టీమ్ వర్క్...బెటర్ రిజల్ట్స్...ఇవే అభివృద్ధి మంత్రం : సీఎం చంద్రబాబు

 

2025వ సంవత్సరంలో మంత్రులు, అధికారులు సమన్వయంతో పనిచేయడం వల్లే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 2026లోనూ అదే ఉత్సాహం, వేగంతో పనిచేసి అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన నిర్వహించిన 14వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు  సమావేశంలో పరిశ్రమలు, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంధన రంగాలకు చెందిన పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించింది.

ఈ సమావేశంలో మొత్తం 14 సంస్థలకు చెందిన రూ.19,391 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించగా, వీటి ద్వారా 11,753 మందికి ఉద్యోగ అవకాశాలు కలగనున్నాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో రూ.8,74,705 కోట్ల పెట్టుబడులు ఆమోదం పొందగా, 8,35,675 మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి.

సమావేశం ప్రారంభానికి ముందు మంత్రులు, సీఎస్ సహా ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, గత ప్రభుత్వ పాలనలో దెబ్బతిన్న రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ తిరిగి బలపడిందని, గూగుల్, టాటా, జిందాల్, బిర్లా, అదానీ, రిలయన్స్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. చిన్న పొరపాటుకైనా తావివ్వకుండా బాధ్యతతో పనిచేయాలని మంత్రులు, అధికారులను కోరారు.

ప్రజలపై భారం తగ్గించాం… సంతోషంగా ఉంది

విద్యుత్ రంగంలో గణనీయమైన సంస్కరణలు చేపట్టామని సీఎం తెలిపారు. 13 పైసలు విద్యుత్ ఛార్జీలు తగ్గించామని, రూ.4,500 కోట్ల ట్రూఅప్ భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరించిందన్నారు. 2029 నాటికి విద్యుత్ కొనుగోలు ధరను యూనిట్‌కు రూ.3.70కి తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఈ చర్యల వల్లే డేటా సెంటర్లు, భారీ పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని పేర్కొన్నారు.

దావోస్ పర్యటనలో ఏపీ బ్రాండ్‌ను గ్లోబల్ స్థాయిలో ప్రమోట్ చేయగలిగామని, గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏపీకి రావడంలో మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారని సీఎం ప్రశంసించారు. వేగవంతమైన గవర్నెన్స్‌తో ఫలితాలు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

ఐలాండ్ టూరిజంపై ప్రత్యేక దృష్టి

సూర్యలంక బీచ్‌ను అంతర్జాతీయ స్థాయి టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు. 15 కిలోమీటర్ల క్లీన్ బీచ్ ఫ్రంట్, కాలుష్యరహిత ప్రాంతంగా అభివృద్ధి చేయాలని, మాల్దీవ్స్ తరహాలో ఐలాండ్ టూరిజాన్ని ప్రోత్సహించాలని సూచించారు. పాపికొండలు–పోలవరం, కోనసీమ, పులికాట్, విశాఖ, అరకు, గండికోట వంటి ప్రాంతాలను క్లస్టర్ టూరిజంగా అభివృద్ధి చేయాలని తెలిపారు.

ఫుడ్ ప్రాసెసింగ్‌తో రైతులకు లాభం

తిరుపతి ప్రాంతంలో మరిన్ని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని సీఎం చెప్పారు. వాల్యూ అడిషన్‌తోనే రైతులకు గరిష్ట లాభం దక్కుతుందన్నారు. ఏపీని ఫుడ్ ప్రాసెసింగ్‌లో ఛాంపియన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

పాలసీల అమల్లో ఎలాంటి మినహాయింపులు ఉండవద్దని, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని స్పష్టం చేశారు. కొప్పర్తి ఎలక్ట్రానిక్స్ క్లస్టర్, స్పేస్ సిటీ, మాకవరపాలెం ఫుడ్ పార్క్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.

