కాకినాడ, పిఠాపురంపై ఈసీకి ఇంటెలిజెన్స్ నివేదిక

ఆంధ్ర ప్రదేశ్ లో పోలింగ్ సందర్భంగానూ, ఆ తరువాత కొన్ని ప్రాంతాలలో హింస చెలరేగింది. దీంతో ఆయా ప్రాంతాలలో పరిస్థితిని అదుపు చేయడానికి నిరవధికంగా 144వ సెక్షన్ విధించారు. ఇలా ఉండగా  ఇదే తరహా హింస కౌంటింగ్ సందర్భంగా కూడా చెలరేగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ విభాగం అనుమానిస్తోంది. ఆ మేరకు జూన్ 4న కౌంటింగ్ సందర్భంగానే, ఫలితాల ప్రకటన తరువాత కాకినాడ టౌన్, పిఠాపురం నియోజకవర్గాలలో హింసాకండ చెలరేగే అవకాశం ఉందని ఎన్నికల సంఘానికి ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది. 

ముఖ్యంగా ఏటిమొగ, దుమ్ములపేట, రామకృష్ణారావు పేటలలో పెద్ద ఎత్తున హింస ప్రజ్వరిల్లే అవకాశం ఉందని ఆ నివేదిక సారాంశం. దీంతో పోలీసులు ఆయా ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. అలాగే కాకినాడ సిటీ, పిఠాపురం నియోజకవర్గాల పరిధిలో గత ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలతో ప్రమేయమున్నవారిపై దృష్టికేంద్రీకరించారు. 

ఇంటెలిజెన్స్ నివేదిక ఆధారంగా  గట్టి చర్యలు తీసుకుని హింసను నివారించాలని ఈసీ పోలీసు అధికారులను ఆదేశించింది. అదే విధంగా సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఏపీఎస్పీ బలగాలను ఆ రెండు నియోజకవర్గాలలోనూ మోహరించనున్నారు. 

ఇప్పటికే  పోలింగ్ సందర్భంగా కాకినాడలో వైసీపీ, తెలుగుదేశం వర్గాల మధ్య ఘర్షణలు జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై ఇరు వర్గాలూ ఒకరిపై ఒకరు కేసులు కూడా నమోదు చేసుకున్నారు. కాగా తాజా ఇంటెలిజెన్స నివేదికతో కేంద్ర ఎన్నికల సంఘం కాకినాడ పిఠాపురం నియోజకవర్గాలపై సీరియస్ గా దృష్టి సారించింది. కౌంటింగ్ సందర్భంగా ఎలాటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా గట్టి చర్యలకు ఉపక్రమించింది.  

Teluguone gnews banner