గ్యాంగ్రిన్ గండం.. కరోనా బాధితులకు మరో ప్రమాదం
posted on May 24, 2021 @ 12:37PM
కరోనా వచ్చింది. తగ్గింది. హమ్మయ్యా అని ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి. కొందరికి అంతర్గత అవయవాలు దెబ్బతింటున్నాయి. మరికొందరికి రక్తం చిక్కబడి గుండెపోటుకు దారి తీస్తోంది. ఇంకొందరు ఊపిరితిత్తులు చెడిపోయి చనిపోతున్నారు. ఒకవేళ.. బతుకు జీవుడా అంటూ ఈ గండాలన్నిటినీ తప్పించుకున్నా.. బ్లాక్ ఫంగస్ రూపంలో మరో మహమ్మారి ముంచేస్తోంది. బ్లాక్ ఫంగస్కు వైట్ ఫంగస్ కూడా జతకలిసి.. జనాలపై విరుచుకుపడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండటం కలవరానికి గురి చేస్తోంది. ఇలా.. ఇన్ని సమస్యలున్నా చాలవన్నట్టు.. తాజాగా మరో కొత్త ముప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరించడం మరింత ఆందోళనకరం.
కరోనా నుంచి కోలుకున్న వారికి ‘గ్యాంగ్రిన్’ రూపంలో మరో గండం ఎదురవుతోంది. ‘బ్లాక్ ఫంగస్’ సోకితే.. కంటి చూపును కోల్పోయే ముప్పుతో పాటు మొత్తం దవడనే తీసేయాల్సి రావచ్చు. ‘గ్యాంగ్రిన్’ చుట్టుముడితే.. అది వ్యాపించిన కాళ్లు, చేతులను మొత్తానికి మొత్తం తొలగించాల్సి వస్తుంది. ఈ సమస్యతో ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య మార్చి నుంచే క్రమంగా పెరుగుతోందని అహ్మదాబాద్కు చెందిన వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ మనీశ్ రావల్ హెచ్చరించారు.
గ్యాంగ్రిన్ బాధితుల్లో ఎక్కువ మంది కొవిడ్ నుంచి కోలుకున్న వారేనన్నారు. ఈ ఆరోగ్య సమస్యకు ప్రధాన కారణం ‘త్రాంబోసిస్’ అని ఆయన తెలిపారు. కొవిడ్ నుంచి కోలుకున్న కొందరిలో రోగ నిరోధక వ్యవస్థ పనితీరు క్షీణించి త్రాంబోసిస్కు దారితీస్తోందన్నారు. ఫలితంగా బాధితుల రక్తనాళాల్లో రక్తం గడ్డకడుతోందని వివరించారు. గుండె నుంచి వివిధ శరీర భాగాలకు రక్తాన్ని తీసుకెళ్లే ధమనులు దెబ్బతింటున్నాయి.
‘‘ఉదాహరణకు కాలిలోని ఒక ధమని త్రాంబోసిస్తో ప్రభావితమైతే.. మొత్తం కాలు బరువుగా, మొద్దుబారినట్లు అనిపిస్తుంది. ఆ తర్వాత కాలు పూర్తిగా చల్లబడిపోతుంది. కాలు తొలుత నీలిరంగుకు, తర్వాత ఎరుపు రంగులోకి మారిపోతుంది. ఈ స్థితినే గ్యాంగ్రిన్ అంటారు. దీని లక్షణాలను గుర్తించిన గంట నుంచి ఆరు గంటల్లోగా చికిత్స చేయించుకోవాలి. లేదంటే ఆ కాలును తీసేయాల్సి రావచ్చు’’ అని వైద్యులు అంటున్నారు. శరీరంలోని ఏ భాగాన్నైనా గ్యాంగ్రిన్ ప్రభావితం చేయగలదని హెచ్చరించారు. త్రాంబోసిస్కు సకాలంలో చికిత్స తీసుకోవడం ద్వారా ముప్పు నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో.. ఈ గ్యాంగ్రిన్ కేసులు ఎక్కువగా కనిపిస్తుండటంతో.. బాధితులు అప్రమత్తంగా ఉండాలంటూ వైద్యులు సూచిస్తున్నారు.