ఎస్ఐపీబీ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి ఏపీ ఐటీ ఇన్‌ఫ్రా పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ తదితరులు, సీఎస్ విజయానంద్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


 

విశాఖ పోలీసుల పనితీరును ప్రశంసించిన సీఎం చంద్రబాబు

  విశాఖపట్నంలో ఓ మహిళపై జరిగిన దాడి వెనుక వాస్తవాలను ఛేదించి, నిందితుణ్ని అదుపులోకి తీసుకున్న విశాఖ నగర పోలీసులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. రెండు రోజుల క్రితం విశాఖలో విజయదుర్గ అనే మహిళను జగదాంబ సెంటర్‌లో ఓ వ్యక్తి దాడి చేసి, దుర్భాషలాడినట్టు ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై తక్షణమే స్పందించిన పోలీసులు... ఈ ఘటనకు కారణమైన వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయితే అతని మానసిక పరిస్థితి బాగోలేదని ప్రాథమిక విచారణలో తేలింది.  సంఘటన సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించి, వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం, నిందితుడి గుర్తింపు వివరాలు తెలియకపోయినా,  కేసును ఛేదించడంపై బాధిత మహిళ సంతృప్తి వ్యక్తం చేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించారని చెప్పారు. సదరు మహిళ స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి, ఆ వ్యక్తి మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని నిర్ధారించుకున్నారు. అతన్ని మానసిక ఆసుపత్రిలో చేర్పించాలని కోరారు.  అలాగే నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవద్దని బాధితురాలు విజ్ఞప్తి చేశారు. విశాఖలో శాంతిభద్రతలు అద్భుతంగా ఉన్నాయనేందుకు ఇది నిదర్శనమని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసుల పనితీరును ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ప్రజల భద్రతకు కట్టుబడి పనిచేస్తోందన్నారు. మహిళలకు రక్షణ విషయంలో దేశంలోనే విశాఖ మొదటి స్థానంలో ఉందని, భవిష్యత్‌లోనూ ఎటువంటి ఘటనలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీస్ ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. ఇదే సమయంలో ఇలాంటి ఘటనలపై రాజకీయం చేస్తూ, ప్రభుత్వంపై బురద జల్లాలని ప్రయత్నించేవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

జగన్‌కు రైతుల స్ట్రాంగ్ కౌంటర్

  వైసీపీ అధ్యక్షుడ జగన్‌పై ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిపై జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ స్ట్రాంగ్ ఇచ్చారు. అమరావతి నిర్మాణంపై జగన్.. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒకలా, అధికారంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి అభివృద్ధి పనులు జరుగున్నాయని స్పష్టం చేశారు. ఇప్పుడు జగన్ అమరావతి అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహించారు.  ఇప్పుడు సీఎం ఎక్కడ ఉంటే అదే రాజధాని అని జగన్ అనడం సమంజసమా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఆదివారం (11-1-26) ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఇంటిలిజెంట్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడారు. వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అమరావతి స్మశానం, ఎడారి అన్నారని.. అందుకనే ఆ పార్టీకి ప్రజలు 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పారనన్నారు.  రాజ్యంగానికి భిన్నంగా జగన్ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నందుకు జగన్‌పై వెంటనే ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి కారణం కూడా అమరావతి ఉద్యమమేనని స్పష్టం చేశారు. జగన్ ప్రజల్ని రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదని చెప్పుకొచ్చారు. జగన్‌కు ధైర్యం ఉంటే 11 మందితో కలిసి అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. అధికార పక్షం తప్పులుంటే జగన్ అండ్ కో ఎత్తి చూపాలని సూచించారు.  గత ఐదేళ్లు జగన్ ఎక్కడ ఉండి పరిపాలన చేశారని నిలదీశారు. జగన్ ఇల్లు అమరావతిలోనే ఉందని ప్రస్తావించారు. 2015లోనే అమరావతిపై గ్రీన్ ట్రైబ్యునల్‌లో జగన్ కేసు వేయించారని గుర్తు చేశారు. అమరావతికి గ్రీన్ ట్రిబ్యునల్ క్లీన్‌చిట్ ఇచ్చిందని తెలిపారు. అమరావతిలో రెండో ల్యాండ్ పూలింగ్‌పై తమకు వ్యతిరేకత లేదని పేర్కొన్నారు. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్ కూడా అమరావతిలోనే ఉంటున్నారని ప్రస్తావించారు.  జగన్ ఇలానే నడుచుకుంటే రాజకీయ సమాధి కట్టడానికి రాజధాని మహిళలు సిద్ధంగా ఉంటారని హెచ్చరించారు. జగన్‌ని మోసపు రెడ్డి అని అనొచ్చని ఎద్దేవా చేశారు. జగన్ బటన్ నొక్కడమే పరిపాలన అనుకున్నారని విమర్శించారు. జగన్ సగం సగం మాట్లాడతారని, తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మాట్లాడతారని సెటైర్లు గుప్పించారు. సో కాల్డ్ అనే పదం జగన్ మానుకోవాలని.. లేదంటే తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అమరావతి పేరు చెప్పడానికే కూడా జగన్ ఇష్టపడడం లేదని వారు మండిపడ్డారు.  

