ఏపీలో బంగారు గనుల తవ్వకం షురూ... ఏటా 750 కిలోల గోల్డ్ ఉత్పత్తి
posted on Sep 21, 2025 @ 4:03PM
భారతదేశ బంగారం ఉత్పత్తి పటంలో ఆంధ్రప్రదేశ్ త్వరలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోనుంది. కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (డీజీఎంఎల్) అభివృద్ధి చేసిన గని నుంచి త్వరలోనే పసిడి వెలికితీత ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే దేశంలో గనుల నుంచి గోల్డ్ ఉత్పత్తి చేయనున్న తొలి ప్రైవేట్ రంగ సంస్థగా డెక్కన్ గోల్డ్ మైన్స్ చరిత్ర సృష్టించనుంది. జొన్నగిరి గని నుంచి తొలినాళ్లలో ఏటా 750 కిలోల బంగారం ఉత్పత్తి చేయవచ్చని డీజీఎంఎల్ భావిస్తున్నట్లు ప్రసాద్ వివరించారు.
రానున్న రెండు, మూడేళ్లలో ఈ ఉత్పత్తిని 1,000 కిలోల స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో ఏటా కేవలం 1.5 టన్నుల బంగారం మాత్రమే ఉత్పత్తి అవుతోంది. దీంతో, ఏటా సుమారు 1,000 టన్నుల పసిడిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దీనివల్ల భారీగా విదేశీ మారక ద్రవ్యం ఖర్చవుతోంది. ఈ నేపథ్యంలో జొన్నగిరిలో ఉత్పత్తి పూర్తి స్థాయిలో మొదలైతే, దేశీయంగా బంగారం లభ్యత పెరిగి దిగుమతుల భారం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.