డబ్బులు డబుల్ చేస్తానంటూ రూ.25 లక్షల మోసం

 

హైదరాబాద్ నగరంలో జరిగే కొన్ని వింత వింత ఘటనలు చూస్తూ ఉంటే...ఎక్కడి నుండి వస్తాయా ఈ ఆలోచనలు అని అనిపిస్తుంది. మోసం చేయడానికి పలుమార్గాలు మంచి మార్గంలో వెళ్లడానికి ఒకే మార్గం... అన్నట్లు గా మోసగాళ్లు పలు మార్గాలను ఎంచుకొని మోసాలకు పాల్పడుతూ ఉంటారు. టెక్నాలజీ ఎంతగా పెరిగినా కూడా కొంతమంది మూఢ నమ్మకాలను నమ్మి.. మోసపోతూ ఉంటారు.

భాగ్య నగరంలో కూడా ఇటువంటి ఘటనే జరిగింది... గురువు రూపంలో వచ్చిన ఒక వ్యక్తి భారీష్ పేరుతో డబ్బులు డబుల్ చేస్తా నంటూ ఓ అమాయకుడిని నమ్మించి బురిడీ కొట్టించాడు. అతని వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేసిన ఘటన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకుంది..

వివరాల్లోకి వెళితే...

నిజామాబాద్ జిల్లాకు చెందిన మహమ్మద్ ఇర్ఫాన్ (44) అనే వ్యక్తి హైదరాబాదు నగరానికి వచ్చి బహదూర్పుర పరిధిలో నివాసం ఉంటూ సోఫా వర్క్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. కామారెడ్డి జిల్లాకు చెందిన గుగోలోత్ రవీందర్ (40) అనే వ్యక్తి హైదరాబాదు నగరానికి వచ్చి ఫిలింనగర్ లో ఉంటూ మేకప్ ఆర్టిస్ట్ గా పని చేస్తున్నాడు. 

మేడ్చల్ జిల్లాకు చెందిన కవీర సాయిబాబా (41) కొరియర్ డెలివరీ బాయ్ గా పని చేస్తున్నాడు. మనోహర్ సింగ్ (39) ధోబి గా పని చేస్తున్నాడు. వీళ్ళందరికీ అబ్దుల్ ఖయ్యూమ్ గురువు.... వీరందరూ అమాయకులైన మరియు ఒంటరిగా ఉన్న వ్యక్తులను మాత్రమే టార్గెట్‌గా చేసుకుని మోసాలకు పాల్పడుతుంటారు. 

ముందుగా ఈ నిందితులు అమాయకులను గుర్తించి బారిష్ పూజ చేస్తే మీ వద్ద ఉన్న డబ్బులు డబుల్ అవుతుం దని నమ్మించి... వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తారు... ఈ తరుణంలోనే హైదరాబాద్‌కు చెందిన ఓ బాధితుడు వీరి వలలో చిక్కుకున్నాడు... ఒంటరిగా ఉన్న బాధితుడిన్ని టార్గెట్ గా చేసుకొని బారిష్ పూజ చేస్తే డబ్బులు అనేక రేట్లు పెరుగుతుందని నమ్మించారు. వీరి మాటలు నిజమని నమ్మిన బాధితుడు పూజకు సరైనని ఒప్పుకున్నాడు. 

తెల్లవారు జామున మూడున్నర గంటల ప్రాంతంలో అబ్దుల్ ఖయ్యూమ్ గురువు గా పరిచయం చేస్తూ ఈ ఐదుగురు నిందితులు.... బాధితుడు ఇంటికి వెళ్లి బారిష్ పూజ చేసి అనంతరం బాధితుడికి స్వీట్లు మరియు బాదం పాలు ఇచ్చారు... మత్తు కలిపిన బాదంపాలు ప్రసాదంగా స్వీకరించిన తర్వాత సదరు బాధితుడు అపస్మారక స్థితిలో పడిపోయాడు. 

అదే సమయంలో నిందితులు బాధితుడి వద్ద ఉన్న రూ. 25 లక్షల రూపాయలను తీసుకొని అక్కడి నుండి పారిపో యారు. స్పృహ వచ్చిన బాధితుడు చూసేసరికి గురువుతో పాటు శిష్యులు కూడా అక్కడ లేకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం వేట కొనసాగించారు. 

