కర్నాటకలో హంగే.. ప్రభుత్వ ఏర్పాటులో జేడీఎస్ కీలకం?
posted on Apr 13, 2023 @ 12:25PM
కర్నాటకకర్ణాటక శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న పీపుల్స్ పల్స్ ప్రీపోల్ సర్వే రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందన్న సంకేతాలను ఇచ్చింది. రాష్ట్రంలో ఏ పార్టీకీ మేజిక్ ఫిగర్ సాధించి అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలు లేవని పేర్కొంది. వచ్చె నెల 3వ తేదీన కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అదే నెల 10న ఓట్ల లెక్కింపు.. ఫలితాల విడుదల ఉంటుంది. ఈ నేపథ్యంలో కర్నాటకలో ఏ పార్టీ అధికారం చేపడుతుంది? ఏపార్టీ ప్రతిపక్షానికే పరిమితమౌతుంది అంటే.. ఇప్పటికిప్పుడు జనం నాడిని బట్టి హంగ్ వినా మరో అవకాశం లేదన్న మాటా వినపడుతోంది. పీపుల్స్ పల్స్ ప్రీ పోల్ సర్వే కూడా అదే చెప్పింది. రాష్ట్రంలో అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మధ్య పోటీ నువ్వా నేనా అనే విధంగా ఉంటుందని సర్వే పేర్కొంది. ఈ పోరులో కాంగ్రెస్ పార్టీ స్వల్ప ఆధిక్యత సాధించినా.. అది అధికార పగ్గాలను అందుకునేందుకు అవసరమైన సంఖ్యా బలం సాధించడానికి కూతవేటు దూరంలోనే నిలిచిపోతుందని సర్వే పేర్కొంది. ఈ పరిస్థితుల్లో కింగ్ మేకర్ పాత్ర పోషించే జేడీఎస్ కీలకమౌతుందని సర్వే పేర్కొంది. ఔను రాష్ట్రంలో జరిగేది ముఖాముఖీ పోరే అయినా.. ఏవో కొన్ని స్థానాలను ఖాతాలో వేసుకోగలిగే పాటి బలం ఉన్న జేడీఎస్ ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే ఆ పార్టీకే రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకునే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని పీపుల్స్ పల్స్ సర్వే పేర్కొంది.
వాస్తవానికి కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ, సంకీర్ణ ప్రభుత్వాలు కొత్త కాదు. అలాగే, అలాంటి పరిస్థితి వచ్చిన ప్రతిసారీ జేడీఎస్ కీలకంగా మారుతోంది. 2018 ఎన్నికల తర్వాత కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. 224 మంది సభ్యులున్న సభలో బీజేపీ 106 స్థానాల్లో విజయం సాధించి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కానీ మేజిక్ ఫిగర్ (113) చేరుకోలేక పోయింది. దీంతో 78 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కేవలం 37 సీట్లు మాత్రమే గెలిచిన జేడీఎస్ ముఖ్యమంత్రి కుర్చీ పట్టుకు పోయింది. కుమార స్వామి ముఖ్యమంత్రిగా, జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కొలువు తీరింది.
ఆ తరువాత సంకీర్ణంలో చిచ్చు కారణంగా కుమార స్వామి సర్కార్ కూలిపోయింది. 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీలో చేరి, ఆ తరువాత ఉప ఎన్నికల్లో గెలిచారు. ఆ విధంగా సంవత్సరం తిరక్కముందే బీజేపీ పూర్తి మెజారిటీతో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ఆతర్వాత యడ్యూద్యూరప్ప స్థానంలో బసవరాజు బొమ్మై ముఖ్యమంత్రిగా వచ్చారు.
సరే, ఆ చరిత్రను అలా ఉంచితే, వచ్చే నెల జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో కూడా అదే పునరావృతం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇక పీపుల్స్ పల్స్ తాజా సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీత రాష్ట్రంలో 95 నుంచి 105 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది. అలాగే బీజేపీ 90 నుంచి 100 స్థానాలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. జేడీఎస్ పాతిక నుంచి ముఫ్ఫై స్థానాలలో గెలుపొందుతుందని సర్వే పేర్కొంది. బీజేపీపై ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నా దానిని పూర్తి స్థాయిలో అందిపుచ్చుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందనే చెప్పాలి.
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతాన్ని రానున్న ఎన్నికలలో గణనీయంగా పెంచుకోగలిగినా.. ఆ మేరకు సీట్ల సంఖ్య పెరిగే అవకాశాలు లేవన్నది సర్వే చెబుతోంది. దీంతో ఎన్నికల అనంతరం జీడీఎస్ మళ్లీ కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి.