వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంపై ఇండియా పైలెట్ల ఫైర్
posted on Jul 17, 2025 @ 3:46PM
అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ 171 విమాన ప్రమాదంలో 275 మంది మృతి చెందిన ఘటనలో రోజుకో కొత్త కోణం వెలుగుచూస్తోంది. ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) కొద్దిరోజుల క్రితం విమాన ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తు నివేదికను విడుదల చేసింది. అందులో విమానానికి ఇంధన సరఫరా నిలిచిపోవటమే ప్రమాదానికి కారణమని తేల్చింది. ఏఏఐబీ ప్రకారం.. విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే రెండు ఇంజిన్లకు ఇంధన సరఫరా ఆగిపోయింది. దీంతో విమానం ముందుకు వెళ్లలేకపోయింది. విమానాశ్రయానికి కొద్ది దూరంలో ఉన్న మెడికల్ కాలేజీ భవనంపై కుప్పకూలిపోయింది. పైలట్, ఫస్ట్ ఆఫీసర్తో సహా 241 మంది చనిపోయారు. మెడికల్ కాలేజీ విద్యార్థులు, ఆ ప్రాంతంలో ఉన్నవారు కూడా 34 మంది చనిపోయారు.
275 మంది ప్రాణాలు బలి తీసుకున్న ఈ ప్రమాదంపై అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం రాసింది. తాజాగా.. విమానం కుప్పకూలడానికి ముందు పైలట్ల మధ్య జరిగిన సంభాషణనను బయటపెట్టింది. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. బోయిగ్ 787 డ్రీమ్లైనర్ విమానాన్ని నడుపుతున్న ఫస్ట్ ఆఫీసర్ క్లీవ్ కుందర్.. ‘మీరెందుకు ఫ్యూయల్ స్విచ్లు ఆపేశారు’ అని క్యాప్టెన్ సుమీత్ సబర్వాల్ను అడిగాడు. ప్రమాదం జరగబోతోందని తెలిసి కుందర్ ఎంతో భయపడ్డాడు. అయితే, క్యాప్టెన్ సుమీత్ మాత్రం ఎంతో ప్రశాంతంగా ఉన్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.
వాల్ స్ట్రీట్ జర్నల్ కథనంపై ‘ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్’ ప్రెసిడెంట్ సీఎస్ రంద్వా ఆగ్రహం వ్యక్తం చేశారు. వాల్ స్ట్రీట్ సరైన ఆధారాలు లేకుండా కథనం రాసిందంటూ మండిపడ్డారు. వాల్ స్ట్రీట్ జర్నల్పై న్యాయ పరమైన చర్యలకు సిద్ధమవుతామని స్పష్టం చేశారు. గురువారం (జులై 17)ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పైలట్లు ఫ్యూయల్ స్విచ్లు ఆపేశారని ఏఐఐబీ తన నివేదికలో ఎక్కడా చెప్పలేదని... ఫైనల్ రిపోర్టు వచ్చే వరకు ప్రజలు తుది నిర్ణయానికి రావద్దని అభ్యర్ధించారు.