బెజవాడ నడిబొడ్డులో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ

  విజయవాడ లెనిన్ సెంటర్‌లో సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ విగ్రహాన్ని  ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, ఎంపీ కేశినేని శివనాథ్, హీరో జయ కృష్ణ, గద్దె రామ్మోహన్, బోండా ఉమా, బుద్ధ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు.  తెలుగుజాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ సూపర్ స్టార్ కృష్ణ అని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశంసించారు.  కృష్ణని చూస్తే అల్లూరి సీతారామరాజు గుర్తొస్తుంటారని,  విజయవాడ నడిబొడ్డులో కృష్ణ విగ్రహాన్ని పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించారు. తెలుగుజాతి ఉన్నంతవరకు కృష్ణ పేరు నిలిచి ఉంటుందన్నారు. కృష్ణతో ప్రతి ఒక్క హీరోకి విడదీయలేని అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. మూవీ పోస్టర్‌ను చూసి ఆయా సినిమాలకు వెళ్లామంటే అది ఒక కృష్ణకే దక్కుతుందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. హీరో కృష్ణను మించిన సూపర్ స్టార్ మరొకరు ఉండరని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు.  అతి తక్కువ కాలంలో 350 సినిమాలు చేసిన గొప్ప నటుడు కృష్ణ అని ప్రశంసించారు. మూడో తరం వారసుడిగా రమేశ్‌బాబు కొడుకు జయకృష్ణ వస్తున్నారని తెలిపారు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ బ్యానర్‌లో జై కృష్ణ నటించడం చాలా సంతోషంగా ఉందని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. కృష్ణకు విజయవాడతో ఎంతో అనుబంధం ఉందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. నటుడు మహేశ్‌బాబు లాగే.. కృష్ణ మనువడు జై కృష్ణ కూడా సూపర్ స్టార్ తరహాలో పేరు తెచ్చుకుంటారని ప్రశంసించారు. ఈనాడు సినిమా ఇక్కడే షూటింగ్ జరిగిందని గుర్తుచేశారు. ఈనాడు సినిమా ద్వారా కృష్ణ రాష్ట్ర రాజకీయాల చరిత్రనే మార్చేశారని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.  