నిన్న సాయంత్రం సమయంలో గండి మైసమ్మ వద్ద మహమ్మద్ ఇర్ఫాన్, రవీందర్, సాయి బాబా, ఠాకూర్ మనోహర్ సింగ్ లను అరెస్టు చేసి... వారి వద్ద నుండి ఒక గన్, కత్తి, రూ. 8,50,000 స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రధాన సూత్రధారి అయిన అబ్దుల్ ఖయ్యూమ్ పరారీ లో ఉన్నాడు. 

అతని కోసం గాలింపు చర్యలు చేపట్టామని మేడ్చల్ మండలం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కోటిరెడ్డి వెల్లడించారు...డబ్బులు ఎప్పుడు కూడా డబుల్ కావు.. అటువంటి పూజలే ఉండవు... ఇంత చిన్న లాజిక్ తెలియకుండా ఎలా మోసపోతున్నారు. ఇటువంటి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.

హీరో విజయ్‌కు సీబీఐ నోటీసులు

  తమిళనాడు కరూర్ తొక్కిసలాట కేసులో టీవీకే చీఫ్ స్టార్ హీరో విజయ్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల  12న ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని ఆదేశించింది. గత ఏడాది సెప్టెంబర్ 27న టీవీకే సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన విషయం తెలిసిందే  ఈ నెల 12న ఢిల్లీ సీబీఐ ప్రధాన కార్యాలయంలో విచారణకు రావాలని తెలిపింది. టీవీకే పార్టీ అధినేత విజయ్ ఆధ్వర్యంలో వేలుసామిపురంలో భారీ బహిరంగ సభ నిర్వహించింది.  ఈ సందర్భంగా ఆయను చూసేందుకు ఫ్యాన్స్, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ విషాద ఘటనలో సుమారు 41 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు. అయితే, ప్రారంభంలో స్థానిక పోలీసులు ఈ కేసును విచారించినప్పటికీ, బాధితులకు న్యాయం జరగాలంటే స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్లు వచ్చాయి. గతేడాది అక్టోబర్‌లో ఈ కేసును సీబీఐకి అప్పగించింది. అలాగే, విచారణను పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ రస్తోగి  నేతృత్వంలో ఒక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేశారు.

పోలీసులు నీళ్లు లేని బావిలో దూకి చావాలి...రోజా సంచలన వ్యాఖ్యలు

    వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసులు నీళ్లు లేని బావిలో దూకి చావాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.దేశంలోనే అట్టడుగు స్ధానంలో ఏపీ పోలీస్ శాఖ ఉందని రోజా విమర్శించారు.  కేంద్ర నివేదికను చూసి సీఎం చంద్రబాబు, హోంశాఖ మంత్రి అనిత సిగ్గుపడాలని విమర్శించారు.  మన పోలీస్ వ్యవస్ధను చూసి అందరు నవ్వుతున్నారని తెలిపారు. నెల్లూరు జైలులో పిన్నెల్లి సోదురులతో ములాఖత్ అయ్యారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలపై అక్రమ కేసులతో వేధిస్తోందని మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వైసీపీ హయంలో రూ. 960 కోట్లతో పనులు చేపట్టితే.. ఆ పనులకు ఆపి కూటమి ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. ఇంత జరగుతుంటే డిప్యూటీ సీఎం పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదని మాజీ మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు  

