జస్టిస్ ఎన్వీ రమణ. పెట్టుబుడిదారులు వివాదాలు లేని వాణిజ్యాన్ని కోరుకుంటున్నారని, అలాంటి వాళ్లకు ఈ సెంటర్ ఉపయోగపడుతుందని సీజే తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు చీఫ్ జస్టిస్ ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే సెంటర్ ఫంక్షనింగ్ ప్రారంభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్బిట్రేషన్ సెంటర్ సక్సెస్ కావాలని ఆయన కోరుకున్నారు. కేవలం అంతర్జాతీయ ఇన్వెస్టెర్లే కాదు, స్థానిక పెట్టుబడిదారుల వివాదాలను కూడా ఇక్కడ పరిష్కరిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీతో పాటు మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.