బిగ్ బ్రేకింగ్.. హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెంకట్!
posted on Oct 1, 2021 @ 12:21PM
తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నికకు నామినేషన్లు మొదలయ్యాయి. అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో హుజురాబాద్ లో రాజకీయ వేడి రాజుకుంది. అధికార టీఆర్ఎస్ తమ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరును చాలా రోజుల క్రితమే ప్రకటించింది. బీజేపీ అధికారికంగా ప్రకటించకపోయినా.. ఆ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. గెల్లు, ఈటలలు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం ఇంకా అధికారకంగా ఖరారు కాలేదు.
హుజురాబాద్ విషయంలో కాంగ్రెస్ మొదటి నుంచి సైలెంటుగానే వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ టికెట్ రేసులో పలువురు పేర్లు వినిపించాయి. మాజీ మంత్రి కొండా సురేఖ పేరు దాదాపుగా ఖరారైందనే ప్రచారం జరిగింది. అయితే స్థానిక నేతలు వ్యతిరేకించడంతో ప్రకటన ఆగిపోయిందని తెలుస్తోంది. తాజాగా హుజురాబాద్ లో పోటీ చేయడం లేదని కొండా సురేఖ ప్రకటించడంతో కాంగ్రెస్ అభ్యర్థిపై సస్పెన్స్ నెలకొంది. అయితే తాజాగా కాంగ్రెస్ అభ్యర్థి ఖరారైనట్లు తెలుస్తోంది.
తెలంగాణ ఎన్ ఎస్ యు ఐ ఐ రాష్ట్ర అధ్యక్షుడు బాలమూరు వెంకట్ ను అభ్యర్థిగా ఎంపిక చేశారని సమాచారం. ఆయన పేరును రేపో మాపో అధికారికంగా పార్టీ ప్రకటించబోతోంది.
బల్మూరి వెంకట్ కొన్ని రోజులుగా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాకా మరింత స్పీడ్ పెంచారుల. చలో రాజ్ భవన్ కార్యక్రమంలో భాగంగా పోలీసులకు చుక్కలు చూపించారు వెంకట్. ఈ నేపథ్యంలోనే యువకుడైన వెంకట్ ను హుజురాబాద్ బరిలో దింపాలని పీసీసీ నిర్ణయించిందని తెలుస్తోంది. వెంకట్ కు రేవంత్ రెడ్డి అండదండలు పూర్తిగా ఉన్నాయని అంటున్నారు. అధికార పార్టీ విద్యార్థి నేతను బరిలోకి దింపినందున... కాంగ్రెస్ కూడా అదే ప్రయత్వం చేసినట్లు కనిపిస్తోంది.