ఫాల్కన్ స్కామ్ కేసులో ఆ సంస్థ ఎండీ అమర్ దీప్ అరెస్టు

వందల కోట్ల రూపాయల ఫాల్కన్ స్కామ్ కేసులో  ప్రధాన నిందితుడు,  ఫాల్కన్ సంస్థ ఎండీ అమర్ దీప్‌ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. యాప్ ఆధారిత డిజిటల్ డిపాజిట్లు, మల్టీ నేషనల్ కంపెనీలు, షేర్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో అమర్ దీప్ భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసి ప్రజలను మోసగించిన అమర్ దీప్ దాదాపు 850 కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ స్కామ్ బయటపడగానే అమర్ దీప్ తన ఛార్టర్డ్ ఫ్లైట్ లో దుబాయ్ పారిపోయాడు. దీంతో తెలంగాణ పోలీసులు అమర్ దీప్ పై లుక్ ఔట్ నోటీసు జారీ చేశారు. ఇప్పుడు తాజాగా ఆయన దుబాయ్ నుంచి ముంబైకి వచ్చిన విషయాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారుల ద్వారా తెలుసుకున్న తెలంగాణ పోలీసులు ముంబై వెళ్లి అమర్ దీప్ ను అరెస్టు చేశారు.    ఈ కేసులో ఇప్పటికే ఫాల్కన్ సంస్థ సీఈఓతో పాటు అమర్ దీప్ సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమర్ దీప్ అరెస్టుతో ఈ కేసు విచారణ మరింత వేగవంతం కానుంది. ఫాల్కన్ ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్  పేరుతో దేశవ్యాప్తంగా వేలాది మందిని దారుణంగా మోసం చేసిన ఈ కేసులో అమర్ దీప్ అరెస్టు కీలక పరిణామంగా చెప్పవచ్చు.  మెస్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా అక్రమ డిపాజిట్లు సేకరించి వేల కోట్ల రూపాయలు దారి మళ్లించిన కేసులో ఫాల్కన్ ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అమర్‌దీప్ కుమార్‌పై   తెలంగాణ పోలీసులు జారీ చేసిన లుక్ ఔట్ నోటీసుల ఆధారంగా   అమర్‌దీప్ భారత్ కు వచ్చినట్లు తెలుసుకున్న  తెలంగాణ పోలీసులు సోమవారం (జనవరి 5)  ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకుని ట్రాన్సిట్ రిమాండ్‌పై హైదరాబాద్‌కు తరలించారు. కాగా ఈ కేసు దర్యాప్తులో   కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు అమర్‌దీప్ కుమార్  ఫాల్కన్ ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్  బ్రాండ్ పేరుతో పనిచేస్తున్న మెస్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, మోసం, క్రిమినల్ కాన్సిపరసీ కింద కేసులు నమోదు చేశారు. ప్రసిద్ధ బహుళజాతి సంస్థల పేర్లను ఉప యోగిస్తూ నకిలీ ఇన్‌వాయిస్ డిస్కౌంటింగ్ డీల్స్‌ను రూపొందించాడు. ఇందుకోసం మోసపూరిత వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసి, అధిక స్వల్పకాలిక లాభాలు వస్తాయని హామీలు ఇస్తూ సామాన్య ప్రజలను పెట్టుబడులు పెట్టేలా ప్రలోభపెట్టాడు. ఈ స్కామ్‌లో మొత్తం 7,056 మంది డిపాజిటర్ల నుంచి సుమారు రూ.4,215 కోట్ల అక్రమ డిపాజిట్లను అమర్ దీప్ సేకరించినట్లు దర్యాప్తులో తేలింది. వీరిలో 4,065 మంది బాధితులు దాదాపు రూ.792 కోట్ల మేర నష్టపోయినట్లు ప్రాథమిక అంచనా.పెట్టుబడిదారుల ఫిర్యాదుల ఆధారంగా సైబరాబాద్  కేసులు నమోదు చేసి, అనంతరం దర్యాప్తును సీఐడీకి  బదిలీ చేశారు.ఇప్పటివరకు ఈ కేసులో డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌లు, చార్టర్డ్ అకౌంటెంట్‌తో సహా మొత్తం 11 మంది నిందితు లను అరెస్టు చేసి న్యాయ స్థానం ముందు హాజరు పరచగా, వారంతా ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు.  దర్యాప్తులో భాగంగా 12 ప్లాట్లు, 4 లగ్జరీ కార్లు, రూ.8 లక్షల నగదు, 21 తులాల బంగారం, రూ.20 కోట్ల విలువైన ఆర్‌డిపి షేర్లు, రూ.8 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్‌లు సహా మొత్తం సుమారు రూ.43 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. వాటి అటాచ్‌మెంట్ ప్రక్రియ కొనసాగుతోంది.  

