ఎక్కువ వద్దు, ఉన్నవి చెల్లించండి చాలు.. జగన్ సర్కార్ వీరి మొర ఆలకిస్తుందా?
posted on Feb 8, 2020 @ 11:14AM
టిడిపి ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ముస్లింలకు అనేక సంక్షేమ పథకాలను అందించారు. మసీదుల్లో పని చేసే ఇమామ్, మౌజన్ లకు నెలకు ఐదు వేలు, మూడు వేల చొప్పున గౌరవ వేతనాన్ని అందించారు. అంతేకాక రంజాన్ పర్వదినం ముందు మసీదులకు రంగులు వేసుకునేందుకు ప్రతి మసీదుకు ఆరు వేలరూపాయల చొప్పున సహాయమందించేవారు. రంజాన్ తోఫా కింద ఆరు రకాల సరుకులను రేషన్ దుకాణాల నుంచి తెల్లకార్డు కలిగిన ప్రతి కుటుంబానికి అందించారు. దుకాణ్ ఔర్ మకాన్ పథకం కింద పేద ముస్లింలకు లక్ష రూపాయల వరకూ రుణ సదుపాయం కల్పించారు. దుల్హాన్ పథకం కింద పేద ముస్లిం నవ వధువులకు లక్ష రూపాయల వరకు సాయం చేశారు. విదేశీ విద్య కింద పేద ముస్లిం విద్యార్థులకు పది లక్షల వరకు సహాయమందించేవారు.
అయితే కొత్తగా ఏర్పడిన జగన్ సర్కార్ ఈ పథకాలన్నింటికి మంగళం పాడింది. ఇమామ్, మౌజన్ లకు ఆరేడు మాసాలుగా గౌరవ వేతనాలు అందడం లేదు, వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడుమాసాలుగా ఏ ఒక్కరికీ గౌరవ వేతనం విడుదల కాలేదని పలువురు ఇమామ్ లు, మౌజన్ లు ఆవేదన చెందుతున్నారు. రోజు బ్యాంకులకు వెళ్లి తమ ఖాతాలను పరిశీలించుకుని వేతనాలు పడకపోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు. నాలుగేళ్ల పాటు టిడిపి ప్రభుత్వం తమకు గౌరవ వేతనాలు అందించిందని ఇప్పుడు వైసీపీ సర్కారు తమను నిర్లక్ష్యం చేస్తోందని వారు వాపోతున్నారు. వేతనాలు పెంచాం అంటున్నారు కానీ, మా ఖాతాల్లో మాత్రం జమకావట్లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా జిల్లా లోని సుమారు నాలుగు వందల మసీదుల్లో పని చేసే ఇమాం, మౌజన్ లకు గౌరవ వేతనాన్ని ఎన్నికలకు రెండు నెలల ముందు వరకూ అందించారు. గుడివాడలో పదకొండు మసీదుల్లో ఇమామ్ లు, మౌజన్ లకు టిడిపి హయాంలో ముప్పై ఒక్క లక్షల ముప్పై ఆరు వేలు, మచిలీపట్నం లోని ఇరవై మూడు మసీదుల ఇమామ్ లు, మౌజన్ లకు అరవై ఎనిమిది లక్షల నలభై ఎనిమిది వేలు గౌరవ వేతనంగా అందించారు. అయితే ఏడు నెలలుగా ఒక్క పైసా రాలేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవనిగడ్డ జామియా మసీదు అసోసియేషన్ కు ఇమామ్ మౌజన్ ల గౌరవ వేతనం నిమిత్తం ప్రతి నెల రూ ఎనిమిది వేలు అసోసియేషన్ అకౌంట్ కు జమ అయ్యేది. 2019 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు పది నెలల కాలానికి పాత విధానంలో ఎనభై వేలు జమ కావాల్సి ఉండగా ఇప్పటి వరకు నలభై ఎనిమిది వేలు మాత్రమే జమైంది. ఇతరప్రాంతాల నుంచి వచ్చి పని చేస్తున్న ఇమామ్, మౌజన్ లకు జీతాలు చెల్లించేందుకు అసోసియేషన్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. పెంచిన గౌరవ వేతనాలు అవసరం లేదని పాత విధానంలోనే సక్రమంగా చెల్లింపులు చేయాలని ఇమామ్ లు, మౌజన్ లు కోరుతున్నారు.