అమరావతిపై వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు

  రాజధాని అమరావతిపై మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. కేంద్రం, రాష్ట్రంతో పాటు అందరం కలిసి రాజధానిగా  అమరావతిని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.  ముచ్చింతల్ స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబురాల్లో మాజీ రాష్ట్రపతి పాల్గొన్నారు. అమరావతి అంటే గుంటూరు, గన్నవరం, విజయవాడ, తాడికొండలు మాత్రమే కాదు...ఆంధ్రుల ఆకాంక్షకు ప్రతి రూపం అన్నారు. రాజధాని విషయంలో సీఎం చంద్రబాబుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని తెలిపారు. ఈ విషయంలో అనవసర వివాదాలను సృష్టించొద్దని తెలిపారు.  పాలిటిక్స్‌లో వారసత్వాన్ని ప్రోత్సహించడం తనకు ఇష్టం లేదని తెలిపారు. అందువల్లే రాజకీయాల్లోకి తన కుమారుడు, కుమార్తెను రానివ్వలేదని స్పష్టం చేశారు. సంస్కృతి, సంప్రాదాయాలను కాపాడాలని తన పిల్లలకు చెప్పానని, అదే తాను ఇచ్చే సంపద అని వెంకయ్య నాయుడు అన్నారు. ఏది మారినా మన సంస్కృతి సంప్రదాయాలు మూలలు మారకూడదని మాజీ ఉపరాష్ట్రపతి తెలిపారు.  ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఇంటికి చేరే సమయంలో సంక్రాంతి పండగ నిర్వహించుకుంటామని, ఈ మధ్య వాతవరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయని వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రకృతితోనే మన పండగలన్నీ ముడిపడి ఉన్నాయన్నారు. ప్రకృతి బాగుంటేనే భవిష్యత్ సైతం బాగుంటుందని వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్‌లా అమరావతి కూడా అభివృద్ధి చెందాలని తెలిపారు.  

బాబా వంగా జోస్యం నిజమవుతుందా?... మూడో ప్రపంచ యుద్దం తప్పదా?

  బల్గేరియా జ్యోతిష్యురాలు బాబా వంగా చెప్పింది నిజమవుతోందా? 2026లో మూడో ప్రపంచ యుద్ధం జరగబోతోందా? ఈ ఏడాది ప్రారంభంలోనే జరుగుతున్న వరుస సంఘటనలు చూస్తుంటే నమ్మక తప్పని పరిస్థితి నెలకొంది. బాబా వంగా చెప్పింది నిజమయ్యే అవకాశాలున్నాయనే భయాందోళనలు కూడా మొదలయ్యాయి. 9/11 దాడులు, కోవిడ్-19 వంటి పరిణామాలను ముందే ఊహించిన బాబా వంగా 2026ను యుద్ధం, విధ్వంసం జరిగే సంవత్సరంగా అభివర్ణించారు.  వెనిజులాపై అమెరికా సైనిక దాడి, రష్యా – ఉక్రెయిన్ మధ్య పెరుగుతున్న ఘర్షణలు, రష్యా చమురు నౌకలపై అమెరికా దాడులు, ఇరాన్‌లో పెరుగుతున్న అంతర్గత తిరుగుబాటు, తైవాన్‌పై చైనా సైనిక చర్యకు సిద్ధమవుతోందనే వార్తలు.. ఇవన్నీ చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం తప్పదనే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు గ్రీన్‌లాండ్‌పై కన్నేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరప్ దేశాలతో కయ్యానికి సిద్ధమవుతున్నారు.  కొలంబియా, మెక్సికో, క్యూబా వంటి దేశాలపై కూడా ట్రంప్ చర్యలకు సిద్ధమవుతున్నారు. లాటిన్ అమెరికా నుంచి యూరప్ వరకు సాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు బాబా వంగా చెప్పినట్టుగా మూడో ప్రపంచ యుద్దానికి దారితీస్తాయని చాలా మంది భయపడుతున్నారు . అమెరికా వాణిజ్య యుద్ధాలు, చమురు రాజకీయాలు, సరిహద్దు వివాదాలు, అంతర్గత తిరుగుబాట్లు ప్రపంచాన్ని ఒక అనిశ్చితిలోకి నెట్టేస్తున్నాయి. మరి, ఈ పరిస్థితులు సద్దుమణిగి శాంతి నెలకొంటుందా? లేదా బాబా వంగా చెప్పినట్టు ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుందా అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.  