పరకామణి కేసులో ప్రమేయమున్న పోలీసులకు షాక్

ఏపీలో సంచలనం సృష్టించిన తిరుమల దేవస్థానం పరకామణి కేసులో ఏపీ హైకోర్టు  కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. పరకామణి కేసు మంగళవారం (జనవరి 6) హైకోర్టులో విచారణకు రాగా.. కేసు దర్యాప్తులో ముందుకు సాగాలని సీఐడీ, ఏసీబీని న్యాయస్థానం ఆదేశించింది. కౌంటింగ్ అంశంలో టేబుల్ ఏర్పాట్లపై సూచనలివ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది. నిందితులతో కొందరు పోలీసులు చేతులు కలిపినట్లు సీఐడీ నివేదికలో స్పష్టంగా ఉందని.. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చోరీ కేసు మినహా సీఐడీ, ఏసీబీ దర్యాప్తులో తేలిన ఇతర అంశాలపై దర్యాప్తు కొనసాగించుకోవచ్చని తేల్చిచెప్పింది. తదుపరి విచారణను హైకోర్టు గురువారానికి (జనవరి 8)వాయిదా వేసింది. కాగా.. ఈ కేసులో అప్పటి సీఐ జగన్ మోహన్ రెడ్డి, టూటౌన్ సీఐ చంద్రశేఖర్‌తో పాటు నిందితుడు రవికుమార్ ఆస్తులను పరిశీలించిన ఎస్‌ఐ లక్ష్మీ రెడ్డికి కూడా ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ ముగ్గురు పోలీసు అధికారులను పోలీస్ శాఖ వీఆర్‌కు పంపించింది. అయితే ఈ కేసుతో ప్రమేయం ఉన్న పోలీసులపై చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలతో ఈ ముగ్గురిపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసే అవకాశం ఉంది. అలాగే ఈ కేసుకు సంబంధించి కొన్ని పత్రాలను తారుమారు చేశారనే అభియోగాలు ఎదుర్కుంటున్న వన్‌టౌన్ సీఐ విజయ్‌కుమార్‌పై కేసు నమోదు చేస్తారా? లేదా? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

అమెరికా టారిఫ్‌ల బాదుడు రూ.54 లక్షల కోట్టు?

అమెరికాకు త్వరలో 600 బిలియన్ డాలర్లు.. అంటే సుమారు రూ.54 లక్షల కోట్లు ఆదాయం సమకూరనుందని అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ప్రపంచ దేశాలపై తాను విధించిన టారిఫ్‌లను సమర్ధించచుకుంటూ ఆ మేరకు పోస్టు పెట్టారు. టారిఫ్‌ల విషయంలోతాను అనుసరిస్తోన్న విధానాలు దేశాన్ని అర్థికంగా, భద్రతాపరంగా బలోపేతం  చేశాయని  గొప్పగా ప్రకటించుకున్నారు.  దేశంపై గౌరవం లేని కొన్ని మీడియా సంస్థలు ఈ విషయాన్ని వెల్లడించేందుకు నిరాకరిస్తున్నాయని ఫైర్ అయ్యారు.   ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శత్రువు, మిత్రుడు అనే తేడా లేకుండా పలు దేశాలపై టారిఫ్‌ల మోత మోగిస్తున్నారు. రాష్యా నుంచి ముడిచమురు కొంటున్నదన్న నెపంతో భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు 50 శాతం సుంకాలు వేశారు. ఒకవైపు రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న సమయంలోనే ఆ మెత మోగించింది అమెరికా. అయితే ట్రంప్ విధించిన టారిఫ్‌లపై అమెరికా సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ట్రంప్‌నకు టారిఫ్‌లు విధించే అధికారంపై అక్కడి సుప్రీంకోర్డు సమీక్షించి తీర్పు ఇవ్వనుంది. తీర్పు ఫలితం ఎలా ఉన్నా,  అందుకు తాము సిద్దంగా ఉన్నామని వైట్‌హౌస్ ఇప్పటికే వెల్లడించింది. వైట్‌హౌస్ ప్లాన్-బితో సిద్దంగా ఉందనీ, ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని, అయితే సుప్రీంకోర్టు తీర్పు తమకు సానుకూలంగా వస్తుందన్న ఆశాభావంతో ఉన్నట్లు వైట్‌హౌస్ మీడియా ప్రతినిధి కరోలిన్ లీవిట్ గతంలోనే వెల్లడించారు. మొత్తానికి ట్రంప్ టారిఫ్‌ల పేరుతో పెద్ద మొత్తానికే ఎసరు పెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బంగ్లాదేశ్ లో హిందువులపై ఆగని దౌర్జన్యకాండ

