గెలిచినప్పటికీ ఎటూ తేల్చుకోలేకపోతున్నాను: రాహుల్ గాంధీ
posted on Jun 12, 2024 @ 5:25PM
సార్వ త్రిక ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ఇండియా కూటమి పరాజయం చెందినప్పటి కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రం డబుల్ ధమాకా కొట్టారు. ఆయన పోటీ చేసిన రెండు లోకసభ నియోజకవర్గాల్లో మంచి మెజార్టీతో గెలుపొందారు. అయితే రాహుల్ గాంధీకి ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. తాను ఏ నియోజకవర్గం నుంచి ప్రాతినిద్యం వహించాలి ఏ నియోజకవర్గం రాజీనామా చేయాలి అనేది తేల్చుకోలేకపోతున్నారు. వయనాడ్, రాయ్బరేలీలలో ఏ నియోజకవర్గంలో కొనసాగాలనేది తేల్చుకోలేకపోతున్నానని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కేరళలోని మలప్పురంలో బుధవారం జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ... ఈ విషయంలో తానూ ఏమీ తేల్చుకోలేకపోతున్నానన్నారు. ఏమైనా తాను ఏదో ఒక నియోజకవర్గానికి మాత్రమే ఎంపీగా ఉండాల్సి ఉంటుందన్నారు. తన నిర్ణయంతో రెండు నియోజకవర్గాలు సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. తనను భారీ మెజార్టీతో గెలిపించిన వయనాడ్ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
దేశంలో విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు అదానీకి అప్పగించాలని దేవుడు ఆదేశించారా? అని ఎద్దేవా చేశారు. తాను మానవమాత్రుడినేనని... తనకు పేదలు, దేశమే దైవమన్నారు. నేనేం చేయాలో వారే చెబుతారన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత మోదీ తన వైఖరిని మార్చుకోవాల్సిందే అన్నారు. ఆయనకు ప్రజలు స్పష్టమైన సందేశం ఇచ్చారని మెజార్టీ రాకపోవడాన్ని ఉద్దేశించి అన్నారు.