వడోదరలో చోటా కోహ్లీ

  టీమిండియా-న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ నేడు ప్రారంభం అయింది. ఇందులో తొలి మ్యాచ్ వడోదర వేదికగా జరిగింది. అయితే టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. కేవలం వన్డేలు ఆడుతుండటంతో ఈ మ్యాచులపై అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఆటగాళ్లంతా ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో కొంత మంది చిన్నారులు వారిని చూడటానికి గ్రౌండ్‌కు వచ్చారు. ఆ యంగ్ కిడ్స్‌కు విరాటో కోహ్లీ ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు.  ఇక్కడే ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఆ చిన్నారుల్లో ఒక పిల్లాడు.. అచ్చు చిన్ననాటి కోహ్లీలాగే ఉన్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే కోహ్లీ కూడా ఆ చిన్నారికి ఆటోగ్రాఫ్ ఇస్తూ.. చిరునవ్వు చిందిచడం అభిమానులను మరింత ఆకట్టుకుంటుంది. ‘వీడేంటి నా లాగే ఉన్నాడు..’ అని కోహ్లీ అనుకుని ఉంటాడని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియోకు లక్షల సంఖ్యలో వ్యూస్‌ వస్తున్నాయి.

కేంద్ర మంత్రి రామ్మోహన్ చొరవతో మయన్నార్ బాధితులు స్వదేశానికి

  ఉద్యోగుల కోసమని మయన్మార్ వెళ్లి మోసపోయి అక్కడే చిక్కుకుపోయిన పది మందిని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రత్యక చొరవతో స్వదేశానికి వచ్చేలా చేశారు. భాధితుల ఇబ్బందులను వారి కుటుంబ సభ్యులు ఇటీవల రామ్మోహన్‌నాయుడి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌రే లేఖ రాసి రక్షించమని కోరారు.  దాంతో యాంగోన్‌లోని భారత రాయబా కార్యాలయం అధికారులు అక్కడి ప్రభుత్వ అధికారులతో చర్చించి 10 మందిని ఢిల్లీకి తరలించారు. బాధితులను ఏపీ భవన్ అధికారులు వారి స్వస్థలాలైన విజయనగరం, విశాఖపట్నం, అన్నమయ్య, హైదరాబాద్, జగిత్యాల జిల్లాలకు తరలించాు. మయన్నార్‌లో 80 మందికి పైగా భారతీయులు సైబర్ నేరగాళ్ల చేతుల్లో చిక్కుకున్నారని, వారందర్నీ వెనక్కు రప్పించే ప్రయత్నం చేయాలని రామ్మోహన్‌నాయుడు కేంద్ర మంత్రి జైశంకర్‌ను కోరారు.

సిరియాలో ఐసిస్ స్థావరాలపై యూఎస్ దాడులు

  సిరియాలోని ఐసిస్ స్థావరాలపై అమెరికా దళాలు భారీ దాడులు చేపట్టాయి. గత నెల ఐసిస్ జరిపిన దాడుల్లో తమ ఇద్దరు సైనికులు, ఒక పౌరుడు మరణానికి ప్రతీకారంగానే ఈ దాడులు చేపట్టినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. తమ పౌరులకు హాని తలపెట్టిన వారిని.. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించింది. వారిని తాము ప్రపంచంలో ఎక్కడ ఉన్నా.. వెతికి పట్టుకుని చంపేస్తామని యూఎస్ సెంట్రల్ కమాండ్ గట్టి వార్నింగ్ ఇచ్చింది.  మిత్ర దేశాల దళాలతో కలిసి ఇస్లామిక్ స్టేట్ స్థావరాలే లక్ష్యంగా విరుచుకుపడింది.  గత నెలలో ఐసిస్‌ జరిపిన దాడుల్లో ఇద్దరు అమెరికా సైనికులు, ఓ పౌరుడు చనిపోయాడని.. దానికి ప్రతీకారంగానే ఈ దాడులు చేపట్టినట్లు తెలిపింది. అంతేకాకుండా.. ఎవరైనా తమ సైనికులకు హాని తలపెడితే.. వారు న్యాయం నుంచి తప్పించుకోవడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాదని పేర్కొంది. వారిని తాము ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుని చంపేస్తాము యూఎస్ సెంట్రల్ కమాండ్ అని ఆ ప్రకటనలో పేర్కొంది.   2025 డిసెంబర్ 13న సిరియాలో ఐసిస్ ఉగ్రవాదులు పాల్మిరా, సిరియాలో.. అమెరికా, సిరియా భద్రతా దళాలు లక్ష్యంగా దాడులు చేశారు. ఈ దాడుల్లో ఇద్దరు అమెరికా సైనికులతో పాటు అమెరికాకు చెందిన ట్రాన్స్‌లేటర్ మృతి చెందాడు. యూఎస్ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల ప్రకారం డిసెంబర్ 19న ఆపరేషన్ హాక్‌ఐ పేరుతో ఐసిస్‌పై దాడులు నిర్వహించింది. జోర్డాన్‌తో కలిసి దాదాపు 70 ఐసిస్ స్థావరాలపై దాడులు చేసింది. తాజాగా అదే ఆపరేషన్‌కు కొనసాగింపుగా ప్రతీకార దాడులు నిర్వహించింది అమెరికా. కాగా, ప్రస్తుతం సిరియాలో దాదాపు 1000 మంది అమెరికా సైనికులు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని తెలుస్తోంది.  