 బంగ్లాదేశ్‌లో  బంగ్లాదేశ్‌లో  హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి.  తాజాగా  సోమవారం (జనవరి 5)  ఒకే రోజు మూడు వేరువేరు ఘటనల్లో ఇద్దరు మరణించగా, ఓ మహిళలకు ఘోర అవమానం జరిగింది. ఓ వితంతువుపై గ్యాంగ్,  ఓ జర్నలిస్టు, ఓ వ్యాపారి హత్య జరిగాయి. సోమవారం (జనవరి 5)ఒక్క రోజే జరిగిన ఈ మూడు ఘటనలూ బంగ్లాదేశ్ లో హిందువుల భద్రత గాలిలో దిపంగా ఉందని తేటతెల్లం చేస్తున్నాయి.  వివరాల్లోకి వెడితో..  కాళీగంజ్ లో 4‌‌0 ఏళ్ల హిందూ వితంతువుపై ఇద్దరు యువకులు సోమవారం (జనవరి 5)  సామూహిత అత్యాచారానికి పాల్పడి అనంతరం ఆమెను చెట్టుకు కట్టేసి ఆమె జుత్తు కత్తిరించారు. అదే రోజు సాయంత్రం మరో ఘటనలో  జశోర్ జిల్లా కాపాలియా బజార్ లో స్థానిక దినపత్రికకు ఎడిటర్ గా వ్యవహరిస్తున్న జర్నలిస్ట్ రాణా ప్రతాప్ అనే యువకుడిని దుండగులు హత్య చేశారు. కాపాలియా బజార్ లో ఓ ఐస్ ఫ్యాక్టరీని కూడా నిర్వహిస్తున్న రాణా ప్రతాప్ ను అతడి ఫ్యాక్టరీ దగ్గరే దారుణంగా కాల్చి చంపారు. ఇక అదే రోజు రాత్రి నార్సింగ్ది  లోని బ్రాహ్మండికి చెందిన శరత్ చక్రవర్తి మణి  అనే కిరాణాషాపు యజమానిపై కత్తులతో దాడి చేసి విచక్షణారహితంగా పొడిచి హత్య చేశారు.   పాకిస్థాన్ లో హిందువులపై ఎడతెగకుండా జరుగుతున్న దాడుల పట్ల సర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఈ దారుణాలపై అక్కడి పోలీసులు నామ్ కే వాస్తే కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

సోనియాగాంధీకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.  దీంతో ఆమెను మంగళవారం (జనవరి 6)  ఉదయం   ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రికి తరలించారు.  వైద్యుల బృందం ఆమె ఆరోగ్య సరిస్థితిని పర్యవేక్షిస్తున్నది. కాగా సోనియాగాంధీ ఆరోగ్యంపై ఇప్పటి వరకూ ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులిటిన్ ను విడుదల చేయలేదు. అలాగే  కాంగ్రెస్ నుంచి కూడా ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.  కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ గత కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే.  సోనియా గాంధీ నాయకత్వంలో, పార్టీ వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చింది.  కాగా ఆరోగ్య కారణాలతోనే ఆమె  2017లో   కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆమె రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. 

ఆకు పచ్చని కోనసీమలో ఓఎన్జీసీ మంటల కొలిమి!

