సల్వాజుడం పే చర్చా
posted on Aug 23, 2025 @ 6:40PM
ఇండియా కూటమి అభ్యర్ధి సుదర్శన్ రెడ్డికి ఓటు వేయడం అంటే, నక్సలైట్లకు ఓటు వేయడంతో సమానమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఈ విషయంపై భారీ ఎత్తున చర్చ నడుస్తోంది. ఇదే అంశంపై నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి ఖండించారు. అమిత్ షా ఆ తీర్పు చదువుకోవల్సిన అవసరం ఉందని అన్నారాయన. అంతే కాదు.. నక్సలైట్లు విదేశీయులు కారు. మన దేశంలోని వారే. వారంటే అంత వ్యతిరేకత ఎందుకని నిలదీశాను మల్లురవి. ఇదిలా ఉంటే, ఉపరాష్ట్రపతి ఎన్నికకు విప్ ఏదీ లేదు. కాబట్టి ఎవరి ఆత్మసాక్షి ప్రబోధాన్నిబట్టీ వారు ఓటు వేయొచ్చు. దీన్నిబట్టీ చూస్తే ఎంపీలు పెద్ద ఎత్తున సుదర్శన్ రెడ్డికి ఓటు వేయాలని సూచించారు.
అయితే సల్వా జుడుం తీర్పుపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ అది తాను ఇచ్చినది కాదని, సుప్రీం కోర్టు తీర్పు అని ఇండి కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి అన్నారు. గిరిజనులను గిరిజనుల చేతే చంపించవద్దని మాత్రమే తాను అన్నానని చెప్పారాయన. 40 పేజీల ఆ తీర్పును అమిత్ షా చదవాలని ఆశిస్తున్నానని అన్నారు. ఒకవేళ దీన్ని చదివి ఉంటే హోం మంత్రి ఆ వ్యాఖ్యలు చేసి ఉండేవారు కాదని చెప్పుకొచ్చారు. ఇదే తాను చెప్పదలచుకున్నానని అన్నారు. ఇక్కడితో ఈ చర్చను ఆపేద్దామని జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా విపక్షాలు ఏకగ్రీవంగా ఎంపికచేయడం గౌరవంగా భావిస్తున్నానని సుదర్శన్ రెడ్డి అన్నారు. ఇది 64శాతం ప్రజల ప్రాతినిధ్యాన్ని సూచిస్తోందని వ్యాఖ్యానించారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది ఇద్దరి అభ్యర్థుల మధ్య పోటీ కాదు, రెండు భావజాలాల మధ్య పోటీ. ప్రజాస్వామ్యం అంటే పరస్పర చర్చ మాత్రమే. వ్యక్తులు, వారి ఆలోచనల మధ్య సంఘర్షణ కాదు. జాతీయ అంశాలపై గతంలో అధికార, విపక్ష పార్టీలు సమన్వయం చేసుకునేవి. దురదృష్టవశాత్తు ఇప్పుడది కనిపించడం లేదని అన్నారు జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి.