ప్రజాశాంతి గూటికి ప్రజాయుద్ధ నౌక.. మునుగోడులో పాల్ పార్టీ అభ్యర్థిగా గద్దర్!

ప్రజా గాయకుడు,   ప్ర‌జా యుద్ధ నౌక‌గా తెలంగాణ‌లో ఎంతో గుర్తింపు పొందిన గద్ద‌ర్‌.. కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీలో చేరారు. కేఏ పాల్ స‌మ‌క్షంలో ఆ పార్టీ గూటికివ చేరిన గ‌ద్ద‌ర్ వ‌చ్చే నెల‌లో జ‌రగనున్న మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో ప్ర‌జా శాంతి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. ప్రజాశాంతి పార్టీలో చేరిన సందర్భంగా విలేకరులతో మాట్లాడిన గద్దర్.. మునుగోడులో పోటీ చేయనున్నట్లు చెప్పారు.

గురువారం (అక్టోబర్ 6) నుంచి మునుగోడులో ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నట్లు గద్దర్ తెలిపారు. మ‌రో వైపు  అక్టోబర్  2న గాంధీ జయంతి సందర్భంగా తలపెట్టిన పీస్ మీటింగ్ కు పోలీసులు అనుమ‌తి నిరాకరించడాన్ని నిరసిస్తూ చేస్తున్న ఆమరణ దీక్షను కేఏ పాల్ బుధవారం (అక్టోబర్ 5) విర‌మించారు.  గ‌ద్ద‌రే ఆయనకు నిమ్మ‌రసం ఇచ్చి దీక్ష విర‌మింపజేశారు. ఇక గద్దర్ విషయానికి వస్తే.. కాగా, ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం  గ‌ద్ద‌ర్ త‌న పాట‌ల‌తో తెలంగాణ స‌మాజాన్ని ఉర్రూతలూగించారు. తెలంగాణ ఉద్య‌మంలో సైతం ఆయ‌న పాట‌లు ఎందరిలోనో స్ఫూర్తిని ర‌గిలించాయి. అయితే, ఇటీవలి కాలంలో ఆయన పంథాలో, ఆలోచనా విధానంలో వచ్చిన మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

 పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పట్ల, ఎన్నికల పట్ల నమ్మకం లేదని చెబుతూ, గతంలో గ‌తంలో ఎప్పుడూ ఓటు హ‌క్కు వినియోగించుకోని గ‌ద్ద‌ర్ ఇటీవలి కాలంలో ఆ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. ఓటు వేశారు. అలాగే, హైద‌రాబాద్ లో జ‌రిగిన న‌రేంద్ర మోదీ బ‌హిరంగ స‌భ‌కు హాజ‌రయ్యారు.  అలాగే, గాంధీ భ‌వ‌న్ కు కూడా వెళ్లారు. ఆయన రాజకీయాలలో ప్రవేశించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారనీ, అయితే కాంగ్రెస్, లేదా బీజేపీలో చేరడం ఖాయమనీ కూడా వార్తలు వినవచ్చాయి. అయితే అనూహ్యంగా ఆయన కేఏ పాల్ నేతృత్వంలోని ప్రజాశాంతి పార్టీలో చేరారు.

Teluguone gnews banner