పచ్చటి కోనసీమను ఓఎన్జీసీ నిప్పుల కొలిమిలా మార్చేస్తోంది. ఎన్జీసీ చమురు, సహజవాయువుల అన్వేషణ, వెలికితీత కార్యక్రమాలు కొనసీమ వాసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. పచ్చగా కళకళలాడే కోనసీమ నిప్పుల కుంపటిలో భగభగలాడిపోతోంది.  ఎక్కడ ఏ చిన్న గ్యాస్ లీకేజీ జరిగినా కోనసీమ వాసులు గుండెలు గుభేలు మంటున్నాయి. మంటలు ఎగసిపడి పచ్చటి పొలాలను మాడ్చేస్తాయా, కామధేనువు వంటి కొబ్బరి చెట్లను కాల్చేస్తాయా అన్న భయంతో వణికిపోతున్నాయి.  తాజాగా  మలికిపురం మండలం ఇరుసమండ వద్ద   భారీ బ్లోవుట్ కారణంగా పరిసర ప్రాంతాల ప్రజలు గుండెలరచేత పట్టుకుని క్షణమెక యుగంగా గడుపుతున్నారు. సంఘటనా స్థలానికి కిలో మీటర్ దూరంలో నివాసం ఉండే ప్రజలకు ఖాళీ చేయించి సహాయ శిబిరాలకు తరలించారు.  స్కూళ్లలో పిల్లలు భోజనాలు చేస్తుండగా.. వారిని మధ్యలోనే లేపేసి సురక్షిత ప్రాంతానికి తరలించారు. అంతేందుకు ఘటనా స్థలానికి సమీపంలో నివాసం ఉండే ప్రజలందరినీ కేవలం ఐదంటే ఐదు నిముషాల వ్యవధిలో కట్టుబట్టలతో ఖాళీ చేయించి   లక్కవరం పునరావాస కేంద్రానికి చేర్చారు.  దట్టమైన పొగ కారణంగా తమలో కొందరికి శ్వాసకోశ జబ్బులు, దగ్గు వంటివి వచ్చాయని.. కంటికి కనిపించని పొగ కారణంగా ఎవరు ఎటు పురుగుదీస్తున్నామో అర్ధం కాని దుస్థితి తలెత్తిందని వాపోతున్నారు వీరు. ఇదిలా ఉంటే గతంలో మీరెప్పుడైనా ఇలాంటిది చూశారా అంటే లేదంటున్నారు ఇరుసమండ గ్రామస్తులు. 200 గజాల దూరంలో ఈ ఘటన జరగడంతో ఏం చేయాలో పాలుపోక తలో దిక్కు పారిపోవల్సి వచ్చిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వీరంతా. ఇదంతా ఇలా ఉంటే గతంలో ఇలాంటి ఘటనలు ఎన్ని జరిగాయో చూస్తే.. 1993లో రాజోలు మండలం, కడలి పరిధి తూర్పు పాలంలో కొమరాడ- 1 డ్రిల్లింగ్ సైట్ లో ఒక బ్లో అవుట్ ఘటన జరిగింది. ఈ స్పాట్ నుంచి ఎగబడ్డ చమురు స్థానిక కడలి డ్రెయిన్ లో కలిసి పలు చోట్ల మంటలు అంటుకోవడంతో పాటు.. వేల కొబ్బరి చెట్లు దగ్థమయ్యాయి. 26 రోజుల తర్వాత వెల్ కిల్లింగ్ ఆపరేషన్ ద్వారా బావిని పర్మినెంట్ గా మూసెయ్యాల్సి వచ్చింది. ఇక 1995లో పాశర్లపూడి ఘటన జరిగింది. పాశర్లపూడి- 19 బావిలో డ్రిల్లింగ్ టైంలో బ్లో అవుట్ సంభవించి 65 రోజుల పాటు అగ్నికీలలు ఎగసి పడ్డాయి. దీంతో ఈ ప్రాంత వాసులు అదిరిపడ్డారు. దీంతో బీఓపీ మూసి వేసి మంటలను అదుపులోకి తీసుకురావాల్సి వచ్చింది. 1997లో రావులపాలెం దగ్గర్లోని దేవరపల్లిలో.. డ్రిల్లింగ్ స్టేషన్ లోని సైట్ లో  బ్లో అవుట్ ఎగసిపడింది. విపరీతమైన శబ్ధంతో ఈ గ్యాస్ చమురు చుట్టుపక్కల నివాస ప్రాంతాలకు వ్యాపించింది. దీంతో ఈ ప్రాంత వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 19న ఈ బ్లో అవుట్ వెలుగు చూడగా ఫిబ్రవరి 24 న అదుపులోకి తెచ్చారు. 2020లో కాట్రేని కోనకు దగ్గర్లోని ఉప్పూడిలో ఇక్కడి డ్రిల్లింగ్ సైట్ లో భారీ బ్లో అవుటు వెలుగు చూసింది. జనం ఇళ్ల నుంచి బయటకు పరగులు దీశారు. ఓన్ జీ సీ నిపుణుల బృందం మూడు రోజుల పాటు శ్రమించి పరిస్థితి అదుపులోకి తీసుకురావల్సి వచ్చింది. ఇక 2014లో గెయిల్‌ విస్ఫోటంలో 22 మంది మృత్యువాత పడ్డ ఘటన ఆంధ్రులంతా అదిరిపడేలా చేసింది. మామిడికుదురు మండలం  నగరంలోని గెయిల్ కి చెందిన పైప్  లైన్ విస్ఫోటనం జరిగింది. ఈ ఘటనలో 22 మంది చనిపోవడంతో పాటు 18 మంది తీవ్రంగా గాయపడ్డారు.  పెద్ద ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. అప్పట్లో ఈ ఘటన దేశ వ్యాప్తంగా  సంచలనం సృష్టించింది. తాజాగా   ఇరుసమండ బ్లో అవుట్. ఇది ఎప్పటికి అదుపులోకి వస్తుందో తెలీక ఈ ప్రాంత వాసులు గుండెలరచేత పట్టి పునరావాస కేంద్రాల్లో మగ్గుతున్నారు.

