కొలిక్కివస్తున్న ఎల్బీఎఫ్ కేసు.. విచారణలో కీలక విషయాలు వెలుగులోకి
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్'(ఎల్బీఎఫ్) సంస్థ మోసం కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సంస్థ అధిక లాభాలు, ఆకర్షణీయమైన వడ్డీ , ఉద్యోగ అవకాశాలు అంటూ ఆశచూపి.. ఇన్వెస్ట్ మెంట్ల పేర ప్రజల నుంచి 21.37 కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేసినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ సంస్థ వలలో పడి 1,044 మంది మోసపోయినట్లు పోలీసుల దర్యాప్తులో చేరింది. ఎల్బీఎఫ్ బాధితుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అత్యధికులని తేలింది.
ఈ సంస్థపై కృష్ణా జిల్లా విస్సన్నపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగా ఈ సంస్థలో పెట్టుబడి పెట్టిన వారిలో కొందరు తాము పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువ మొత్తంలో లాభాల రూపంలో పొందారని పోలీసులు గుర్తించారు. ఇలా అదనంగా లబ్ధిపొందిన వారిని పిలిపించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. పెట్టుబడి పెట్టిన దాని కంటే అదనంగా వచ్చిన సొమ్మును అప్పటించాలని వారికి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇలా వసూలు చేసిన సొమ్మును బాధితులకు పంపిణీ చేసేందుకు పోలీసులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇప్పటికే సంస్థ బ్యాంకు ఖాతాలు, లావాదేవీల రికార్డులను సీజ్ చేసిన పోలీసులు, అక్రమంగా ఆర్జించిన ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారు.
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కంపెనీ నిర్వాహకులైన శివానీ దంపతులు లాభాలు, ఆకర్షణీయమైన వడ్డీ , ఉద్యోగ అవకాశాలు ఎర చూపి భారీగా ప్రచారం చేయడంతో జనం పెద్ద ఎత్తున ఈ సంస్థలో ఇన్వెస్ట్ చేశారు. తొలుత చెప్పినట్లుగానే అధిక లాభాలు, ఆకర్షణీయమైన వడ్డీ ఇచ్చిన సంస్థ నిర్వాహకులు.. ఆ తరువాత ఇస్తామన్న సొమ్ము ఇస్తామన్న సమయానికి ఇవ్వక పోవడంతో ఖాతాదారులు తిరగబడ్డారు. దీంతో ఈ వ్యవహారం పోలీసు స్టేషన్ మెట్లెక్కింది.