కేసీఆర్ ఢిల్లీలో ఉండగానే హుజురాబాద్ షెడ్యూల్.. సంథింగ్ సంథింగ్..
posted on Sep 28, 2021 @ 11:08AM
ఎప్పుడో రావాల్సిన హుజురాబాద్ బైపోల్ షెడ్యూల్. అప్పుడు రాలేదు. బెంగాల్తో పాటు జరుగుతుందనుకున్నా జరగలేదు. అప్పుడు సైతం కేసీఆర్ ఢిల్లీ వెళ్లొచ్చారు. ఇప్పుడు కేసీఆర్ మరోసారి హస్తిన పర్యటన చేపట్టారు. కేంద్ర పెద్దలను వరుసబెట్టి కలుస్తున్నారు. రోజుల తరబడి ఢిల్లీలోనే మకాం వేసి.. గప్చుప్ భేటీలు జరుపుతున్నారు. ఇదే సమయంలో ఉరిమి ఉరిమి పిడుగు మీదపడ్డట్టు.. సడెన్గా హుజురాబాద్ ఉప ఎన్నికకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది, కేసీఆర్ హస్తినలో ఉన్నప్పుడే అకస్మాత్తుగా బైపోల్ నగారా మోగడం యాధృచ్చికమా? లేక...?
కేసీఆర్ వరుస ఢిల్లీ పర్యటనలతో బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకున్నారని గతంలోనే వార్తలు వచ్చాయి. కేసీఆర్ రిక్వెస్ట్ మేరకే గత నెలలోనే రావాల్సిన ఎన్నికల షెడ్యూల్ రాలేదని అన్నారు. ఇప్పుడిక హుజురాబాద్ ఎలక్షన్ బెల్ మోగడంతో దీని వెనుక ఢిల్లీలో ఎలాంటి రాజకీయం నడిచిందనే అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. రెండు రకాల ఆసక్తికర వాదనలు వినిపిస్తున్నాయి.
కేసీఆర్ విజ్ఞప్తి మేరకే హుజురాబాద్ ఎన్నికను కొన్నివారాల పాటు వాయిదా వేసి.. దళితబంధు పథకం అమలుకు ఓ రూపు తీసుకొచ్చాకే ఎన్నికల నగారా మోగించారనేది ఓ వర్షన్. ఈ లోగా దళితబంధుతో పాటు ఈటల హీట్ కాస్త తగ్గించడం, కుల సంఘాల మీటింగులు, జంపింగ్ జపాంగుల షిఫ్టింగులు, తాయిలాలు, పందేరాలు గట్రా కంప్లీట్ చేసుకున్న గులాబీ పార్టీ ఇక ఇక్కడ ఓకే అనగానే.. అక్కడ ఎలక్షన్ బెల్ మోగిందని అంటున్నారు. టీఆర్ఎస్-బీజేపీల ఉమ్మడి శత్రువైన కాంగ్రెస్ను భవిష్యత్తులో దెబ్బకొట్టేందుకు.. హుజురాబాద్ విషయంలో తాత్కాలికంగా కాంప్రమైజ్ కావాలని బీజేపీని కేసీఆర్ ఒప్పించారని అంటున్నారు. ఢిల్లీ మంత్రాంగంలో పాపం ఈటల రాజేందర్ బలిపశువు అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ఇక మరో వాదన మరింత ఇంట్రెస్టింగ్గా ఉంది. కేసీఆర్ విసిరిన పాచికలు ఢిల్లీ పెద్దల దగ్గర బెడిసికొట్టాయని అంటున్నారు. కాలికి బలపం కట్టుకొని తిరిగినా.. కేంద్రం గులాబీ బాస్ ట్రాప్లో పడలేదని తెలుస్తోంది. తెలంగాణలో సొంతంగా అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలతో ఉన్న కమలనాథులు.. కేసీఆర్తో అంటకాగేందుకు ససేమిరా అన్నట్టు సమాచారం. ఈటల రాజేందర్లాంటి బలమైన నాయకుడు బీజేపీ తరఫున బరిలో ఉండబోతుండటంతో ఎలాగైనా ఆయన్ను గెలిపించుకొని.. కేసీఆర్కు గట్టి ఝలక్ ఇవ్వాలని.. టీఆర్ఎస్కు బీజేపీనే ఆల్టర్నేట్ అనే మెసేజ్ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తోంది. భారీ మెజార్టీతో ఈటలను గెలిపించుకొని.. టీఆర్ఎస్, కాంగ్రెస్లకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చి.. కాషాయ జెండాను ఎగరేయాలనే పట్టుదలతో ఉంది బీజేపీ. అందుకే, కమలదళాన్ని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు కేసీఆర్ ఓవైపు చేస్తుండగానే.. ఇక తమరి పప్పులేమీ ఉడకవు, ఢిల్లీలో ఉన్నది చాలు, ఇక ఇంటికెళ్లు అన్నట్టు.. హుజురాబాద్ బైపోల్ బెల్ కొట్టేశారని అంటున్నారు.
ఇలా రెండు వాదనలూ రీజనబుల్గానే ఉండటంతో.. కేసీఆర్ ఢిల్లీ టూర్లో అసలేం జరిగిందోననే ఆసక్తితో పాటూ అనుమానాలూ ఉన్నాయి. హస్తినలో ఏం జరిగినా.. హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ రావడం.. మరో నెల రోజులు గడువు ఉండటంతో.. ఇక ఇక్కడ పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరడం ఖాయం. ఎలాగైనా గెలిచి కేసీఆర్కు దిమ్మతిరిగేలా చేయాలని ఈటల రాజేందర్ పట్టుదలగా ఉండటం.. ప్రగతిభవన్ను ధిక్కరించిన ఈటలను మళ్లీ అసెంబ్లీలోకి అడుగుపెట్టకుండా చేయాలని టీఆర్ఎస్ స్ట్రాంగ్గా డిసైడ్ కావడంతో ఇక ఈ నెలరోజులూ, హుజురాబాద్ ఎలక్షన్ జరిగే వరకూ అసలు సిసలు రాజకీయం చూడొచ్చు.