అమెరికా వర్సెస్ వెనిజువేలా భారత్ పై ప్రభావం ఎంటి?

వెనిజువేలాలో రాజకీయ సంక్షోభం నెలకొని ఉంది. ఆ దేశాధ్యక్షుడిని అమెరికా మెరుపుదాడి నిర్వహించి, ఏకంగా ఆ దేశ రాజధాని లోకి అధ్యక్ష భవనంలోనే బందీగా పట్టుకుని అమెరికాకు తరలించింది. ఆ తరువాత ఆ దేశాధ్యక్షురాలిగా సుప్రీం ఆదేశాల మేరకు ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటికీ, వెనిజువేలా సర్కార్ ను తాము గుర్తించబోమనీ, అక్కడ సజావుగా అధికార మార్పిడి జరిగే వరకూ ఆ దేశ పాలనా వ్యవహారాలన్నీ అమెరికాయే చూస్తుందని అగ్రరాజ్యాధినేత డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అంతే కాకుండా మదురో అరెస్టునకు వ్యతిరేకంగా గళం విప్పే వారందరినీ అరెస్టు చేయాల్సిందిగా ఆదేశాలు కూడా జారి చేశారు.   రష్యా, చైనా సహా పలు ప్రపంచదేశాలు అమెరికా చర్యను తీవ్రంగా గర్హించాయి. ఐరాస సైతం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంలో భారత్ మాత్రం ఆచితూచి స్పందించింది. అమెరికా చర్యను నేరుగా ఖండించలేదు. మొక్కుబడి తంతు అన్నట్లు వెనిజువేలా ప్రజల సంక్షేమమే ముఖ్యమని, అన్ని పక్షాలూ శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలనీ సూచిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఇందుకు కారణం లేకపోలేదు. ఈ విషయంలో తటస్థంగా ఉండటమే భారత్ కు ప్రయోజనకరమనీ, అందుకే భారత్ కర్ర విరగకుండా, పాము చావకుండా అన్న తరహాలో స్పందించిందనీ అంటున్నారు.  ఇంతకీ అసలు విషయమేంటంటే.. వెనిజువేలా నుంచి భారత్ కు చెందిన ఓఎన్ జీసీ విదేశ్ లిమిటెడ్ కు రావాల్సిన బకాయిలు కొండలా పేరుకుపోయి ఉన్నాయి.  వెనిజువేలాలో అమెరికా జోక్యంతో పెట్రోలియస్ డి వెనిజులా రీస్ట్రక్చరింగ్ జరిగితే..  ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్ కు పెండింగ్ బకాయిలు రావడమే కాకుండా  చమురు సరఫరా పెరిగితే.. అంతర్జాతీయ మార్కె ట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు గణనీయంగా తగ్గుతాయి. అదే జరిగితే ఆ ఎఫెక్ట్ నేరుగా అమెరికాపైనే పడుతుంది.   భారత్ చమురు విషయంలో  రష్యాపై ఎక్కువగా ఆధారపడుతున్న సంగతి తెలిసిందే.  ఇప్పుడు వెనిజులా నుంచి కూడా చమురు సరఫరా మొదలైతే.. అమెరికా టాక్స్ టెర్రర్ నుంచి తప్పించుకోవడానికి ఇండియా రష్యా చమురు కొనుగోలును తగ్గించేసే అవకాశాలు ఉంటాయి.  అప్పుడు అమెరికా ఆంక్షల నుంచి భారత్ కొంత వరకూ బయటపడే అవకాశం ఉందని అంటున్నారు. 

