ఎన్ కన్వెన్షన్ పై హైడ్రా రంగనాథ్ దెబ్బ
posted on Aug 24, 2024 @ 11:02AM
గత కొన్ని రోజులుగా హైడ్రా చేపడుతున్న కూల్చివేతల కార్యక్రమం బడావ్యక్తుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. తన సినిమాలతో యువతను ఉర్రూత లూగించిన మాస్ హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ నేలకొరిగింది
అక్రమ నిర్మాణాల కూల్చివేతతో హాట్ టాఫిక్గా మారిన హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) ఎక్కడా తగ్గటం లేదు. ఎవరైతే నాకేంటి అంటూ హైడ్రా అధికారులు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. తాజాగా.. హైదరాబాద్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. సినీ హీరో నాగార్జునకు చెందిన ఈ కన్వెన్షన్ను ఇవాళ ఉదయం భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. నాగార్జునకు సంబంధించి ఎన్ కన్వెన్షన్ సెంటర్పై తాజాగా హైడ్రా అధికారులకు ఫిర్యాదు అందింది.
తుమ్మకుంటలో చెరువును ఆక్రమించి నాగార్జున మూడు ఎకరాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నిర్మించారని పలువురు ఫిర్యాదు చేశారు. చెరువు ఎఫ్ టిఎల్ పరిధిలో కన్వెన్షన్ నిర్మించారని గతంలోనూ ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు సర్వే నిర్వహించి పక్కా ఆధారాలతో శనివారం తెల్లవారుజాము నుంచే కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత ప్రారంభించారు. ఎన్ కన్వెన్షన్ లోపలికి వెళ్లే అన్ని దారులను అధికారులు మూసేశారు. మీడియాకు సైతం అనుమతి లేదని అన్ని దారుల్లోనూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. కూల్చివేతలను చిత్రీకరించేందుకు అనుమతి లేదంటూ మీడియోపై కూడా ఆంక్షలు విధించారు.కాగా, హైదరాబాద్లో గత కొన్ని రోజులుగా అక్రమ కట్టడాల మీద 'హైడ్రా' స్పెషల్ ఫోకస్ పెట్టింది హైడ్రా. కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలోని హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తున్నారు. పార్టీలు, ప్రముఖులు అన్న తేడా లేకుండా అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు చెందినదిగా భావిస్తున్న జన్వాడ ఫామ్హౌస్ సైతం అక్రమ నిర్మాణం అంటూ హైడ్రా కూల్చివేయడానికి సిద్ధమైంది. అయితే దీనికి వ్యతిరేకంగా హైకోర్టులో కేసు వేశారు. దీంతో తాత్కాలికంగా కూల్చివేతలకు బ్రేక్ పడింది.