మేడారానికి పోటెత్తిన భక్త జనం

  ములుగు జిల్లా మేడారానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం, సంక్రాంతి సెలవులు కావడంతో అమ్మవార్లను దర్శించుకోవటానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. సమ్మక్క-సారలమ్మ దేవతలను మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో గద్దెల ప్రాంగణంలో సందడి నెలకొంది. ఈ రోజు సుమారు రెండు లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకుంటారని అధికారుల అంచనా వేస్తున్నారు. రద్దీ నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టారు.  మేడారం వైపు వేలాది వాహనాలు రావడంతో పస్ర-మేడారం మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నార్లపూర్, కొత్తూరు, జంపన్నవాగు ప్రాంతాల్లో ప్రత్యేకంగా పార్కింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. జాతరకు వచ్చే భక్తులకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది.  అన్ని రూట్లలో మెడికల్ క్యాంపులు ఏర్పాట్లు చేయాలని అధికారులను మంత్రి రాజనర్సింహ ఆదేశించారు. టీటీడీ కళ్యాణ మండపంలో 50 పడకలతో ప్రధాన ఆస్పత్రి, మరో రెండు చోట్ల మినీ హాస్పిటళ్లు, మొత్తం 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. 35 అంబులెన్సులు 3,199 మంది సిబ్బంది అందుబాటులో ఉండనున్నారు.ఈ నెల 28 నుంచి 31 వరకు మేడారం జాతర జరగనున్న విషయం తెలిసిందే.   

తెలంగాణలో చలి పంజా...మూడు రోజులు వణుకుడే

  తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో చలి తీవ్రత పెరిగింది. పలుజిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్‌ డిజిట్‌కు చేరడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. రానున్న మూడు రోజుల పాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు నమోదైన వివరాల ప్రకారం, ఆదిలాబాద్ జిల్లా భీంపూర్‌లో అత్యల్పంగా 7 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత రికార్డైంది. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో 7.9 డిగ్రీలుగా నమోదైంది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదవడం చలి తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి తక్కువ ఎత్తులో వీచే గాలుల ప్రభావంతో చలి పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో రాబోయే రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీల మధ్య కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు మరియు చిన్నారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఇవాళ ఢిల్లీ నగరంలో  4.8 °C కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. చాలా ప్రాంతాల్లో 4°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది. మరోవైపు సౌత్ ఢిల్లీలోని అయా నగర్‌లో 2.9 °C  ఉష్ణోగ్రతతో ప్రజలు వణికిపోయారు. గరిష్ఠ ఉష్ణోగ్రత 16 డిగ్రీల వద్దే ఉంటుందని పేర్కొంటూ ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.