అమెరికా అభియోగాలు పచ్చి అబద్ధాలు.న్యూయార్క్ కోర్టులో మదురో వాదన

వెనిజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా మెరుపుదాడి నిర్వహించి అరెస్టు చేసిన సంఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మదురో అరెస్టు వ్యవహారం వెనుక డ్రగ్స్ అక్రమ రవాణా, నార్కో టెర్రరిజం వంటి తీవ్రమైన కారణాలు ఉన్నాయని పేర్కొంటూ అమెరికా ఆయనను న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో హాజరుపరిచింది. అయితే మదురో తాను నిర్దోషినని కోర్టులో వాదించారు. వెనిజువేలా రాజథాని కారకాస్‌లోని అధ్యక్ష భవనం నుంచి తనను బలవంతంగా బందీగా పట్టుకున్నారని మదురో కోర్టులో న్యాయమూర్తికి తెలిపారు. తాను అత్యంత గౌరవనీయ స్థానంలో ఉన్న వ్యక్తిననీ,  దేశాధ్యక్షుడిననీ పేర్కొన్న మదురో అమెరికా మోపిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని స్పష్టం చేశారు.  అమెరికా అక్రమంగా తనను పదవి నుంచి తొలగించినా, తానే ఇప్పటికీ వెనిజువేలా అధ్యక్షుడినని ఆయన ఉద్ఘాటించారు.   మదురోతో పాటు ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ ను కూడా కోర్టులో హాజరు పరిచారు. ఆమె కూడా  తాను వెనిజులా ప్రథమ మహిళనని, తనపై వచ్చిన ఆరోపణలన్నీ పూర్తి అవాస్తవాలని స్పష్టం చేశారు. అమెరికా మదురోపై  నార్కో టెర్రరిజం, కొకైన్ దిగుమతికి కుట్ర, విధ్వంసకర ఆయుధాలు   కలిగి ఉండటం, మెక్సికోలోని సినలోవా, జెటాస్ కార్టెల్స్, కొలంబియా తిరుగుబాటుదారులతో కలిసి డ్రగ్స్ నెట్‌వర్క్ నడపడం వంటి అభియోగాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వెనిజువెలా చమురు నిల్వలపై కన్నేసిన అమెరికా.. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై ఈ తప్పుడు కేసులు పెట్టిందని మదురో వాదించారు.  ఇలా ఉండగా మదురో అరెస్ట్ తర్వాత వెనిజువెలాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.   మరోవైపు, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రష్యా, చైనా సహా వెనిజువెలా మిత్రదేశాలు అమెరికా చర్యను తీవ్రంగా ఖండించాయి. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ కూడా ఈ పరిణామంపై ఆందోళన వ్యక్తం చేస్తూ 1989 పనామా దాడి తర్వాత లాటిన్ అమెరికాలో అమెరికా చేసిన అతిపెద్ద సైనిక చర్యగా దీనిని పేర్కొన్నారు.    అదలా ఉంటే.. వెనిజువేలా అరెస్టు తరువాత ఆ దేశంలో యుద్ధ వాతావరణం నెలకొంది. తాజాగా అక్కడి   అధ్యక్ష భవనం సమీపంలో భారీగా కాల్పులు, ఘర్షణలు జరిగాయి.  మదురోను అమె రికా బందీగా పట్టుకుని తరలించిన తరువాత ఆ దేశ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఉపాధ్యక్షురాలైన డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.  పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆమె అమెరికాతో చర్చలకు సిద్ధమని ప్రకటించినా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు.  వెనిజువెలాలో సక్రమంగా అధికార మార్పిడి జరిగే వరకూ ఆ దేశాన్ని అమెరికాయే నడిపిస్తుందని పేర్కొన్నారు. కాగా వెనిజువేలాలో పరిణామాలపై భారత్ ఆచితూచి స్పందించింది.  వెనిజువెలా ప్రజల క్షేమం తమకు ముఖ్యమని, అన్ని పక్షాలు శాంతియుతంగా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని పేర్కొంది.