యస్.. పున్నమి + సంపూర్ణ చంద్రగ్రహణం.. ఫుల్ మూన్ ఎఫెక్ట్..
posted on May 26, 2021 @ 3:58PM
యస్ తుఫాను తీరం దాటింది. ప్రచండ వేగంతో తూర్పు తీరంపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే బెంగాల్, ఒడిశా తీర ప్రాంతాలను అతలాకుతలం చేసింది. ఆంధ్రప్రదేశ్పైనా కాస్త ప్రభావం చూపింది. తీరం దాటినా ముప్పు ఇంకా తొలగిపోలేదు. ప్రమాదం పొంచే ఉంది. తుఫానుకు ‘పున్నమి’ తోడైంది. దీంతో తీరం దాటినా కూడా మరింత ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.
బుధవారం పౌర్ణమి.. దీనికి తోడు సంపూర్ణ చంద్రగ్రహణం కూడా ఉంది. ఆ సమయంలో అలల ఉద్ధృతితో సముద్రం మరింత అల్లకల్లోలంగా ఉంటుంది. అందుకే, తీర ప్రాంతాల్లో తుఫాను మరింత బీభత్సం సృష్టించనుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. బెంగాల్లోని ఐదు సబ్ డివిజన్లు, ఒడిశాలోని నాలుగు బ్లాక్లు నీట మునిగే ప్రమాదముందన్నారు. ఉత్తర కోస్తాకు వర్ష ముప్పు పొంచి ఉంది.
చంద్రుడు భూమికి చాలా దగ్గరగా వచ్చినప్పుడు సూపర్మూన్ కన్పిస్తుంది. ఆ సమయంలో సముద్రంలో ఆటు-పోట్లు విపరీతంగా ఉంటాయి. అలలు గరిష్ఠ ఎత్తులో ఎగసిపడుతుంటాయి. ఇక చంద్రగ్రహణం కూడా ఇదే రోజున ఉంది. భారత్లో బుధవారం మధ్యాహ్నం 3.15 గంటల నుంచి చంద్రగ్రహణం మొదలవనుంది. దీంతో సాయంత్రం తీర ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
మరోవైపు, యస్ తుపాను ధాటికి ఇప్పటికే బెంగాల్, ఒడిశాలోని తీర ప్రాంతాలు అల్లాడిపోతున్నాయి. గంటకు 155 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు వీస్తుండటంతో అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. భవనాలు ధ్వంసమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నదులను తలపిస్తున్నాయి. ప్రచండ గాలులకు ఇంటి పైకప్పులు ఎగిరిపడ్డాయి. ముంపు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రస్తుతం తుఫాను వాయువ్య దిశగా కదులుతూ బలహీనపడనుందని వాతావరణ శాఖ తెలిపింది.