జైలులో మంటలు.. 41 మంది ఖైదీలు సజీవ దహనం
posted on Sep 8, 2021 @ 9:30AM
ఇండోనేషియా రాజధాని జకార్తాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. టాంగెరాంగ్ జైలులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 41 మంది ఖైదీలు మరణించారు. మరో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం తెల్లవారు జామున జైలులోని సి బ్లాక్ లో మొదట మంటలు వచ్చాయి. నిమిషాల్లో మొత్తం విస్తరించాయి. మంటలు భారీగా ఎగిసిపడటంతో తమ గదుల్లో ఉన్న ఖైదీలు తప్పించుకునే మార్గం లేక విలవిల్లాడారు. అధికారులు స్పందించినప్పటికీ, అప్పటికే పదుల సంఖ్యలో ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. అగ్ని ప్రమాదానికి కారణం ఏంటన్నది ఇంకా తెలియరాలేదు.
టాంగెరాంగ్ జైలును 1225 మంది ఖైదీలు ఉండడానికి వీలుగా నిర్మించినా, దీంట్లో ప్రస్తుతం 2 వేల మందికి పైగా ఖైదీలు ఉన్నారు. అగ్నిప్రమాదం జరిగిన సి బ్లాక్ లో ప్రమాదం జరిగిన సమయంలో 122 మంది ఖైదీలు ఉన్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. జైళ్లలో ఘర్షణలు, తద్వారా ఇలాంటి అగ్నిప్రమాదాలు సంభవించడం ఇండోనేషియాలో సర్వసాధారణం. ఈ కోణంలోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. టాంగెరాంగ్ జైలులో ఎక్కువగా మాదకద్రవ్యాల కేసుల్లో పట్టుబడిన వారిని ఖైదు చేస్తుంటారు.